ఇప్పట్లో దిగనంటున్న నిమ్మగడ్డ… జగన్ కు తలనొప్పే?

జగన్ సర్కార్ కి ఎందరో శత్రువులు. మరెందరో ప్రత్యర్ధులు. చంద్రబాబు ఏలుబడిలో ఒక్క జగనే గొంతెత్తి వాదించేవారు. బీజేపీ, జనసేన మిత్రులుగా ఉండేవారు. కాంగ్రెస్, వామపక్షాల సౌండ్ [more]

Update: 2021-01-11 06:30 GMT

జగన్ సర్కార్ కి ఎందరో శత్రువులు. మరెందరో ప్రత్యర్ధులు. చంద్రబాబు ఏలుబడిలో ఒక్క జగనే గొంతెత్తి వాదించేవారు. బీజేపీ, జనసేన మిత్రులుగా ఉండేవారు. కాంగ్రెస్, వామపక్షాల సౌండ్ కూడా నాడు పెద్దగా వినిపించేది కాదు. అదే జగన్ ముఖ్యమంత్రి అనేసరికి మొత్తానికి మొత్తం విపక్షం ఏకమైపోయింది. ఇక వ్యవస్థలతో కూడా జగన్ సర్కార్ నిత్య పోరాటం చేయడం విధి విచిత్రమే. ఏపీలో ఎన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ప్రభుత్వానికి మధ్య అతి పెద్ద సమరమే సాగుతోంది.

సహకారం బదులుగా…?

రెండు రాజ్యాంగబధ్ధమైన సంస్థల మధ్యన‌ ఉండాల్సింది సహకారం, అహంకారం కానే కాదు. మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది ఇదే. కానీ ఏపీలో మాత్రం సీన్ వేరుగా ఉంది. అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఎపుడు పెట్టాలి. వాయిదా వేయాలి అన్నది పూర్తిగా తన ఇష్టం అన్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని అని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీకి మంట పుట్టించే మరో వార్త ఇపుడు ప్రచారంలో ఉంది. అదెంతవరకూ నిజమో కానీ జరిగితే మాత్రం వైసీపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

మరికొంతకాలం….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఎంతవరకూ అంటే అంతా చెప్పే మాట ఈ ఏడాది మార్చి 31తో సరి అని. కానీ ఇపుడు మరింతకాలం తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ప్రచారం వైసీపీ శిబిరాన్ని కలవరపెడుతోంది. దానికి గల కారణాలు. ఆధారాలతో సహా ఆయన మరో తడవ కోర్టు మెట్లు ఎక్కుతారని కూడా అంటున్నారు. అదేంటి అంటే గత ఏడాది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అకారణంగా దించేసి చెన్నైకి చెందిన కనగరాజ్ ని రాత్రికి రాత్రి వైసీపీ సర్కార్ ఎస్ ఈసీ కుర్చీలో కూర్చోబెట్టింది. దాని మీద నిమ్మగడ్డ ఎంతో పోరాటం చేస్త తప్ప తిరిగి కుర్చీ దక్కలేదు. ఆ విధంగా ఆయనకు మూడు నెలల పదవీ కాలం నష్టం జరిగింది అని లెక్క తేల్చుతున్నారు.

అన్నీ నిర్వహించే రిటైర్మెంట్….?

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం చూస్తే ఏపీలో పంచాయతీ ఎన్నికలతో మొదలుపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపాలిటీల ఎన్నికలను కూడా నిర్వహించి కానీ రిటైర్ కాను అని చెబుతున్నారులా ఉందంటున్నారు. అందుకోసం ఆయన మరో మూడు నెలల గడువుని కోర్టు నుంచి కోరి మరీ తెచ్చుకుంటారని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం మూలంగా తన పదవిలో మూడు నెలల విలువైన టైమ్ కోత పడింది కాబట్టి దానికి బదులుగా తనను మరో మూడు నెలలు కొనసాగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనుక కోర్టుకు వెళ్తే తీర్పు ఎలా వస్తుందో మరి. ఆయనకు అనుకూలంగా వస్తే మాత్రం అనుకున్నట్లుగా అన్ని స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఖాయమే. ఇది వైసీపీకి భారీ షాకే మరి.

Tags:    

Similar News