నోరెత్తడం లేదెందుకనో..?

విశాఖ వాసుల చిరకాల కోరిక రైల్వే జోన్. సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని అది తీరింది. ప్రధాని మోడీ స్వయంగా అప్పటి విశాఖ టూర్లో భారీ ప్రకటన [more]

Update: 2019-08-15 03:30 GMT

విశాఖ వాసుల చిరకాల కోరిక రైల్వే జోన్. సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని అది తీరింది. ప్రధాని మోడీ స్వయంగా అప్పటి విశాఖ టూర్లో భారీ ప్రకటన చేశారు. దాంతో జనాల్లో ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ తరువాత తెలిసింది. ఈ ప్రకటన వెనక ఉన్న మతలబు. బంగారం లాంటి వాల్తేర్ జోన్ని కత్తిరించి మరీ జోన్ కి ప్రాణం పోశారు ఢిల్లీ ప్రభువులు. వాల్తేర్ డివిజన్ చారిత్రాత్మకమైనది. 167 ఏళ్ళ నుంచి కొనసాగుతోంది. బ్రిటిష్ పాలకులు విశాఖకు కానుకగా ఇచ్చింది. లాభాల బాటల్లో ఇన్నాళ్ళూ నడుస్తూ వచ్చింది. దేశంలో మూడవ స్థానంలో ఉన్న అతి ముఖ్యమైన వాల్తేర్ డివిజన్ కుత్తుక కోసి జోన్ ఇచ్చాం పొమ్మన్నారు. ఏడాదికి 12 వేల కోట్ల పై చిలుకు ఆదాయం వాలేరు డివిజన్ కి వస్తుంది. అటువంటి డివిజన్లో మెజారిటీ భాగాన్ని ఒడిషాలోని ఈస్ట్ కోస్ట్ జోన్ కి కట్టబెట్టేశారు. రాయగడ పేరు మీద కొత్త డివిజన్ అక్కడ ఏర్పాటు చేసి దాన్లో కలిపేశారు. ఇక మిగిలిన దాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేశారు. ఇలా అశాస్ట్రీయంగా చేసిన ఈ విభజన పట్ల విశాఖ వాసులు రగిలిపోతున్నారు.

ఉలుకూ పలుకూ లేని…..

చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ని ముక్కలు చేసి అసలు ఉనికి లేకుండా చేసినా కూడా రాజకీయ పార్టీలు కనీసం గొంతెత్తి ఇదేమని అడగకపోవడంపై నగర వాసులతో పాటు రైల్వే ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. బంగారు బాతుగుడ్డు లాంటి వాల్తేర్ డివిజన్ని ఒడిషాకు కట్టబెడితే ఇక్కడ రాజకీయ నేతలకు కనీసం అడిగే ధైర్యం లేదా అని నిగ్గదీస్తున్నారు. ఒడిషా రాజకీయానికి కేంద్రం తలవంచిందని, అదే విశాఖలో గొంతులు ఏకం కాకపోవడం వల్ల పేరుకు జోన్ ఇచ్చామనిపించేశార‌ని అంటున్నారు. దీంతో ఇపుడు వేలల్లో ఉన్న వాల్తేరు డివిజన్ ఉద్యోగులు పుట్టకొకరు, చెట్టుకొకరుగా విడిపోతున్నారు. . కొందరు విజయవాడకు వెళ్తూంటే మరికొందరు రాయగడకు పోవాల్సివస్తోంది. ఇక పేరుకు విశాఖకు జోన్ ఇచ్చినా లాభాలు లేని డివిజన్లతో మనుగడ ఎలా ఉంటుందన్నది కూడా అతి పెద్ద ప్రశ్నగా ఉంది.

పోరాటాలకు రెడీ…..

వాల్తేరు తో కూడిన జోన్ కావాలంటూ జనం ఉద్యమిస్తున్నారు. అదే సమయంలో రైల్వే ఉద్యోగులు కూడా తమ డిమాండ్ ని గట్టిగా వినిపిస్తున్నారు అరకు కేకే రైల్వే లైన్ వంటివి ఇకపై రాయగడ డివిజన్లోకి వెళ్ళిపోతున్నాయి. సరకు రవాణా ద్వారానే వాల్తేర్ డివిజన్ కి భారీగా ఆదాయం వస్తుంది. ఇపుడు అవి రాయగడకు సమకూరుతాయని, విజయవాడలో మిగిలిన ప్రాంతాలు కలిపినందువల్ల దమ్మిడీ కూడా ఆదాయం రాదని అంటున్నారు. రేపటి రోజున నష్టాల్లో ఉన్న జోన్ అంటూ దాన్ని కూడా రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అనుమానిస్తున్నారు. . విశాఖ వాసులు అంటే అంత చులకనా, మా తీపి గురుతు గా ఉన్న వాల్తేర్ డివిజన్ని చెరిపేయడాన్ని బీజేపీ నాయకులు ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి విశాఖకు శాంతి లేకుండా డివిజన్ పోరును తగిలించి కేంద్ర పాలకులు తమాషా చూస్తున్నారని జనం అంటున్నారు.

Tags:    

Similar News