చిన‌బాబూ.. ఇలా అయితే.. ఎలా సెప్పు…?

టీడీపీ యువ నాయ‌కుడు, భావి పార్టీ అధ్యక్షుడ‌ుగా భావించే.. మాజీ మంత్రి నారా లోకేష్‌లో మార్పు రావ‌డం లేదా ? అంద‌రినీ క‌లుపుకొని వెళ్దాం… పార్టీలో ఉన్న [more]

Update: 2021-08-19 03:30 GMT

టీడీపీ యువ నాయ‌కుడు, భావి పార్టీ అధ్యక్షుడ‌ుగా భావించే.. మాజీ మంత్రి నారా లోకేష్‌లో మార్పు రావ‌డం లేదా ? అంద‌రినీ క‌లుపుకొని వెళ్దాం… పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మ‌న వారే క‌దా ? అనే ధోర‌ణి ఆయ‌న‌లో క‌నిపించ‌డం లేదా? ఇది పార్టీలో తీవ్ర వివాదానికి.. లోకేష్‌పై మార్కులు మ‌రింత‌గా త‌గ్గిపోవ‌డానికి దోహ‌ద ప‌డుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. పార్టీ ప్రస్తుతం విప‌క్షంలో ఉంది. అందునా.. పెద్దగా బ‌లంగా కూడా లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల్సిన లోకేష్‌. కేవ‌లం కొంద‌రికే ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న విమ‌ర్శలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి.

కార్యకర్తల ఇళ్లకు వెళ్లి…

ఇటీవ‌ల కాలంలో లోకేష్ జిల్లాల ప‌ర్యట‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు చ‌నిపోతే.. వారి ఇళ్లకు వెళ్లి మ‌రీ ప‌రామ‌ర్శిస్తున్నారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని.. భ‌రోసా ఇస్తున్నారు. ఇలా .. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో ఒక‌రు చ‌నిపోతే..వెళ్లి ప‌రామ‌ర్శించి.. కొంత‌మేర‌కు హ‌డావుడి చేశారు. త‌ర్వాత‌.. బ‌న‌గాన‌ప‌ల్లిలో ఒక‌రు చ‌నిపోతే.. వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఇక‌, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి కుటుంబానికి క‌ష్టం వ‌స్తే.. స్వయంగా వ‌చ్చి.. అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని కుటుంబానికి భ‌రోసా క‌ల్పించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టడం లేదు.

అదే సమస్య….

అయితే.. లోకేష్ ప‌రామ‌ర్శిస్తున్న కుటుంబాల‌ను ప‌రిశీలిస్తే.. సామాజిక వ‌ర్గం ప‌రంగా.. త‌న సామాజిక వర్గానికి చెందిన వారైనా అయి ఉంటున్నారు. లేదా.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న నాయ‌కుల కుటుంబాలైనా అయి ఉంటున్నాయి. అదే స‌మ‌యంలో పెద్ద పేరున్న కుటుంబ‌మైనా అయివుంటోంది. కానీ, వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. అన్ని వ‌ర్గాల వారూ.. ఆర్థికంగా పేద‌లుగా ఉన్న టీడీపీ నాయ‌కుల కుటుంబాల్లోనూ క‌ష్టాలు వ‌స్తున్నాయి. పోలీసుల వేధింపులు కావొచ్చు.. కేసులు కావొచ్చు.. మ‌ర‌ణాలు కావొచ్చు.. కానీ.. వీరిని ప‌రామ‌ర్శించేందుకు మాత్రం లోకేష్ ఎక్కడా చొర‌వ‌చూప‌డం లేదు. పార్టీలో సాధార‌ణ కార్యక‌ర్తలు, సుధీర్ఘకాలంగా క‌ష్టప‌డుతోన్న వారు ఉన్నారు. ఇక ఇటీవ‌ల రాష్ట్ర స్థాయి ప‌ద‌వులు వ‌చ్చిన నేత‌లూ చాలా మందే ఉన్నారు. వారి ఇబ్బందులు మాత్రం లోకేష్‌కు ప‌ట్టడం లేద‌ట‌.

మంత్రిగా ఉన్నప్పుడు కూడా…?

అధికారంలో ఉండి.. మంత్రిగా పెత్తనం చేసిన స‌మ‌యంలోనూ ఇలానే వ్యవ‌హ‌రించార‌ని.. కొంద‌రికి మాత్రమే అప్పాయింట్‌మెంట్ ఇచ్చార‌ని.. ఆయ‌న‌పై విమ‌ర్శలు వున్నాయి. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే ప‌ద్ధతిని కొన‌సాగిస్తున్నార‌నే ఈస‌డింపులు వినిపిస్తున్నాయి. అదే.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను చూసుకుంటే.. తాను ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక‌వ‌ర్గాల నేత‌లు, ప్రజ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. వారిని ఆదుకుంటాన‌ని.. గుర్తింపు ఇస్తాన‌ని చెప్పారు. అన్నట్టుగానే కొత్త ప‌ద‌వులు (రెండో డిప్యూటీ మేయర్, కార్పొరేష‌న్లు వంటివి) సృష్టించి మ‌రీ వారికి త‌గిన గుర్తింపు ఇస్తున్నారు. మ‌రి ఈ త‌ర‌హా దృష్టి లోకేష్‌కు స‌న్నగిల్లింద‌ని.. టీడీపీ నేత‌లే.. త‌ల్లడిల్లుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్రమంలోనే చినబాబు.. ఇలా అయితే.. ఎలా సెప్పు? అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News