అదే ప్రయత్నంలో నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. అయితే ఆయన హైకోర్టు ద్వారా ఎన్నికలకు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక [more]

Update: 2020-11-04 05:00 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. అయితే ఆయన హైకోర్టు ద్వారా ఎన్నికలకు ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు తన హయాంలోనే జరగాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన ఇటీవల అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలూ ఎన్నికలు సిద్ధమని ప్రకటించాయి.

వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా…..

దీంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య అధికారితో భేటీ అయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం కోవిడ్ వ్యాప్తి ప్రస్తుతం ఎక్కువగా ఉందని, పోలీసులు, ప్రభుత్వోద్యోగులు కూడా ఎక్కువ మంది వైరస్ బారిన పడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికల రూపంలో ఎన్నికల కమిషన్ కు అందించారు.

ఇతర రాష్ట్రాల్లో….

అయితే ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. ఇందుకు త్వరలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించనునన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు కూడా ఇటీవల ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టు ద్వారానే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

న్యాయస్థానం ద్వారానే…..

అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ విధంగా ముందుకు వెళ్లాలన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ యోచనగా ఉంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరి ప్రభుత్వం కూడా న్యాయపరంగానే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News