ప్రధానమంత్రీ జీ .. పారాహుషార్

ప్రధానమంత్రికి సముచిత సలహాలు ఇచ్చేవారు కరువయ్యారా? సకాలంలో అప్రమత్తం చేసే మిత్రబృందమూ చేతులెత్తేసిందా? అంతా నా ఇష్టం అన్నట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం చెలరేగిపోతోందా? ఈప్రశ్నలకు తాజాగా కేంద్రం [more]

Update: 2021-04-25 15:30 GMT

ప్రధానమంత్రికి సముచిత సలహాలు ఇచ్చేవారు కరువయ్యారా? సకాలంలో అప్రమత్తం చేసే మిత్రబృందమూ చేతులెత్తేసిందా? అంతా నా ఇష్టం అన్నట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం చెలరేగిపోతోందా? ఈప్రశ్నలకు తాజాగా కేంద్రం వైఖరిని చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రధాని మోడీ రాజకీ యపలుకుబడిని, ప్రతిష్ఠను పణంగా పెట్టేసే అనేక రకాల చర్యలు వరసగా చోటు చేసుకుంటున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రాచుర్యం, ప్రజాదరణ కలిగిన ప్రధానిగా పేరు తెచ్చుకున్న మోడీ హవాకు సొంత పార్టీ నేతలే గండి కొడుతున్నారు. ప్రధానికి, పార్టీకి నష్టం వాటిల్లే అంశాలపై జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన నేతలు కరవు అయ్యారు. భారతీయ జనతాపార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్రంలో మంత్రులుగా ఉన్న అగ్రనేతలు అంతా నిష్క్రియాపరత్వం కనబరుస్తున్నారు. ఏ ఒక్కవిషయంలోనూ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్టాడటం అటుంచి, దిద్దుబాటుకూ యత్నించడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి సరైన సలహాలు ఇవ్వడం లేదు. ఫలితంగా బ్యూరోక్రాట్ల నిర్ణయాలతో నడిచిపోయే ప్రధానమంత్రి కార్యాలయం చెప్పిందే వేదంగా చెలామణి అవుతోంది. దాంతో క్రమేపీ కేంద్రం ప్రతిష్ఠ దిగజారుతోంది. కరోనా వాక్సిన్లు, మందుల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య తాజాగా చోటు చేసుకున్న వివాదం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

సాహసించడం లేదా..?

కరోనా విపత్తు విషయంలో ప్రధాని మోదీ అనేకసార్లు సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రులతో మాట్టాడుతున్నారు. నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తాను చెప్పింది వారు వినడమే తప్ప , వారు చెప్పింది అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కేంద్రంలో ఇతర మంత్రుల పాత్ర అసలు కనిపించడం లేదు. నిజానికి రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు బ్యూరోక్రటిక్ స్టైల్ లో పనిచేయవు. ప్రతి విషయాన్ని ప్రజల కోణంలోనే ఆలోచిస్తాయి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందిస్తారనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.నాయకులు మోడీ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రజాస్పందనపై క్రమేపీ పట్టు కోల్పోతున్నారు. దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉంది. వాక్సిన్ల వంటివి సరఫరా చేయడానికి సైతం కేంద్రం వెనకాడటం విమర్శలకు తావిస్తోంది. కేంద్రం కొనుగోలు చేసే రేటు వేరుగా, రాష్ట్రాలు కొనుగోలు చేసే ధర వేరుగా నిర్ణయించడమే తొలుత వివాదాస్పదమైంది. ఒక్కో వాక్సిన్ కేంద్రం 150 రూపాయలకు కొనుగోలు చేస్తే రాష్ట్రాలకు 400 రూపాయలకు అమ్ముతామంటూ సీరం సంస్థ ప్రకటించింది. ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. కేంద్రానికి ప్రత్యేకంగా ప్రజలు ఉండరు. భారత ప్రజలంతా రాష్ట్రాల్లోనే నివసిస్తారు. కేంద్రమే కొనుగోలు చేసి మొత్తం వాక్సిన్లు పంపిణీ చేయాల్సిన బాద్యత తీసుకోవాలి. ఎందుకంటే కరోనాకు సంబంధించి విధివిధానాలు మొత్తం కేంద్రమే పర్యవేక్షిస్తోంది. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్రంలోని మంత్రులు ఈ విషయంలో ప్రదానికి ఎటువంటి సలహా ఇవ్వడంలేదు. అధికారుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుని ప్రదాని అభాసుపాలవుతున్నారు.

క్లారిటీ మిస్…

ప్రతిపక్షాలు, ప్రత్యర్థి పార్టీల ముఖ్యమంత్రులు గగ్గోలు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తాపీగా ఒక ప్రకటన చేసింది. తాము కొనుగోలు చేసిన వాక్సిన్లు రాష్ట్రాలకే ఉచితంగా అందచేస్తామని ప్రకటించింది. నిజానికి రాష్ట్రాలకు కాకపోతే ఎవరికిస్తారు? ఈ ప్రకటన అర్థరహితం. లేదంటే కేంద్రం వ్యాపారం చేస్తుందా?. అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోళ్ల ధరల మద్య వ్యత్యాసంపై స్పష్టత నివ్వలేదు. ప్రయివేటు సంస్థలు తమ లాబాపేక్షకు తెగించే సమయం కాదిది. కేంద్రమే మొత్తం వాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందచేయాలి. ప్రయివేటు వ్యాపారానికి వెసులుబాటు కల్పించకూడదు. ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కరోనా కారణంగా కోల్పోయారు. జాతీయ స్థూల ఉత్పత్తి పడిపోయి కేంద్రానికీ దెబ్బ తగిలింది. ఈ నష్టంతో పోల్చితే వాక్సిన్ కొనుగోలుకు వెచ్చించేది చాలా స్వల్పంగానే చెప్పాలి. దానికి కేంద్రం, రాష్ట్రాలు వాటాలుగా చెప్పడం వ్యాపారాత్మక లక్షణమే తప్ప రాజకీయ నీతి కాదు. కేంద్రం వెచ్చించేది ప్రజల సొమ్మే. ఎంత తొందరగా వాక్సిన్ల పంపిణీ పూర్తయితే అంత తొందరగానూ దేశం కోలుకుంటుంది. కరోనా వాక్సిన్ల కొనుగోలులో కేంద్రం వివక్ష చూపుతోందన్న భావన ప్రజలలో వ్యాపించింది. ఇది కచ్చితంగా మోడీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది.

ఆదర్శంగా ఏపీ, తెలంగాణ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఏమంత సజావుగా లేవు. అయినా ప్రజారోగ్యం ముందు కాసుల లెక్కలు సరికాదని ప్రభుత్వాలు భావించాయి. అందుకే 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉచితంగానే వాక్సిన్లు అందచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే పంథాను అనుసరిస్తున్నారు. వాక్సిన్ రేట్ల గొడవలో ఇప్పటికే బీజేపీ స్తానిక నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వారిని మరింత ఆత్మరక్షణలోపడేస్తున్నాయి. కేంద్రం సొంత సొమ్ములేవో జేబులోంచి తీసి ఇస్తున్నట్లుగా పాటిస్తున్న పొదుపు చర్యలు పార్టీకి ఇబ్బందికరం. ప్రజలకు నష్టదాయకం. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చెల్లించే ధర కంటే అధిక మొత్తంతో టీకాలు కొంటాయి. అది కూడా ప్రజాధనమే. రాష్ట్రాలు కొనడం కంటే కేంద్రమే కొంటే సగం కంటే తక్కువ ధరకే టీకాలు వస్తాయి. అందుకే వ్యాపార సంస్థల ఆటలు సాగకుండా తానే కొనడం ఉత్తమం. ఒక రకంగా ఇది ప్రజాధనాన్ని పొదుపు చేయడమే అవుతుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం వేరు, రాష్ట్రాలు వేరు అన్న భావన సమాఖ్య స్ఫూర్తికే చేటు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News