నిమ్మగడ్డ పౌరోహిత్యంలోనే ఎన్నికలా ?

కరోనా వచ్చి ఏడు నెలలు అయింది. ఏపీలో ఎన్నికలు వాయిదా పడి అంతే సమయం అయింది. నాడు ఏపీలో కరోనా పెద్దగా లేదు. ఇంకా ఎంట్రీ ఇచ్చింది. [more]

Update: 2020-10-16 05:00 GMT

కరోనా వచ్చి ఏడు నెలలు అయింది. ఏపీలో ఎన్నికలు వాయిదా పడి అంతే సమయం అయింది. నాడు ఏపీలో కరోనా పెద్దగా లేదు. ఇంకా ఎంట్రీ ఇచ్చింది. అయితే భయానికి, ముందు జాగ్రత్త చర్యలకు ఎన్నికలను వాయిదా వేశామని ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పట్లో పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా ఎన్నికల వాయిదా ప్రకటన చేశారు. సరే అది ఎంత పెద్ద వివాదం అయిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుర్చీని కూడా కదిలించే ప్రయత్నం చేశారు. ఆయన న్యాయ పోరాటం చేసిన మీదట సీట్లో కుదురుకున్నారు. కానీ ఆయన పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది.

ఆ ఊసే లేకుండా…

ఇపుడు ఏపీలో సీన్ రివర్స్ లో ఉంది. ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎన్నికలు నిర్వహించాలని ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇంతలా పోరాడి పంతం పట్టి అధికారంలోకి వచ్చాక తన చేతుల మీద ఎన్నికలు జరగకపోతే ఆ పదవికి విలువ ఏముంది. ఇదీ నిమ్మగడ్డ లాజిక్. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు వద్దు అనుకుంటోంది. దానికి కారణంగా కరోనాను చూపిస్తోంది. దీని మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూస్తే ఆనాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్లుగానే ఉంది. అంటే అటుది ఇటు ఇటుది అటు అయింది అన్న మాట.

రెడీనా మరి…..

ఇక ఎన్నికల సంఘం తీరు మాత్రం ఎన్నికలకు తాము రెడీ అన్నట్లుగా ఉందని చెబుతున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల పిటిషన్ మీద హైకోర్టు వ్యాఖ్యలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారుగా. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలకు అభ్యంతరం ఏంటి అన్నది ఉన్నత న్యాయ స్థానం ప్రశ్నగా ఉంది. దీనిమీద ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు కనుక ఆదేశిస్తే అపుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు ప్రభుత్వం రెడీగా ఉండాలి. సరే నిమ్మగడ్డను పూర్తిగా సమర్ధించిన తెలుగుదేశం పార్టీ అయినా ఈ ఎన్నికలకు సిధ్ధమేనా అన్నది కూడా మరో ప్రశ్న.

వైసీపీకే ప్లస్…..

ఇప్పటికిపుడు ఎన్నికలు లోకల్ బాడీలకు పెట్టినా వైసీపీకే ప్లస్ అని అధికార పార్టీలో వినిపిస్తున్న మాట. జగన్ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా కొరతా రానివ్వలేదు. పైగా జనం దగ్గర నాలుగు డబ్బులు నానేలా చేశారు. అన్ని విధాలుగా కరోనా వేళ ఆదుకున్నారు. ఇక ఇపుడు కరోనా కూడా తగ్గుముఖంపడుతోంది. దాంతో శీతాకాలం కూడా కావడంతో ఎన్నికలు పెడితే ఈ రకమైనా సమస్యలు లేకుండా ఏకపక్షంగానే వైసీపీకి జనం మద్దతు ఇస్తారని అంటున్నారు. అదే సమయంలో గత ఏడు నెలలుగా హైదరాబాద్ కే పరిమితం అయిన టీడీపీకి ఇవి చేదు ఫలితాలు ఇస్తాయని కూడా అంటున్నారు. ఇంత మంచి అవకాశాన్ని జగన్ ఎందుకు కాదనుకుంటున్నారు అంటే కచ్చితంగా చెప్పుకోవాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించే. ఆయన ఆ సీట్లో ఉండగా ఎన్నికలకు వెళ్లకూడదని జగన్ పంతంగా ఉంది. మరి దీని మీద హై కోర్టు ఆదేశించినా సుప్రీం కోర్టుకు వెళ్తారేమో కానీ ఎన్నికలకు సిద్ధపడరని అంటున్నారు.చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News