నిమ్మగడ్డ పావుగా మారుతున్నారా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంపై ఆయన రిట్ [more]

Update: 2021-01-11 14:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంపై ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి నుంచి వివాదంగానే ఉన్నారు. ఆయన చర్యలు, వ్యవహార శైలి ఒక పక్షానికి అనుకూలంగానే ఉన్నట్లు స్పష్టంగా కన్పించింది.

ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే?

ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గౌరవం దక్కి ఉండేది. కానీ ఆయన మరోసారి కాలు దువ్వేందుకు సిద్దమవుతున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగాలంటే ప్రభుత్వ సహకారం అవసరం. ప్రభుత్వ ఉద్యోగులు సయితం మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు అంశాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకారం లేదనే చెప్పాలి. అయినా ఆయన ఎన్నికలను నిర్వహించాలనే ముందుకు వెళుతున్నారు.

సానుకూలంగా వచ్చినా…..

స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. ఒకసారి షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఎక్కడా ఆగలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అయినా ఈ వివాదం ఇప్పట్లో తేలేది కాదు. డివిజన్ బెంచ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సానుకూల తీర్పు వచ్చినా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. అంటే ఎన్నికల ప్రక్రియలో కాలయాపన అనివార్యమన్నది ఖచ్చితం.

ఎన్నికల ప్రక్రియతోనే….?

మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సుముఖంగా లేకపోవడంతో వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయి. న్యాయప్రక్రియ ముగిసే నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తవుతుంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికే సిద్దమయ్యారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పావుగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News