మోదీ రెడీ అయిపోయారు.. ముహూర్తమే తరువాయి

ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణకు రెడీ అయిపోయారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మార్పులు, చేర్పులపై సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానిగా నరేంద్ర [more]

Update: 2020-07-10 17:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ విస్తరణకు రెడీ అయిపోయారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మార్పులు, చేర్పులపై సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి బాధ్యతలను చేపట్టి ఏడాది కాలం అయింది. అయితే కొందరు మంత్రుల పనితీరు పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కేబినెట్ విస్తరణ జరుగుతుందని ఈ ఏడాది జనవరి నెలలోనే ప్రచారం జరిగింది.

కరోనా రావడంతో….

అయితే మార్చి నెలలో కరోనా మహమ్మారి రావడంతో విస్తరణను నరేంద్ర మోదీ వాయిదా వేశారు. దీనికి తోడు ప్రస్తుతం ఏడాది కాలంలో కేబినెట్ మంత్రుల పనితీరుపై కూడా నరేంద్రమోదీ నివేదికలు తెప్పించుకున్నారు. దాదాపు పది మంది మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని తేలింది. వీరిని తప్పించి కొత్త వారికి అవకాశమివ్వాలన్నది మోదీ ఆలోచనగా ఉంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం కల్పించనున్నారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు….

పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, అస్సోం, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నది నరేంద్ర మోదీ ఆలోచనగా ఉంది. దీంతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. మధ్యప్రదేశ్ లో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయనను కేబినెట్ లోకి తీసుకోనున్నారు.

శాఖల నుంచి తప్పించి….

మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శాఖను కూడా మారుస్తారన్న ప్రచారం హస్తినలో జరుగుతోంది. ప్రస్తుతం భారత్ ఎదుర్కొటున్న క్లిష్ట పరిస్థితుల్లో మరొక ఆర్థిక నిపుణుడికి ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగిస్తారంటున్నారు. కొందరిని పూర్తిగా మంత్రి వర్గం నుంచి తప్పించడం, మరికొందరి శాఖలను మార్చడం వంటి వాటిపై నరేంద్ర మోదీ దృష్టి సారించారంటున్నారు. మొత్తం మీద నరేంద్ర మోదీ తన కేబినెట్ ను మరోసారి విస్తరించేందుకు రెడీ అయిపోయారు. ఈ నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది.

Tags:    

Similar News