కూసాలు కదిలిపోయాయా…!!

కాంగ్రెస్ ని రెండు సార్లు ఓడించి నరేంద్ర మోడీ ఓ విధంగా ఆ పార్టీని ఇప్పటికే మంచం మీద పడుక్కోబెట్టేసారు. ఇపుడు అక్కడ కూడా ఉండకుండా పూర్తివా [more]

Update: 2019-08-09 17:30 GMT

కాంగ్రెస్ ని రెండు సార్లు ఓడించి నరేంద్ర మోడీ ఓ విధంగా ఆ పార్టీని ఇప్పటికే మంచం మీద పడుక్కోబెట్టేసారు. ఇపుడు అక్కడ కూడా ఉండకుండా పూర్తివా ఆయువు పట్లే తీసేయాలనుకుంటున్నారు. గత అయిదేళ్ళ మోడీ పాలనలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా అసలు సిసలైన బీజేపీ సిధ్ధాంతాలను మాత్రం మోడీ టచ్ చేయకుండా వదిలేశారు. మొదటి టెర్మ్ లో ఆయన అభివృధ్ధి, సంక్షేమం వంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపారు. మధ్యలో తాను మొనగాడినని చెప్పుకోవడానికి పెద్ద నోట్ల రద్దు వంటి మెరుపులు మెరిపించారు. ఇక జీఎస్టీ వంటివి తీసుకురావడం పాలనాపరమైన సంస్కరణలుగా చూడాలి. మొదటిసారి ప్రధాని అయిన మోడీ పాకిస్తాన్ తో సహా సార్క్ దేశాధినేతలకు ఆహ్వానం పలికి వారందరి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడే వ్యూహాత్మకంగా మోడీ చేశారనిపిస్తుంది.

ముందు వియ్యంతోనే….

తన ముందు బీజేపీ ప్రధానిగా చేసిన వాజ్ పేయ్ బాటలోనే మోడీ నడిచి పాక్ తో చేయి కలిపారు, ఏకంగా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి ఆశ్చర్యపరచారు. దాంతో పాక్ భారత్ మధ్య మంచి బంధం పడుతుందని అనుకున్నారు. అయితే పాక్ తన తీరుని మార్చుకోకపోవడంతో మోడీ గట్టిగానే సవాల్ స్వీకరించారు. ఈ లోగా వీలైనన్ని దేశాలు తిరిగేసి పాక్ కి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టారు. రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ద్వారా పాక్ కి షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో దేశంలోని ప్రజలకు బీజేపీ మాత్రమే ఇలా చేయగలదన్న నమ్మకాన్ని కలిగించారు. ఇంతలో వచ్చిన ఎన్నికల్లో దేశభక్తినే పెట్టుబడిగా చేసుకుని రెండోసారి మోడీ
ఘన విజయం సాధించారు.

అమీ తుమీకి రెడీ….

అధికారంలోకి వచ్చి గట్టిగా మూడు నెలకు కాలేదు, మెరుపు వేగంతో కాశ్మీర్ పై మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ విభజన చేయడం, పార్లమెంట్ లో మంచి మెజారిటీతో ఆమోదింపచేసుకోవడం. ఇక్కడ కాంగ్రెస్ ని బోనులో నిలబెట్టి మరీ కడిగేశారు. బీజేపీ ఎత్తులు తెలియని కాంగ్రెస్ పార్లమెంట్లో పూర్తిగా కాశ్మీర్ అంశంలో చిత్తు అయిపోయింది. ఆ పార్టీ అస్పష్టత ఎంతలా ఉందో లోక్ సభలో పార్టీ నేతల తడబాట్లు చెప్పాయి. ఇక జనార్ధన్ ద్వివేదీ వంటి వారు కాశ్మీర్ విషయంలో కేంద్రం వైఖరిని సమర్ధించడం హస్తం పాపర్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగానే చూడాలి. మొత్తానికి కాశ్మీర్ హక్కులు అంటూ కలవరించిన హాస్తం పార్టీ వెనక ఉన్నది ఎవరంటే ఏకైన ఎంపీగా ఉన్న మజ్లిస్ పార్టీ మాత్రమే.

దెబ్బతో చిత్తేనా…..

కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బతో కుహనా లౌకికవాదం ఏంటన్నది మోడీ జాతి జనులకు చూపించేశారు. మరో వైపు మిత్రులు సైతం తమ దారి తాము చూసుకుని జాగ్రత్త పడ్డారు. నేరుగా కాశ్మీర్ విషయంలో బీజేపీ వైఖర్ని వ్యతిరేకించి భంగపడింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఇక అంతకు ముందు ట్రిపుల్ తలాక్ అంశంలోనూ కాంగ్రెస్ కి మద్దతు దక్కలేదు. ఇక్కడ కూడా మంచి మెజారిటీతో బీజేపీ చట్టాన్ని చేసుకుంది. ఇలా బీజేపీ రెచ్చిపోతున్న తీరుతో కాంగ్రెస్ కూసాలు ఒక్కొక్కటీ కదిలిపోతున్నాయి. ఇంకో వైపు ఉమ్మడి పౌరసత్వం బిల్లుతో పాటు, అయోధ్య అంశాన్ని కూడా రానున్న రోజుల్లో మోడీ సెటిల్ చేసేసి బీజేపీ సిధ్ధాంతాలను పరిపూర్తి చేసిన ఏకైక మొనగాడుగా నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ బలపడుతూండంగా కాంగ్రెస్ మాత్రం పునాదులు కదిలిపోయి కుంగి కృశిస్తోంది.

Tags:    

Similar News