కరేబియన్ దీవులే కాపాడుతున్నాయా?

కరేబియన్ దీవులు గురించి భారతీయులకు తెలిసింది తక్కువే. కానీ భారత పారిశ్రామిక వేత్తలకు ఆ దేశాల గురించి చాలా లోతుగా తెలుసు. అవి వారిపాలిట స్వర్గథామల్లాంటివి. భారతదేశంలోని [more]

Update: 2021-06-20 16:30 GMT

కరేబియన్ దీవులు గురించి భారతీయులకు తెలిసింది తక్కువే. కానీ భారత పారిశ్రామిక వేత్తలకు ఆ దేశాల గురించి చాలా లోతుగా తెలుసు. అవి వారిపాలిట స్వర్గథామల్లాంటివి. భారతదేశంలోని రుణ ఎగవేతదారులకు అవి అత్యంత సురక్షిత ప్రదేశాలు. అంతర్జాతీయ చట్టాలు వారిని ఏమీ చేయలేవు. సొంత దేశాలలో ఎన్ని కేసులున్నప్పటికీ వారిపై ఈగ వాలదు. దర్జాగా, దిలాసాగా బతకవచ్చు. ఎనిమిదో దశకంలో సెయింట్స్ కుంభకోణం ద్వారా భారతీయులకు కరేబియన్ దీవుల గురించి కొంతవరకు పరిచయం. 1989లో నాటి ప్రధాని విశ్వనాథ్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. అంతకుముందు వెస్టీండీస్ క్రికెట్ జట్టు ద్వారా కరేబియన్ దీవుల గురించి కొంతవరకు తెలుసు. ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ మన్ననలు అందుకుంది. ఈ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాళ్లు వివియన్ రిచరడ్స్ , గర్డర్ గ్రినిడ్జ్ , డెస్మెండ్ హేన్స్, మాల్కం మార్షల్, రిచీ రిచర్డ్ తమ ప్రతిభా పాటవాలతో గుర్తింపు పొందారు. తాజాగా వివిధ దేశాల్లోని పన్ను ఎగవేతదారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా కరేబియన్ దీవులు వార్తల్లోకి ఎక్కాయి.

చోక్సీ బ్యాంకులను మోసగించి…

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సుమారు రూ.13,500 కోట్ల వరకు ఎగ్గొట్టిన మెహుల్ చోక్సీని నిర్బంధంలోకి తీసుకునేందుకు దేశంలోనిదర్యాప్తు సంస్థలు శ్రమిస్తున్నాయి. కోర్టులు, వారంట్ల పేరుతో అవి తిరుగుతున్నాయి. కానీ చోక్సీ మాత్రం కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో విలాసవంతమైన జీవనం గడుపుతూ ఒక్కసారిగా కనపడకుండా పోయాడు. తరవాత క్యూబా వెళుతూ మార్గమధ్యంలో డొమినికా సముద్రతీరాన తచ్చాడుతుండగా పోలీసులుకు చిక్కాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కుంభకోణానికి సంబంధించి దేశం నుంచి తప్పించుకుపోయిన లలిత్ మోదీ అక్కడ చీకూచింత లేని జీవనం గడుపుతున్నాడు. చోక్సీ, మోదీ ఎక్కడున్నారో తెలిసినప్పటికీ వారిని పట్టుకోవడం భారతీయ చట్టాలకు సాధ్యపడటం లేదు. భవిష్యత్తులో అయినావారిని చట్టం ముందు నిలబెట్టడం సాధ్యమా అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.

చట్టాలే కారణం…..

ఈ పరిస్థితికి కారణాలను విశ్లేషించినప్పుడు ఆశ్ఛర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కరేబియన్ దీవులలోని ఆంటిగ్వా, బార్బడోస్, డొమినికా, సెయింట్ కిట్స్ సెయింట్ లూసియా, గ్రెనెడా తదితర దేశాల చట్టాలు నేరగాళ్లకు ఆశ్రయం కల్పించే విధంగా ఉన్నాయి. పౌరసత్వం కావాలనుకునే విదేశీయులకు ఇవి స్వాగతం పలుకుతాయి. పన్ను మినహాయింపులు ఇస్తాయి. వీసా లేకుండా విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. రాజ్యాంగపరమైన రక్షణలు కల్పిస్తాయి. ఇతర దేశాల చట్టాలు ఇక్కడ వర్తించవు. దీంతో ఈ దేశాలు నేరగాళ్ల అడ్డాలుగా మారాయి. 1983లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన సెయింట్ కిట్స్ పెయిడ్ పౌరసత్వ విధానాన్ని ప్రారంభించింది. ఈ దేశ పౌరసత్వం పొందినవారు వీసా లేకుండా 26 దేశాల్లో ప్రయాణించే వీలుంది.

డబ్బులు చెల్లిస్తే పౌరసత్వం….

డొమినికా దేశంలో 1.75 లక్షల డాలర్లు పెట్టబడి పెడితే భార్యాభర్తలకు పౌరసత్వం పొందవచ్చు. లూసియానా దేశంలో 1.65 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే దంపతులకు పౌరసత్వం లభిస్తుంది. గ్రెనెడాలో 2 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే చాలా తేలిగ్గా పౌరసత్వం లభిస్తుంది. దీంతో ఈ దేశాలు ఆర్థిక నేరగాళ్ల అడ్డాగా మారుతున్నాయి. ఆంటిగ్వాలో పౌరసత్వం కోసం 2014 నుంచి 28 మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు. 2017 జనవరి నుంచి జూన్ వరకు రెండు లక్ష్లల డాలర్లు పెట్టబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చిన ఏడుగురికి పౌరసత్వం లభించింది. ద్వితీయ పౌరసత్వాలను ప్రోత్సహించేందుకు ఆంటిగ్వా ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం విశేషం. నిబంధనల మేరకు పౌరసత్వాలను ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ ఆర్థిక నేరగాళ్లకు, రుణ ఎగవేతదారులకు పౌరసత్వం పేరుతో ఆశ్రయం కల్పించడం ద్వారా ఆయా దేశాలు చెడ్డపేరును మూటగట్టుకుంటాయి. పౌరసత్వం ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం నిందితులు తమ తమ దేశాల్లో చేసిన చట్టవిరుద్ధమైన పనులకు బాధ్యత వహించాలన్న నిబంధన విధించాలి. లేనట్లయితే కరేబియన్ దేశాలు ఏదో ఒకరోజు అంతర్జాతీయ సమాజానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News