నిమ్మల తన దారి వదలడం లేదే?

అధికారంలో లేనప్పుడు సమిష్టిగా పనిచేస్తేనే భవిష్యత్ లో విజయం వరిస్తుంది. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్న నేతలు మాత్రం తోటి పార్టీ నేతలతో [more]

Update: 2021-02-09 13:30 GMT

అధికారంలో లేనప్పుడు సమిష్టిగా పనిచేస్తేనే భవిష్యత్ లో విజయం వరిస్తుంది. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తున్న నేతలు మాత్రం తోటి పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటం లేదు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు సమసి పోవడం లేదు. రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప ఇప్పుడు యాక్టివ్ గా పెద్దగా లేకపోయినా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.

ఎంపీగా గెలిచినా….

ఆయన వరసగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా నిమ్మల కిష్టప్ప రెండుసార్లు విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనే నిమ్మల కిష్టప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయాలని విశ్వప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో నిమ్మలకిష్టప్ప ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

మనసంతా శాసనసభపైనే….

అయితే ఇటీవల కాలంలో నిమ్మల కిష్టప్ప యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన హిందూపురం పార్లమెంటు స్థానం కంటే శాసనసభ స్థానాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన ఎక్కువగా పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాలపైనే ఆసక్తి కనపరుస్తున్నారు. పెనుకొండలో బలమైన నేత ఉన్నారు. బీకే పార్థసారథి కూడా 2009, 2014 ఎన్నికల్లో గెలిచి పట్టు సంపాదంచారు. ఆయనను తట్టుకుని నిలబడం నిమ్మల కిష్టప్పకు కష్టమే.

పుట్టపర్తి నియోజకవర్గంపై…..

అందుకే నిమ్మల కిష్టప్ప చూపంతా ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాధరెడ్డి ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా బయటకు రావడం లేదు. ఈసారి చంద్రబాబు పల్లెను పక్కన పెడతారన్న ప్రచారం ఉంది. అందుకే నిమ్మల కిష్టప్ప కాన్సంట్రేషన్ అంతా పుట్టపర్తి నియోజకవర్గంపైనే పెట్టారంటున్నారు. దీంతో అక్కడ రెండు గ్రూపులు బయలుదేరాయి. ఈ సారి ఎన్నికల్లోనైనా నిమ్మల కిష్టప్ప ఆశనెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News