మో…షాలకు సుడి రివర్స్ అయిందా….??

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఆ ఇద్దరిపై కొంత అసంతృప్తి బయలుదేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు [more]

Update: 2018-12-27 17:30 GMT

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో ఆ ఇద్దరిపై కొంత అసంతృప్తి బయలుదేరింది. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుసరించిన తీరును తప్పు పట్టే గొంతులు కమలం పార్టీలో వినపడుతుండటం విశేషం. వరస విజయాలు వచ్చినప్పుడు వాటిని తమ ఖాతాలో వేసుకునే మోదీ, అమిత్ షాలు పరాజయాలను మాత్రం తమకు ఎందుకు ఆపాదించుకోలేకపోతున్నాయన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే వీరిద్దరితోనే బీజేపీ చరిత్ర పరిసమాప్తం అవుతుందేమోనన్న ఆందోళన సంఘ్ పరివార్ లోనూ బయలుదేరింది.

ఓటమికి బాధ్యత…..

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దారుణ ఓటమిని చవి చూసింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను కోల్పోవడానికి అక్కడి ముఖ్యమంత్రులే కారణమన్న అభిప్రాయానికి కేంద్ర నాయకత్వం రావడాన్ని కొందరు తప్పు పడుతున్నారు. ముఖ్యమంత్రుల మీద, అక్కడి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు కేంద్ర ప్రభుత్వ పాలన కూడా పడిందన్నది కమలం పార్టీలో కొందరు వాదిస్తున్నారు. ఈ దారుణ ఓటమికి నాయకులే బాధ్యత వహించాలని ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి.

గడ్కరీ ఊరికే అంటారా?

నాయకత్వం అంటే జయాపజాయాలకు బాధ్యత వహించాల్సిందేనని గడ్కరీ అన్న మాటలను ఊరికే తోసిపారేయలేం. ఆయన సీనియర్ నేత. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతంలో వాజ్ పేయి హయాంలో కూడా పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలే విన్పించేవి. ఆశించిన ఫలం దక్కనప్పుడు నాయకత్వమే బాధ్యత వహించాలన్న గడ్కరీ వ్యాఖ్యలను కొందరు పార్టీలో అంతర్గతంగా సమర్థిస్తుండటం విశేషం. గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరో ఉన్నారన్న అనుమానాలూ లేకపోలేదు. పరోక్షంగా మోదీ, అమిత్ షాలను టార్గెట్ చేశారంటే ఊరికే చేయరన్న టాక్ కమలం పార్టీలో విన్పిస్తుంది.

సంఘ్ ప్రమేయంతోనేనా?

గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక సంఘ్ పరివార్ ఉందంటున్నారు. గడ్కరీ ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. భవిష్యత్ లో గడ్కరీనే నేతగా చేయాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. దీనికి తోడు తాజాగా కేంద్రమాజీ మంత్రి ప్రియ గౌతమ్ గడ్కరీని ఉప ప్రధానిగా నియమించాలని కోరడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు అమిత్ షాను అధ్యక్ష పదవి నుంచి తప్పించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీలో అసమ్మతి గొంతులు బలంగా విన్పిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు పార్టీకి ఎలాంటి చేటు తెస్తాయోనన్న ఆందోళన కమలం పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనపడుతోంది.

Tags:    

Similar News