బోరు కొట్టని ముఖ్యమంత్రి… ఆయన వారసుడు ఎవరు?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశ వ్యాప్తంగా సుపరచితం. ఆయన నిరాడంబరత, వరసగా ఎన్నికవుతుతున్న తీరు ఆశ్చర్యం కల్గిస్తుంది. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారంటే ఆయన ఒడిశా [more]

Update: 2020-07-18 18:29 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశ వ్యాప్తంగా సుపరచితం. ఆయన నిరాడంబరత, వరసగా ఎన్నికవుతుతున్న తీరు ఆశ్చర్యం కల్గిస్తుంది. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారంటే ఆయన ఒడిశా ప్రజలకు బోరు కొట్టని ముఖ్యమంత్రి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా నవీన్ పట్నాయక్ లో చెదరని చిరునవ్వు, నిజాయితీ, అవినీతి రహిత పాలన ఆయనను అన్ని సార్లు అందలం ఎక్కించాయిని చెప్పక తప్పదు.

ప్రతి ఎన్నికల్లోనూ….

ప్రతి ఎన్నికల్లో ఆయన బలం పెరుగుతూ వస్తోంది. 2000 సంవత్సరంలో తొలిసారిగా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ ఇక ఏమాత్రం తిరిగి చూసుకోలేదు. ఒడిశాలో మొత్తం 147 స్థానాలుండగా ఆ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు 68 స్థానాలు వచ్చాయి. దీంతో బీజేపీ మద్దతు తీసుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికలలో మాత్రం సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 107 స్థానాలను సాధించి దటీజ్ నవీన్ అనిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సంఖ్య 117కు పెరగడంతో ఇక నవీన్ ను ఆపే శక్తి ఎవరికీ లేదన్నది స్పష్టమయింది. 2019 ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.

రాజకీయ వారసులు లేక….

అయితే ఆయనకు రాజకీయ వారసులు ఎవరూ లేరు. తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్ ను స్థాపించిన నవీన్ పట్నాయక్ బ్రహ్మచారి. ఆయనకు కుటుంబ బాంధవ్యాలు లేకపోవడంతో నవీన్ తర్వాత వారసుడు ఎవరు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గత ఇరవై ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ఒడిశాలో బిజూ జనతాదళ్ ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒడిశా ప్రజలకు అత్యంత ఇష్టుడైన నవీన్ పట్నాయక్ పార్టీలో తన తర్వాత ఎవరూ ఉండరన్న సంకేతాలు ఎప్పుడూ ఇస్తుంటారు. ప్రాంతీయ పార్టీ కావవడంతో ఇప్పటి వరకూ సర్వం నవీన్ పట్నాయక్ మాత్రమే.

బీజేపీ ప్రయత్నాలు అందుకే…

దీంతో బీజేపీ కన్ను ఒడిశాపై పడింది. నవీన్ పట్నాయక్ వారసులు ఎవరూ లేకపోవడంతో భవిష‌్యత్ తమేదనన్న ధీమాలో బీజేపీ ఉంది. అందుకే చాప కింద నీరులా ఒడిశాలో బీజేపీ విస్తరిస్తుంది. లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను నెరుపుతారు. అందుకే బీజేపీ కూడా ఆయన విషయంలో దూకుడుగా వ్యవహరించదు. నవీన్ కు రాజకీయ వారసులు ఎవరూ లేకపోవడంతో ఎప్పటికైనా తాము అధికారంలోకి ఒడిశాలో రాగలమన్న ధీమాతోనే బీజేపీ ఇక్కడ ప్రయత్నిస్తుందన్నది వాస్తవం. మరి నవీన్ పట్నాయక్ ఎప్పటికైనా తన వారసుడిని ప్రకటిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News