ముక్కలు చేస్తే చుక్కలు చూపిస్తారా ?

కొత్త జిల్లాలు కాదు కానీ సరికొత్త చిచ్చు రాజకీయంగా రగులుతోంది. తమ ప్రాంతాన్ని అలాగే ఉండనీయాలని అంతా అంటున్న వేళ పరిపాలనకు వీలుగా కొత్త జిల్లాల‌ విభజన [more]

Update: 2020-12-19 12:30 GMT

కొత్త జిల్లాలు కాదు కానీ సరికొత్త చిచ్చు రాజకీయంగా రగులుతోంది. తమ ప్రాంతాన్ని అలాగే ఉండనీయాలని అంతా అంటున్న వేళ పరిపాలనకు వీలుగా కొత్త జిల్లాల‌ విభజన ఎలా చేయాలో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖ వరకూ మూడు జిల్లాలూ ఈ విషయంలో చాలా వేడిగానే ఉన్నాయి. పాలకొండను చేస్తే జిల్లాను చేయండి లేకపోతే శ్రీకాకుళంలోనే కలిపి ఉంచండి అన్నది అక్కడ ప్రాంతం వారి డిమాండ్. ఇక రాజాం, ఎచ్చెర్లలను విజయనగరం జిల్లాలో కలిపిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నది జిల్లాలోని విపక్ష నేతల సమర నినాదంగా ఉంది.

లొల్లి మొదలైందిగా…?

ఇక విజయనగరం జిల్లాలో ఇపుడు తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అటు రాజాం, ఎచ్చెర్ల కనుక కలిస్తే పదకొండు అవుతాయి. అయితే ఎస్ కోట విశాఖలో చేరితే పది అసెంబ్లీ సీట్లుగా ఈ జిల్లా ఉంటుంది. అయితే రెండు రాకపోయినా ఫరవాలేదు కానీ ఉన్న ఎస్ కోట విడదీస్తే మాత్రం యుద్ధం తప్పదని విజయనగరం జిల్లాలో ప్రతిపక్ష రాజకీయ నాయకులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మీ ఇష్టాన విడదీస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అంటూ గద్దిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ విభజన తప్ప మరేమీ కాదని కూడా విమర్శలు చేస్తున్నారు.

మూడుగా విశాఖ ….

విశాఖ జిల్లాలో చూసుకుంటే మూడు కొత్త జిల్లాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. విశాఖ అర్బన్, రూరల్, ఏజెన్సీ జిల్లాలుగా ఇవి ఉంటాయని కూడా అంటున్నారు. విశాఖ అర్బన్ జిల్లాగా చూసుకుంటే ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అవన్నీ కూడా విశాఖ పార్లమెంట్ సీటు పరిధిలోకి వచ్చేవే. ఈ లెక్కన ఎస్ కోటను విశాఖ అర్బన్ జిల్లాలో కలపాల్సి ఉంటుంది అంటున్నారు. ఇక చిత్రమేంటంటే ఈ మధ్యలో ఉన్న పెందుర్తి అనకాపల్లిలో కలిపేసి దూరంగా విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్ కోటను ఎలా విశాఖలో కలుపుతారు అంటూ స్థానికంగా పెద్ద చర్చ సాగుతోంది, రచ్చ కూడా మొదలైపోయింది.

మాడుగుల హల్వా ఎవరికి…?

ఇక విశాఖ రూరల్ జిల్లాలో భాగంగా ఉంటూ రాజకీయంగా చైతన్యవంతంగా ఉన్న మాడుగుల అసెంబ్లీ సీటుని తీసుకెళ్ళి అరకులో విలీనం చేస్తామని అధికారులు లెక్కలు వేయడాన్ని ఆ ప్రాంతం వారు గట్టిగా ఖండిస్తున్నారు. దీనిమీద ఇప్పటికే టీడీపీ ఉద్యమాన్ని కూడా మొదలెట్టేసింది. మాడుగులలో టీడీపీకి గట్టి పట్టుంది. ఏజెన్సీలో వైసీపీకి బలం ఉంది. అందువల్లనే అరకులో మాడుగులను కలిపేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు. అరకు పేరిట కొత్త జిల్లా పెడితే పెట్టండి కానీ ఏజెన్సీకి ఏమాత్రం సంబంధం లేని మాడుగులను ఎలా కలుపుతారు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు గర్జిస్తున్నారు. ఇందులో ఏ మాత్రం తకరారు జరిగినా భారీ పోరాటానికి తాము సిధ్ధమని ప్రకటించారు. అరకుకు మాడుగుల ప్రజలు వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలా అంటూ ఆయన అపుడే జనాలను రెచ్చడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్రాలో ఇపుడు మూడు జిల్లాలు ఉన్నాయి. వాటిని ఆరుగా చేయాలని, కొత్తగా అరకు, పార్వతీపురం. అనకాపల్లి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అవాంతరాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News