ఉత్తరాంధ్ర వైసీపీకి జగన్ మార్క్ న్యాయం

పదవుల పందేరంలో, అయిన వారికి న్యాయం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ని గుర్తుకు తెస్తారు. హామీ ఇవ్వడానికే ఆలోచిస్తారు తప్ప ఒకసారి [more]

Update: 2019-06-21 04:30 GMT

పదవుల పందేరంలో, అయిన వారికి న్యాయం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ని గుర్తుకు తెస్తారు. హామీ ఇవ్వడానికే ఆలోచిస్తారు తప్ప ఒకసారి మాట ఇస్తే మాత్రం నెరవేర్చి తీరుతారు. ఇది తాజా ఎన్నికల తరువాత జగన్ మోహన్ రెడ్డి గట్టిగా రుజువు చేసుకున్నారు. లేకపోతే ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలను పిలిచి మరీ పెద్ద పీట వేసి మంత్రులుగా చేయడం జగన్ కి తప్ప ఎవరికి సాధ్యం. ఇక గతసారి కేవలం 9 అసెంబ్లీ సీట్లే ఇచ్చిన ఉత్తరాంధ్ర జిల్లాలు ఈసారి ఏకంగా మూడు రెట్లు అంటే 28 సీట్లు ఇచ్చి ఫ్యాన్ గాలి రెపరెపలాడేలా చేశాయి. దానికి తోడు పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్టీలు, కాపులు వైసీపీని సమాదరించాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి సైతం ఉత్తరాంధ్రకు రాజకీయంగా న్యాయం చేయాలనుకున్నారు.

అరుదైన గౌరవం :

దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయంగా సరైన స్థానాన్ని దక్కించుకోవడంలో వెనకబడ్డాయి. అటువంటిది జగన్ మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. పైగా గిరిజన మహిళకు, వెనకబడిన విజయనగరం జిల్లాకు ఆ గౌరవం దక్కించారు. దాంతో ఉత్తరాంధ్ర ఇపుడు రాజకీయంగా ప్రాధాన్యతను సాధించినట్లైంది. అదే విధంగా బీసీలకు పెద్ద పీట వేస్తూ విజయనగరం, శ్రీకాకుళం నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన క్రిష్ణదాస్ లకు మంత్రి పదవులు ఇవ్వడం కూడా గొప్ప సామాజిక సమీకరణే. విశాఖ నుంచి కాపుల కోటాలో అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చి సమ న్యాయం చేసిన జగన్ విశాఖ రూరల్ జిల్లా నుంచి పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చి గౌరవించారు.

ప్యానల్ స్పీకర్లుగా :

ఇక ఇపుడు ప్యానల్ స్పీకర్లుగా ఇద్దరిని నియమించి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రా ప్రాధాన్యం మరింతగా పెంచారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి సీనియర్ ఎమ్మెల్యే ఎస్టీ కేటగిరీకి చెందిన రాజన్నదొరకు, అలాగే శ్రీకాకుళం పాలకొండ ఎస్టీ క్యాటగిరీకి చెందిన విశ్వాసరాయి కళావతికి ప్యానల్ స్పీకర్లుగా జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించడం విశేషం. ఈ విధంగా చూస్తే ఎస్టీలు ముగ్గురుకు, బీసీలు ముగ్గురుకు, కాపులు ఒకరికి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రభుత్వ పదవులు అప్పగించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి సామాజిన న్యాయం సరిగ్గానే చేశాననిపించుకున్నారు. వైసీపీనే నమ్ముకున్న ఎస్టీలు, బీసీలకు తాను వెన్నుదన్నుగా నిలుస్తానన్న సందేశాన్ని కూడా ఆయన వినిపించారు. మరి రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు కూడా ఈ జిల్లాలకు పెద్ద ఎత్తున లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News