పాక్ పై అంత ప్రేమెందుకో..?

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచి కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కూడా ఆయన పాకిస్థాన్ పై తన [more]

Update: 2019-02-16 17:30 GMT

వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచి కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కూడా ఆయన పాకిస్థాన్ పై తన ప్రేమను మరోసారి చాటుకొని దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నారు. పుల్వామాలో ఉగ్రదాడితో 44 మంది జవాన్లను కోల్పోయి దేశం యావత్తు బాధతో, పాక్ పై ఆగ్రహంతో ఉంటే… సిద్ధూ మాత్రం పాక్ పై సానుకూలంగా మాట్లాడారు. పాక్ కి బుద్ధి చెప్పి ప్రతీకారం తీర్చుకోవాలని దేశప్రజలంతా ముక్తకంఠంతో కోరుతుంటే… సిద్ధూ మాత్రం ఇంకా పాకిస్థాన్ తో శాంతి చర్చలు జరపాలంటున్నారు. ఉగ్రవాదానికి మంత.. ప్రాంతం ఉండదని ఆవు కథ చెబుతున్నారు. ఇదే ఇప్పుడు సిద్ధూ పట్ల దేశం మొత్తం వ్యతిరేకత రావడానికి కారణమైంది. ఈ వ్యతిరేకతను గమనించిన సోని నెట్ వర్క్ వెంటనే నష్ట నివారణ కోసం ఆయనను కపిల్ శర్మ షోలో జడ్జిగా తప్పించారు. అయితే, సిద్ధూ చర్యలు ఎక్కుగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ బలహీనత…

క్రికెటర్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి మాటకారి. రాజకీయాల్లో అనతికాలంలోనే బాగా పట్టు సంపాదించారు. బీజేపీలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ లో కాంగ్రెస్ గెలవడానికి కృషి చేసిన కీలక నేతల్లో ఆయనా ఒకరు. ఇక, పార్టీలోనూ ఆయన బాగానే పట్టు సంపాదించారు. అసలయితే సిద్ధూ కాంగ్రెస్ పార్టీకి ఒక బలం కావాలి. కానీ, ఆయన తన చర్యలతో ఎప్పుడూ బలహీనమవుతున్నారు. పార్టీని ఇరుకున పెడుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కు సంబంధించిన ఆయన వ్యాఖ్యలు, చర్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి సాటి క్రికెటర్ గా సిద్ధూను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి మన దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆయన వెళ్లి హాజరయ్యారు. అయితే, వ్యక్తిగతంగా స్నేహం ఉన్నందునే ఆయన హాజరయ్యానని చెప్పారు.

గతంలోనూ ఇదే వైఖరి

అక్కడికి వెళ్లాక సిద్ధూ ఇమ్రాన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇమ్రాన్ ఇంద్రుడు…చంద్రుడు అన్నంతలో నెత్తిన పెట్టుకున్నారు. అక్కడే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కనే కూర్చున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసుకున్నారు. దీంతో అప్పుడు సిద్ధూ చర్యలను ప్రజలంతా తీవ్ర విమర్శించారు. తర్వాత కూడా ఆయన కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మరోసారి పాక్ వెళ్లారు. ఇక, ఆ సమయంలోనూ ఇమ్రాన్ ను పొగిడారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా తనతో శాంతి కోసం చర్చించారని చెప్పారు. మరి, అంతగా శాంతికాముకులైతే నిత్యం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అలజడి సృష్టిస్తున్నారో సిద్ధూకే తెలియాలి. సిద్ధూ చర్యలు, పాక్ పట్ల ఆయన ప్రేమ ఎప్పుడూ వివాదాస్పదమే.

ఇప్పటికైనా నోరు అదుపు చేస్తారా..?

ముఖ్యంగా బీజేపీ, శివసేన వంటి పార్టీలు సిద్ధూ చర్యలను తీవ్రంగా తప్పుపట్టాయి. అయినా ఆయన మారలేదు. భారత జవాన్లపై ఇంతపెద్ద దాడి జరిగినా పాక్ తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకే చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రంచ పాక్ కి గట్టి బుద్ధి చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం వెనుక తాముంటామని ప్రకటించారు. అయితే, సిద్ధూ వల్ల మాత్రం పంజాబ్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తయారైంది. ఇప్పటికైనా ఆయన నోరు కట్టడి చేసే చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News