అడుగు మందం కూడా గ్రాఫ్ పెరగలేదే?

ట్విట్టర్ అన్నది తన మదిలోని భావాలను పది మందికీ చెప్పుకోవడానికి మాత్రమే పనికివస్తుంది. అన్ని వేళలా సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కాలంలో ట్విట్టర్ కి విలువ [more]

Update: 2020-07-26 15:30 GMT

ట్విట్టర్ అన్నది తన మదిలోని భావాలను పది మందికీ చెప్పుకోవడానికి మాత్రమే పనికివస్తుంది. అన్ని వేళలా సోషల్ మీడియా అందుబాటులో ఉన్న కాలంలో ట్విట్టర్ కి విలువ పెరిగింది. ఇది కాదలలేని సత్యమే అయినప్పటికీ ట్వీట్లతోనే రాజకీయం నడవదు. ప్రజలకు కదిలించాలంటే భారత్ లాంటి దేశాల్లో ఇప్పటికీ జనంలోకి తిరగడమే ఏకైక మార్గం. వారి సమస్యలను ఆకలింపు చేసుకుని పరిష్కరించడానికి చూడడం, ఈ క్రమంలో పోరాడడానికి కూడా సిధ్ధపడడం సిసలైన రాజకీయం అవుతుంది.

ట్వీట్ తో సరి….

మరి తెలివి మీరిన నయా రాజకీయవాదులు ట్విట్టర్ తో సరిపెడుతున్నారు. చావుకైనా పెళ్ళికైనా ఒక ట్వీట్ చేస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించాలంటే ట్వీట్లతో కుదిరేది కాదని తెలుసుకోలేకపోతున్నారు. ఏపీలో టీడీపీ దారుణంగా ఓటమి పాలు అయ్యాక ఎంతో కొంత చంద్రబాబు అయినా ఊళ్ళు పట్టుకుని ప్రజల మధ్యన తిరిగారు కానీ భావి వారసుడు లోకేష్ బాబు మాత్రం గుమ్మం దిగిన పాపాల పోలేదని పసుపు పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇపుడు కరోనా కారణంగా గత ఆరు నెలలుగా చంద్రబాబు ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. అయినా సరే ట్విట్టర్ ద్వారా వైసీపీని చీల్చి చెండాడుతున్నారు. మరి యువకుడు అయిన లోకేష్ ఏం చేస్తున్నారు అంటే తండ్రి పక్కనే ఉంటూ ట్వీట్లు వేస్తున్నారని చెప్పాలి.

అంగుళం కదిలేనా ..?

రాజకీయం అంటే రణ క్షేత్రంలోనే ఉండాలి. అక్కడే అమీ తుమీ తేల్చుకోవాలి. కానీ లోకేష్ బాబు మాత్రం పొద్దున్నా, మధ్యాహ్నం, రాత్రి అని టైం టేబిల్ పెట్టుకుని మరీ బహు శ్రధ్ధగా ట్వీట్లు వేస్తున్నారు. అనుకూల మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన వార్తలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో తన పని అయిపోయిందనుకుంటున్నారు. జగన్ సర్కార్ ని బాగా గొప్పగా తిట్టానని మురిసిపోతున్నారు. మరి లోకేష్ ట్వీట్లకు అంత మహిమా మహత్య్సం ఉంటే చంద్రబాబు ఎందుకు రాత్రీ పగలు పార్టీ కోసం వగచి వాపోతారు. చినబాబు ఈ మాత్రం లాజిక్ కూడా తెలుసుకోకుండా ట్విట్టర్ వీరుడుగా పేరు సంపాదించుకున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.

కష్టమేగా …?

తన ట్వీట్లు ఎంత మంది చూశారోనని లెక్కలేసుకుంటున్న లోకేష్ ఆ వ్యూ కౌంట్ ఎన్నికల ఓట్లుగా ఎప్పటికీ మారవన్న సత్యాన్ని మాత్రం మరచిపోతున్నారని అంటున్నారు. లోకేష్ ట్వీట్లు చూసి ఆయన అనుచరులే సంబరపడాలి కానీ టీడీపీ గ్రాఫ్ అడుగు కూడా పెరగలేదని అంటున్నారు. ఓ వైపు పార్టీలోని నాయకులు నైరాశ్యంలో ఉన్నారు. జగన్ సర్కార్ దూకుడు మీద ఉంది. ఈ క్రమంలో తాను ఉన్నానని చెప్పడానికైనా లోకేష్ కాస్త చురుకైన పాత్ర తీసుకుంటే బాగుంటుందని సూచనలు అందుతున్నాయి. వీడియో సమావేశాల ద్వారా అయినా యువ నాయకులను పార్టీలో క్రియాశీలం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఎంతసేపూ ప్రభుత్వాన్ని తిట్టడమే కాకుండా పార్టీ ఎక్కడ ఉంది. ఎలా బతికి బట్టకట్టేలా చేయాలన్నది కూడా కాస్తా ఆలోచన చేస్తేనే లోకేష్ కి భావి, టీడీపీకి భవిష్యత్తు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News