టీడీపీలో నవంబరు సునామీ..నిజమేనా?

ప్రతిప‌క్ష టీడీపీలో చాలా సైలెంట్ నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? కూడా చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీలో కీల‌కంగా భావించిన నాయ‌కులు ఒక్కరొక్కరుగా జంప్ చేస్తున్నారు. [more]

Update: 2019-11-15 12:30 GMT

ప్రతిప‌క్ష టీడీపీలో చాలా సైలెంట్ నెల‌కొంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? కూడా చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీలో కీల‌కంగా భావించిన నాయ‌కులు ఒక్కరొక్కరుగా జంప్ చేస్తున్నారు. నిన్నటి వ‌ర‌కు పార్టీని వీడేది లేదు.. నాలో ప‌చ్చ ర‌క్తమే ప్రవ‌హిస్తోంద‌న్న నాయ‌కులు సైతం ఓవ‌ర్ నైట్ రంగులు మార్చేస్తున్నారు. ఈ ప‌రిణామంతో పార్టీలో ఏదో జ‌రుగుతోంద‌నే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా దేవినేని అవినాష్ పార్టీ మార్పు ముందుగానే ఊహించినా.. త‌ర్వాత ఆయ‌న పార్టీ అధినేత‌కు చేరువ‌య్యారు. విజ‌య‌వాడ‌లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి కూడా హాజ‌ర‌య్యారు.

ఒక్కొక్కరుగా…..

దీంతో అవినాష్‌పై అప్పటి వ‌ర‌కు అనుమానం వ్యక్తం చేసిన వారు కూడా స‌ర్దుకున్నారు. కానీ, ఇంత‌లోనే చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ఇసుక దీక్షను చేసిన రోజే.. అవినాష్ పార్టీ మారిపోయారు. ఇక‌, నిన్న మొన్న టి వ‌ర‌కు రాజ‌కీయాల‌కే దూరంగా ఉన్నాన‌ని చెప్పిన ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ కూడా అదే రోజు త‌న రాజ కీయ అడుగులు జ‌గ‌న్‌తోనే అని చెప్పడం కూడా సంచ‌లనంగా మారిపోయింది. ఇక‌, ఇప్పటికే ఊగిసలాటలో ఉన్న ఎంపీ కేశినేని నాని.. కూడా నిన్న మొన్నటి వ‌ర‌కు చంద్రబాబు అత్యంత స‌న్నిహితుడుగా తిరిగారు. విశాఖ‌లో పార్టీ కార్యక్రమాల‌కు కూడా హాజ‌ర‌య్యారు.

కీలక నేతలు అనుకున్న వారు కూడా….

మ‌రి, ఇలాంటి నాయ‌కుడు కూడా పార్టీ చేప‌ట్టి ఇసుక దీక్షకు దూరంగా ఉన్నారు. ఇక‌, గంటా శ్రీనివాస‌రావు సంగ‌తి స‌రేస‌రి. ఆయ‌న టీడీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టప‌డ‌డం లేద‌న్నది నిజం. స‌రైన టైం చూసుకుని ఆయ‌న గోడ దూకేందుకు కాచుకుని ఉన్నాడు. గంటా బాబు పెట్టిన ఏ మీటింగ్‌కు రావ‌డం లేదు. ఈ క్రమంలోనే ఈ దీక్షకు రాక‌పోవ‌డంలో ఆశ్చర్యం లేదు. కీల‌క నాయ‌కులు ప‌రిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌, అయ్యన్నపాత్రుడు కుమారుడు వంటివారు కూడా హాజ‌రుకాలేదు.

ఎమ్మెల్యేలు హాజరు కాకున్నా….

ఇక ఈ దీక్షకు హాజ‌రు కాని ఎమ్మెల్యేలు సొంత ప‌నులు ఉన్నాయ‌ని చెప్పి రాక‌పోయినా కూడా అనేక అనుమానాలు ముసురుకున్నాయి. దీనిని బ‌ట్టి.. పార్టీలో అంత‌ర్గతంగా ఏదో జ‌రుగుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అది చంద్ర బాబు వైఖ‌రిపై అసంతృప్తా.. లేక ప్రభుత్వం ఏర్పడి ఇంకా ప‌ట్టుమ‌ని ఆరు మాసాలు కూడా కాకుండానే ఇలా దీక్షల‌కు దిగ‌డం స‌రికాద‌నే ఉద్దేశ‌మా ? అనేది అంతుబ‌ట్టడం లేదు. గురువారం దీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేల్లోనే కొంద‌రు శుక్రవారం బాబు నిర్వహించిన ఎమ్మెల్యేల స‌మావేశానికి వ‌చ్చారు. ఏదేమైనా అస‌లు పార్టీలో ఎవ‌రు ఎవ‌రిని న‌మ్మాలో ? తెలియ‌డం లేదు. చంద్రబాబు సైతం చివ‌ర‌కు పూర్తి డిఫెన్స్‌లో ప‌డిపోయారు. ఏదేమైనా ప్రస్తుత ప‌రిణామాల‌పై చంద్రబాబు లోతైన దృష్టి పెట్టాల‌నేది వాస్తవం.

Tags:    

Similar News