అవే… నవాబును చేస్తాయా..?

సహజంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తుంటాయి. అయితే, ఈసారి కచ్చితంగా అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఏడాదిన్నర క్రితమే తన మేనిఫెస్టోలోని కీలక [more]

Update: 2019-05-01 02:30 GMT

సహజంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తుంటాయి. అయితే, ఈసారి కచ్చితంగా అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో ఉన్న జగన్ ఏడాదిన్నర క్రితమే తన మేనిఫెస్టోలోని కీలక అంశాలను ‘నవరత్నాలు’గా రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మేనిఫెస్టోను కూడా విడుదల చేసినా అందులోనూ నవరత్నాల్లో చెప్పిన పథకాలే ఎక్కువగా కనిపించాయి. కేవలం రెండుమూడు కొత్త పథకాలు మినహా మిగతావన్నీ నవరత్నాల్లో భాగంగ ఏడాదిన్నర క్రింత చెప్పిన నవరత్నాలనే మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు ఈ నవరత్నాలే తమకు అధికారంలోకి తీసుకువస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకానికి కూడా తమ నవరత్నాలే కౌంటర్ ఇచ్చాయని, అందుకే తమదే విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

పాదయాత్ర నుంచే ప్రజల్లోకి…

పాదయాత్రకు ముందు గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైసీపీ అధినేత జగన్ ‘నవరత్నాలు’ పేరుతో తాము అధికారంలోకి వస్తే ఏయే వర్గాల ప్రజలక ఏమేం చేస్తారో ప్రకటించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు కొత్తగా పలు పథకాలను ఇందులో పెట్టారు. మొత్తంగా తొమ్మిది ప్రధాన పథకాలు ఉండటంతో వీటికి నవరత్నాలు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ‘నవరత్నాల’ను వైసీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గంలో నవరత్నాల గురించి ప్రజలకు వివరించి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తామని, వాటితో ప్రజల జీవితాలు మారతాయని జగన్ పదే పదే చెప్పారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జిలు సైతం ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో యాత్రలు నిర్వహించి నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలా ఏడాదిన్నరగా ‘నవరత్నాల’ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా..?

నవరత్నాలపై ధీమాతోనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కూడా ఆలస్యంగా చేసింది. నవరత్నాలు తమకు ఓట్లు కురిపిస్తాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు, యువత, డ్వాక్రా మహిళలకు నవరత్నాల్లో పెద్దపీట వేశారు. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప జేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లినందున తమకు అనుకూలంగా పనిచేశాయని వైసీపీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆశతో ఉన్న పసుపు – కుంకుమకు కూడా నవరత్నాలు మంచి కౌంటర్ ఇచ్చాయని భావిస్తున్నారు. టీడీపీ పింఛన్లు రెట్టింపు చేసినా తాము ముందే నవరత్నాల్లో ఈ విషయం చెప్పినందున ఆ క్రెడిట్ తమకు కూడా దక్కిందనేది వైసీపీ భావన. మొత్తంగా నవరత్నాలే తమను గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News