నిర్మలమ్మా అన్నీ అమ్మేసుకోవమ్మా?

ఆమె తమిళనాడు ఆడపడుచు, తెలుగు వారి కోడలు. కానీ తెలుగు వారికే ఆమె తీరు వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. ఏపీకి సరిగ్గా నిధుల కేటాయింపులు లేని [more]

Update: 2021-03-10 13:30 GMT

ఆమె తమిళనాడు ఆడపడుచు, తెలుగు వారి కోడలు. కానీ తెలుగు వారికే ఆమె తీరు వల్ల తీరని అన్యాయం జరుగుతోంది. ఏపీకి సరిగ్గా నిధుల కేటాయింపులు లేని బడ్జెట్ ని వరసగా రెండేళ్ల పాటు ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దే. ఇక ఇపుడు చూస్తే ఏకంగా విశాఖ వాసుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని నూటికి నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని నిండు పార్లమెంట్ లో కుండబద్ధలు కొట్టేశారు. దాంతో నిర్మలంగా నిబ్బరంగా ఉన్న విశాఖలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.

పేరే మార్చేశారుగా…?

హైదరాబాద్ పేరుని మారుస్తామంటూ తరచూ బీజేపీ నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. హైదరాబాద్ సంగతేమో కానీ విశాఖ పేరుని మాత్రం క్షణాల్లో మార్చేశారు. ఉక్కునగరంగా చెక్కు చెదరని పేరుతో అలరారుతున్న విశాఖకు ఆ ఘనకీర్తిని గత కీర్తిగా చేసేశారు. మీరు ఏమైనా చేసుకోండి ఉక్కు కర్మాగారం మాత్రం ప్రైవేట్ పరం కాక తప్పదంటూ నిర్మలా సీతారామన్ చెప్పడం ద్వారా స్టీల్ సిటీ గాలి తీసేశారు.

ఏం చేయలేరుగా…?

ఏపీలో కప్పలతక్కెడ వ్యవహారం రాజకీయం కేంద్రానికి ఎపుడూ కలసివస్తోంది. అది సమైకాంధ్ర ఉద్యమం ద్వారా తొలిగా బయటపడింది. ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కినా కూడా కిక్కురుమనలేని రాజకీయ దౌర్బల్యాన్ని చూసే దూకుడు చేస్తోంది కేంద్రం అంటే తప్పులేదుగా. స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోంది. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇందులో రాష్ట్రానికి ఏమీ సంబంధం లేదు అని నిర్మలా సీతారామన్ చెప్పేశాక అంతా కలసి దండెత్తాల్సింది కేంద్రం మీదనే. కానీ ఏపీలో టీడీపీ మాత్రం వైసీపీనే టార్గెట్ చేస్తోంది. దాంతో సేఫ్ జోన్ లోకి బీజేపీ వెళ్ళిపోయింది.

ఐక్యత ఎండమావి…?

వారూ వీరూ అన్న తేడా లేకుండా అంతా కలసి ఢిల్లీ వెళ్లాలని అమీ తుమీ తేల్చుకుని రావాలని విశాఖ ఉక్కు కార్మికులు ఓ వైపున గర్జిస్తున్నారు. కానీ ఏపీలో సీన్ చూస్తే టీడీపీ తన బాణాలు అన్నీ కూడా వైసీపీ మీదకే ఎక్కుపెట్టింది. మరి ఈ విషయంలో గల్లీలోనే యుద్ధం చేయడానికే, చిల్లర రాజకీయం చూసుకోవడానికే టీడీపీ చూస్తోందని వైసీపీ అంటోంది. ఇలా పరస్పరం విమర్శలు చేసుకుంటూ పోతున్నారు కానీ కేంద్రాన్ని నిలదీసే శక్తి ఎవరికీ లేదు. అందుకే ఉక్కు పోరాటం కాస్తా దిక్కులేనిదే అయిపోతోంది. చివరికి ప్రశాంత విశాఖలో అగ్గి రాజుకుంది కానీ ఆ వేడి మాత్రం ఏపీ రాజకీయాల్లో చురుకుదనం పుట్టించలేకపోతోంది.

Tags:    

Similar News