మోడీకి ఆ ఆలోచన ఉందా? అయితే వీరిద్దరికి షాక్ ?

నరేంద్ర మోడీ..మెత్తగా కనిపిస్తారు. కానీ లక్ష్య సాధనలో ఆయనంత కఠినంగా ఎవరూ ఉండరు. ఆయన పదవీ లాలసతోనో, ఆషామాషీగానే ప్రధాని గద్దెని ఎక్కిన వారు కానే కాదు, [more]

Update: 2020-09-13 12:30 GMT

నరేంద్ర మోడీ..మెత్తగా కనిపిస్తారు. కానీ లక్ష్య సాధనలో ఆయనంత కఠినంగా ఎవరూ ఉండరు. ఆయన పదవీ లాలసతోనో, ఆషామాషీగానే ప్రధాని గద్దెని ఎక్కిన వారు కానే కాదు, ఆరెస్సెస్ అజెండాను సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రధాని పదవి చేపట్టిన నేతగా మోడీని చూడాలి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతాన్ని నమ్ముతుంది, కానీ ఆర్ఎస్ఎస్ ఏకత్వాన్ని గట్టిగా విశ్వసిస్తుంది. అంతా ఒక్కటి అంటుంది. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే పార్టీగా బీజేపీ ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ ఆకాంక్షలా కనిపిస్తోంది. ఇంతకంటే మంచి తరుణం వేరే రాదు అన్నట్లుగా త్వరపడుతూ ఆర్ఎస్ఎస్ ఆలోచనలను మోడీ అమలు చేస్తున్నారని దేశంలో అపుడే అలజడి రేగుతోంది.

అధ్యక్ష పాలనతో…..

దేశంలో అధ్యక్ష తరహా పాలన మీద ఇందిరాగాంధీ హయాంలోనే కొంత చర్చ సాగిందని అంటారు. తాను దేశాధ్యక్ష పీఠం మీద కూర్చుని శాసించాలని ఇందిర నాడు ఎక్కువగా భావించేవారు అంటారు. అయితే నాడు ఇందిర ఎంత బలంగా ఉన్నా కూడా అమెను మించి ప్రతిపక్షంలో కూడా యోధానుయోధులు ఉన్నారు. ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని ఎదిరించిన మొనగాళ్ళు ఉన్న రాజకీయం రోజులవి. ఇపుడు ఆమె బాటలో నరేంద్రమోడీ నడవాలనుకుంటున్నారుట. తాను అధ్యక్షుడిగా ఉంటూ దేశాన్ని, జాతీయ రాజకీయాన్ని గుప్పిట పట్టాలన్నది మోడీ పట్టుదలగా ఉంది.

ప్రాంతీయ పార్టీలకు చెక్ ….

దేశంలో కుప్పలు తెప్పలుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎవరికి కోపం వచ్చినా కూడా ఒక పార్టీని పెట్టేస్తున్నారు. ఒక ఎంపీ గెలిచినా కూడా దేశ రాజకీయాలను అడ్డంగా తిప్పేస్తున్నారు. ఏ మాత్రం బలం లేని వారు దేశ ప్రధానులు అయిపోతున్నారు. ఇది నిజంగా మంచి విధానం కాదు కానీ, ఏకంగా ప్రాంతీయ గొంతులను నొక్కేయడం కూడా దారుణమని ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. దేశంలో అధ్యక్ష పాలన వస్తే జాతీయ పార్టీలే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. దేశ‌ అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అపుడు ఆయన నియమించిన ప్రధాని కీలు బొమ్మ, ఉత్సవ విగ్రహమే అవుతారు. ఇక ప్రాంతీయ పార్టీలు కేవలం అసెంబ్లీలకు పోటీ చేస్తాయి. అంటే జాతీయ రాజకీయాల్లో వారు అసలు భాగం కాలేరు.

పెద్ద దెబ్బేగా …?

ఎప్పటికైనా జాతీయంగా వెలుగు వెలగాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇక జగన్ తాను యువ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఏళ్ళలో అయినా జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఉండాలన్నది జగన్ అభిమతం. కేంద్రంలో అరకొర మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పడితే తమ ఎంపీల మద్దతుతో అక్కడ చక్రం తిప్పాలని జగన్ ఉబలాటం. కానీ మోడీ జమిలి ఎన్నికలకు రెడీ అవుతూనే అధ్యక్ష పాలన అంటున్నారు. దాని మీద బీజేపీ అంతర్గత కమిటీలు కూడా ఏర్పాటు చేసిందని అంటున్నారు. మోడీకి పార్లమెంట్ లో బలం ఉంది. అందువల్ల అధ్యక్ష పాలన వైపుగా అడుగులు వేస్తున్నారు. నిన్నా మొన్నా చైనా, రష్యా అధ్యక్షులు తమ పదవీకాలాన్ని పెంచుకుంటూ అధికారాన్ని శాశ్వతం చెసుకున్నారు. మరి మోడీకి కూడా ఆ ఆలోచన ఉందా. అదే జరిగితే భారత్ లో చిన్న గొంతులు మూగబోవడం ఖాయమే.

Tags:    

Similar News