ప్రూఫ్ చేసుకో లోకేష్…మాటలెందుకు ?

రాజకీయాల్లో అందలాలు చిన్న వయసులో దక్కడం కూడా ఇబ్బందికరమే అని కొంతమంది వారసులను చూస్తే అర్ధమవుతుంది. నేల విడిచి సాము చేయడమే వారికి తెలుసు. అందుకే వారు [more]

Update: 2021-01-09 15:30 GMT

రాజకీయాల్లో అందలాలు చిన్న వయసులో దక్కడం కూడా ఇబ్బందికరమే అని కొంతమంది వారసులను చూస్తే అర్ధమవుతుంది. నేల విడిచి సాము చేయడమే వారికి తెలుసు. అందుకే వారు తాము నేరుగా పైకే చూపులు చూస్తారు. తామున్న చోటు నుంచి కిందకు దిగడానికి కానీ చూడడానికి కానీ అసలు ఇష్టపడరు. చంద్రబాబు వారసుడు లోకేష్ తీరు చూసినా ఆయన మాటలు, వైఖరి చూసినా ఇదే అనిపిస్తోంది. తాను కేరాఫ్ చంద్రబాబు అన్నది ఇప్పటికీ లోకేష్ తెలుసుకోలేకపోతున్నాడు.

కళ్ళ ముందే తండ్రి ….

చంద్రబాబు ఈ రోజుకు ఇంతటి నాయకుడు అయ్యాడు. కానీ ఆయన నేరుగా అందలాలు ఎక్కలేదు అన్నది లోకేష్ తెలుసుకోవాలి. బాబు ఎమ్మెల్యే, మంత్రి ముఖ్యమంత్రి దాకా చేసిన శ్రమ, పడిన కష్టం కళ్ల ముందే ఉన్నాయి. తండ్రిని స్పూర్తిగా తీసుకున్నా లోకేష్ మరింతగా మరుగు పరచుకునే అవకాశం ఉంది. చంద్రబాబు తాను ఎన్టీయార్ అల్లుడు అయినా కూడా సాధారణ కార్యకర్తలా పార్టీలో పనిచేశారు. కాబట్టే ఎన్టీయార్ తరువాత ఆయనే ఆల్టర్నేషన్ అని తమ్ముళ్ళు అంతా నమ్మే పరిస్థితి వచ్చింది. బాబు ఓవర్ నైట్ లీడర్ కాలేదు అన్నది లోకేష్ గుర్తిస్తే ఉత్తుత్తి సవాళ్ళు, మీడియా బేబీ మాటలు వంటివి చేసి ఉండరేమో.

జగన్ తో పోలికనా…?

జగన్ సీఎం గా ఉన్నారు. ఆయనది కూడా పుష్కర కాలం కష్టం. తండ్రి చాటు బిడ్డగా జగన్ రాజకీయాలు ఎపుడూ చేయలేదు. తనను తాను జనాల్లో రుజువు చేసుకున్నాడు. జగన్ ఓపిక పట్టుదల, సంకల్పం, ఆయన ఇమేజ్ ని బిల్డప్ చేశాయి. ఇచ్చిన మాట తప్పకపోవడమే కాదు 3700 కిలోమీటర్లు దూరం నడిచి తనను తాను జగన్ తీర్చిదిద్దుకున్నాడు. జగన్ రాజకీయంగా గెలవకముందే జనాల మనసును గెలుచుకున్నాడు. అది సాధించాకా రాజకీయంగా ఎంత దూరమైనా జనమే జగన్ని తీసుకెళ్తారు. అటువంటి జగన్న్ పట్టుకుని సవాళ్ళు చేస్తున్నారు లోకేష్. తేల్చుకుందామంటున్నారు. జగన్ తో పోలిక పెట్టుకుని తానూ కాబోయే సీఎం గా భావిస్తే అది లోకేష్ ఫ్యూచర్ కే ముప్పు అని సొంత పార్టీలోనే ఓ వైపు చర్చ సాగుతోంది.

జనంతో తేల్చుకోవాలి…..

తేల్చుకోవాల్సింది జగన్ తో కాదు, జనంతో. ఈ సంగతి ఎంత తొందరగా లోకేష్ కి అర్ధమైతే అంత తొందరగా ఆయనకూ టీడీపీకి మేలు జరుగుతుంది. విపక్ష స్థానం నిజంగా గొప్పది. ఎన్నో నేర్పిస్తుంది. చంద్రబాబు అటు అధికారం చూశారు, ఇటు ప్రతిపక్షం చూశారు. ఆయన్ని పక్కన పెడితే భావి రాజకీయం అంతా టీడీపీతో ముడిపడి ఉంది లోకేష్ కి మాత్రమే. లోకేష్ కూడా తండ్రి మాదిరిగా సవాళ్లు చేస్తాను, భారీ స్టేట్మెంట్స్ ఇస్తాను అంటే కుదిరే వ్యవహారమేనా. చంద్రబాబుని లీడర్ గా జనం ఎపుడో గుర్తించారు. మరి అలాంటి చాన్స్ తానూ తీసుకోవాలంటే లోకేష్ నడవాల్సింది జనం బాటనే. ప్రతీ రోజూ సవాళ్ళతో ట్వీట్లు వేస్తే రాజకీయం అనుకుంటే మాత్రం లోకేష్ బోల్తా పడినట్లే. ఏది ఏమైనా మంత్రి అయ్యాను కదా అనుకుంటే అది జనం ఇచ్చిన పదవి గౌరవం కాదు అని కూడా లోకేష్ తెలుసుకోవాలి. ఒక లీడర్ గా తాను నిలవాలి. అటు పార్టీని, ఇటు జనాన్ని గెలవాలి. అపుడే ఏ చాలెంజి చేసినా సబబుగానే కాదు, భేష్ గా ఉంటుంది. మరి చినబాబుకు ఈ తత్వం బోధపడుతుందా.

Tags:    

Similar News