నీటుగా నిర్మలమ్మ ఎంట్రీ ?

ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేతలకు కొదవ లేదు, క్యాడర్ సంగతి పక్కన పెడితే కాషాయం పార్టీలో అంతా మహా నాయకులే. అందరూ రాష్ట్ర, జాతయ స్థాయి నాయకులే. [more]

Update: 2020-07-13 03:30 GMT

ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేతలకు కొదవ లేదు, క్యాడర్ సంగతి పక్కన పెడితే కాషాయం పార్టీలో అంతా మహా నాయకులే. అందరూ రాష్ట్ర, జాతయ స్థాయి నాయకులే. ఇందులో పాతా కొత్త రకాలు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ సానుభూతిపరులైన నేతలు ఉన్నారు. ఇంతటి గందరగోళంలో ఆర్ఎస్ఎస్ కి చెందిన నాయకులే అడుక్కి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్ధిక మంత్రిణి నిర్మలా సీతారామన్ హఠాత్తుగా రంగప్రవేశం చేయడమే బీజేపీ రాజకీయాల్లో ఆసక్తికర‌మైన అంశం. ఆమె ఈ మధ్య వర్చువల్ సెమినార్ ద్వారా ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆమె నేరుగా జగన్ సర్కార్ మీద భారీ డైలాగులు వదిలారు. గట్టి విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం అయిందంటూ ధాటీగానే తగులుకున్నారు.

అసలు మర్మనేంటి…?

ఇంతకీ మర్యాదగా, పద్ధతిగా కేవలం సబ్జెక్ట్ వరకే మాట్లాడే నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా అర్ధ శాస్త్రం వదిలి రాజకీయ శాస్త్రం వల్లించడంతో ఏపీ బీజేపీ నేతలు కూడా తడుముకున్నారు. ఆమె ఇతర నాయకుల మాదిరిగా చిల్లరగా మాట్లాడరు. కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ఒక రాష్ట్రం రాజకీయాలను కనీసంగా కూడా ప్రస్తావించరు. ఇప్పటివరకూ లేని హిస్టరీని తిరగరాస్తూ నిర్మలా సీతారామన్ జగన్ మీద ఆగ్రహోదగ్రురాలు కావడం వెనక కధేంటి అన్నది పెద్ద చర్చగా ఉంది. దీని మీద కమల‌నాధుల నుంచే సమాధానం కూడా వస్తోంది. నిర్మలమ్మను ఏపీ మీద ఫోకస్ పెట్టేలా ముందుకు తెస్తున్నరని పార్టీలో ఒక విధమైన టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అయిపోయారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా రాణించలేకపోతున్నారు. దాంతో నిర్మలా సీతారామన్ ని ఏపీ బరిలోకి దించాలన్నది జాతీయ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

ఆ కార్డుతో……..

నిర్మలా సీతారామన్ ఎటూ తెలుగింటి కోడలే. రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న పరకాల ప్రభాకర్ సతీమణి, పైగా గోదావరి జిల్లాలకు చెందిన దివంగత నేత, రాజకీయ గట్టి పిండం పరకాల‌ శేషావతారం గారి కోడలు. మరో వైపు చూసుకుంటే ఏపీ నుంచి ఆమె రాజ్యసభకు కూడా గతంలో ఎన్నికైంది. అదే విధంగా గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. మోడీ సైతం ఆమెకు ఎంతో ప్రాధ్యాన్యతను ఇస్తున్నారు. ఇక బీజేపీ వరకూ చూసుకుంటే ఆ పార్టీకి మొదటి నుంచి కాపులు, బ్రాహ్మణులు మద్దతు ఇస్తూ సంప్రదాయ‌ ఓటు బ్యాంక్ గా ఉన్నారు. అందువల్ల ఆమెను కనుక ముందుంచి ఏపీ రాజకీయాల్లో ప్రయోగిస్తే కమలానికి అన్ని మంచి శకునాలే అని పార్టీ పెద్దలు భావిస్తున్నారుట.

ముఖ్యమంత్రి అభ్యర్ధినిగా….

ఇదిలా ఉండగా నిర్మలా సీతారామన్ కు సబ్జెక్ట్ ఉంది. ఫేస్ వాల్యూగా మోడీ, వెనకాల పార్టీ గట్టిగా నిలబడుతుంది. వ్యూహాలకు ఆమె భర్త ప్రభాకర్ ఎటూ ఉన్నారు. ఇప్పటికే ఏపీలో కమ్మ, కాపుల మధ్యన సతమతమ‌వుతున్న ఏపీ బీజేపీకి ఆమె రూపంలో కొత్త నాయకత్వంగా అందునా మంచి ప్రతిభా పాటవాలు ఉన్న మహిళంగా నిర్మలా సీతారామన్ ను ముందు పెడితే ఏపీ ఓటర్లు మార్పు కోరుతూ ఈ వైపుగా తిరుగుతారని బీజేపీ పెద్దల ఆలోచన‌గా ఉందిట. ఇక కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె మీద జనాలకు గురి కుదిరే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారుట. మొత్తానికి మరో నాలుగేళ్ళలో ఎన్నికలు ఉన్నాయనగానే ఇప్పటి నుంచే బీజేపీ ఏపీ సీఎం క్యాండిడేట్ సెలెక్షన్ చేసి బరిలోకి దించుతోందా అన్న చర్చ మాత్రం సాగుతోంది. మరి గట్టి పిండమైన నిర్మలా సీతారామన్ తొలి సారి విసిరిన బాణాలకే వైసీపీ శిబిరం కొంత తడబడింది. మరి ఆమెనే ముందుంచి యుధ్ధం చేయమంటే మాత్రం ఏపీలో అధికార, విపక్ష రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News