ఉత్కంఠ రేపుతున్న మోడీ గుంటూరు సభ

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు విస్మరించి ఏపీలో ఎలా అడుగుపెడతారో చూస్తామని ఛాలెంజ్ విసురుతుంది టీడీపీ. ఎలా అడ్డుకుంటారో చూస్తామని కమలనాధులు ప్రతి సవాల్ చేస్తున్నారు. [more]

Update: 2019-02-09 06:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు విస్మరించి ఏపీలో ఎలా అడుగుపెడతారో చూస్తామని ఛాలెంజ్ విసురుతుంది టీడీపీ. ఎలా అడ్డుకుంటారో చూస్తామని కమలనాధులు ప్రతి సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న ప్రధాని గుంటూరు సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భద్రతా చర్యలకు మరోపక్క రిహార్శల్స్ వేస్తుంది పోలీస్ శాఖ. అధికారంలో ఉన్న రెండు ప్రధాన పార్టీల నడుమ నువ్వానేనా అన్నట్లు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా సాగనున్న యుద్ధం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది.

చిట్టా విప్పనున్న మోడీ ?

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అందించిన సాయాన్ని ఈ సభలో చిట్టా విప్పనున్నట్లు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. మాటల మాంత్రికుడైన ప్రధాని ఇటీవల పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని ప్రత్యర్థులు సైతం ప్రశంసించకుండా ఉండలేకుండా చేసింది. అలాంటి మోడీ ప్రస్తుత టార్గెట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సంకీర్ణ యుగం వచ్చే ఎన్నికల్లో వస్తే జాతీయ రాజకీయాల్లో మమత, చంద్రబాబు తిప్పబోయే చక్రాలు ఎలా ఉంటాయో అంచనా ఉన్న మోడీ వారి ప్రయత్నాలను వమ్ము చేసే చ‌ర్య‌లు అన్ని వైపులా మొదలు పెట్టేశారు. బీజేపీని ఏపీలో దారుణంగా దెబ్బతీసిన టిడిపి కి గట్టి గుణపాఠం చెప్పాలని మోడీ పూర్తిగా ప్రిపేర్ అయ్యే రంగంలోకి దిగుతున్నట్లు కమలదళం అంచనా వేస్తుంది.

షా టూర్ ఫెయిల్ తో

శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ ఫెయిల్ అయ్యిందన్న టాక్ ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ మాత్రం విజయవంతం చేసుకునేందుకు తమ సర్వశక్తులు కేంద్రీకరిస్తుంది కమలం పార్టీ. మోడీ సభ విజయవంతానికి అన్ని జిల్లాల నుంచి జనసమీకరణకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత వారం రోజులుగా కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల ముందు జరిగే కీలకమైన ప్రధాని సభను సక్సెస్ చేయడమే టార్గెట్ గా కాషాయ పార్టీలోని అన్ని విభాగాలు ఇప్పటికే గుంటూరు సభపై ఫోకస్ పెంచాయి.

మోడీ గో బ్యాక్

ప్ర‌ధాని సభను భగ్నం చేయాలని టీడీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లిపోయాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ లు అదే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ముఖ్యంగా గుంటూరు సభ వేదిక వద్ద మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ శాఖ గట్టి కసరత్తు చేస్తున్నప్పటికీ పరిస్థితి తమ అదుపులో ఉంటుందో లేదో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది. మరో పక్క హస్తిన కేంద్రంగా సోమవారం చంద్రబాబు దీక్ష చేపట్టనుండటం, ఆ కార్యక్రమానికి భారీ జనసమీకరణ చేసే పనిలో ఉన్న టీడీపీపైకి చేస్తున్న ప్రకటనల స్థాయిలో సభను అడ్డుకోలేక పోవొచ్చని కూడా కమలం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ప్రధాని సభ పూర్త‌య్యే వరకు మాత్రం ఉత్కంఠ కొనసాగనుంది.

Tags:    

Similar News