జ‌నాలు మ‌ర్చిపోయిన నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వా? ఏంటో ఇది?

తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పార్టీని ప‌రుగులు పెట్టించాల‌నే నిర్ణయంతో పార్లమెంట‌రీ జిల్లాల‌కు పార్టీ త‌ర‌పున కొత్త అధ్యక్షుల‌ను నియ‌మించారు. అయితే, చాలా [more]

Update: 2020-10-05 14:30 GMT

తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పార్టీని ప‌రుగులు పెట్టించాల‌నే నిర్ణయంతో పార్లమెంట‌రీ జిల్లాల‌కు పార్టీ త‌ర‌పున కొత్త అధ్యక్షుల‌ను నియ‌మించారు. అయితే, చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశించిన వారికే ప‌ద‌వులు ద‌క్కాయి. వీరిలో కొంద‌రు పార్టీలోనూ చురుగ్గా ఉన్నారు. అంకిత భావంతో ప‌నిచేస్తున్నారు. ప్రజ‌ల్లో గుర్తింపు కూడా ఉంది. రాజ‌కీయంగా కూడా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. అయితే ప‌ద‌వులు ద‌క్కిన నేత‌ల్లో మెజార్టీ నేత‌లు మాత్రం పార్టీ త‌ర‌పున ఎప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా ఉన్న వారు కూడా కాదు. ఏదో నామ్‌కే వాస్తేగా ప‌ద‌వులు క‌ట్టబెట్టిన తీరు చూస్తుంటే చంద్రబాబుపై సొంత పార్టీ నేత‌ల నుంచే గుస్సా ఎదుర‌వుతోంది.

రెండు దశాబ్దాలుగా…..

ఈ విమ‌ర్శల లిస్టులో విజ‌య‌వాడ పార్లమెంట‌రీ జిల్లాకు జ‌రిగిన నియామ‌కం కూడా ఉంది. విజ‌య‌వాడ పార్లమెంట‌రీ జిల్లాకు మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాంను చంద్రబాబు నియ‌మించారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతే అయిన‌ప్పటికీ.. ఆయ‌న ఇటీవల కాలంలో యాక్టివ్‌గా లేరు. చంద్రబాబు మంత్రి వ‌ర్గం ఎక్సైజ్ శాఖ మంత్రిగా చ‌క్రం తిప్పిన‌ప్పుడు ఆయ‌న వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత చంద్రబాబు సైతం ఆయ‌న‌ను ప‌క్కన పెట్టారు. అయితే నెట్టెం రఘురాం ఇత‌ర పార్టీల్లోకి వెళ్లకుండా టీడీపీలోనే కొన‌సాగినా.. చాలా సంవ‌త్సరాలు పార్టీలో యాక్టివ్ రోల్ నుంచి త‌ప్పుకొన్నారు. పైగా ఆయ‌న‌కు ప్రజ‌ల్లోనూ మ‌ద్దతు లేదు.

చివరిగా 1994లో…..

నెట్టెం రఘురాం చివ‌రి సారిగా 1994లో జ‌గ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా ఎన్టీఆర్ ప్రభంజ‌నం వీచిన‌ప్పుడు మాత్రమే… ఆ త‌ర్వాత 1999, 2004 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా సామినేని ఉద‌య‌భాను చేతిలో ఓడిపోయారు. చివ‌ర‌కు 2009 ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు గెలిచే సీన్ లేద‌ని… తాను పోటీ నుంచి స్వయంగా త‌ప్పుకుని శ్రీరాం తాత‌య్యను రంగంలోకి దింపారు. అప్పటి నుంచే ర‌ఘురాం నిష్క్రియాత్మక నాయ‌కుడిగా మిగిలిపోయాడు. విచిత్రం ఏంటంటే 1999 త‌ర్వాత జ‌గ్గయ్యపేట‌లో రాజ‌కీయంగా ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గుతూ రాగా… 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక అప్పటికే వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే తాత‌య్య ఉండ‌గానే హ‌డావిడితో ఉనికి చాటుకునే ప్రయ‌త్నం చేశారు.

జనాలు మర్చిపోయిన…..

పార్టీలో, నియోజ‌క‌వ‌ర్గంలో నెట్టెం రఘురాం హ‌వా లేక‌పోయినా ఇప్పట‌కీ జ‌గ్గయ్యపేట నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ర‌ఘురాం కొన‌సాగుతున్నారు. ఇక జిల్లాలో కాదు క‌దా క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలోనే జ‌నాలు మ‌ర్చిపోయిన నెట్టెం రఘురాం లాంటి నేత‌ను తీసుకువ‌చ్చి.. అత్యంత కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో విజ‌య‌వాడ పార్లమెంట‌రీ జిల్లాకు అధ్యక్షుడిని చేయ‌డంపై పార్టీ సీనియ‌ర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది సీనియ‌ర్లు, యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు ఉండ‌గా.. నెట్టెం రఘురాంను ప‌నిగ‌ట్టుకుని తీసుకువ‌చ్చి ఇంత కీల‌క‌మైన బాధ్యత‌లు ఎందుకు అప్పగించార‌నే విష‌యంపై వారు మ‌ద‌‌న ప‌డుతున్నారు.

కీలకమైన ప్రాంతాల్లో…..

రాజ‌ధాని జిల్లా, పైగా విజ‌య‌వాడ లాంటి కీల‌క న‌గ‌రం ఉన్న పార్లమెంట‌రీ జిల్లాకు నెట్టెం రఘురాంను పార్టీ అధ్యక్షుడిని చేయ‌డం వ‌ల్ల ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ ప్రకారం ఆయ‌న ఫొటోలు వేసుకోవ‌డానికి త‌ప్పా పార్టీకి ఎంత మాత్రం ఉప‌యోగం ఉండ‌ద‌నే చ‌ర్చలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో కొంద‌రు అంస‌తృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజ‌య‌వాడ‌లో వైసీపీ వ్యూహాత్మకంగా ఎదుగుతోంది. ఈ క్రమంలో నెట్టెం రఘురాం వంటి ఔట్‌డేటెడ్ నేత‌తో పార్టీ ముందుకు సాగేనా అనే వ్యాఖ్యలు కూడావినిపిస్తున్నాయి.

Tags:    

Similar News