స్టూడెంట్ నంబర్ వన్… ?

ఏపీలో విద్యార్ధి నాయకుడు కొత్తగా ఉదయించాడు. ఆయనే నారా వారి అబ్బాయి లోకేష్. విదేశాల్లో బాగా చదువుకున్న లోకేష్ ఇపుడు అర్జంటుగా స్టూడెంట్ లీడర్ అయిపోయారు. వారి [more]

Update: 2021-06-13 06:30 GMT

ఏపీలో విద్యార్ధి నాయకుడు కొత్తగా ఉదయించాడు. ఆయనే నారా వారి అబ్బాయి లోకేష్. విదేశాల్లో బాగా చదువుకున్న లోకేష్ ఇపుడు అర్జంటుగా స్టూడెంట్ లీడర్ అయిపోయారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకున్న లోకేష్ వైసీపీ సర్కార్ ని ఇరకాటంలో పెడుతున్నారు. విద్యార్ధులు నవ సమాజ నిర్మాతలని, వారి విషయంలో వైసీపీ సర్కార్ ది కక్షపూర్తిమైన వైఖరి అని ఆయన కడిగి పారేస్తున్నారు. మీకు నేనున్నా అంటూ ఆల్ యూనియన్స్ స్టూడెంట్ లీడర్ గా కొత్త అవతారం ఎత్తేశారు. చిత్రమేంటి అంటే టీడీపీకి విద్యార్ధి విభాగం అంటూ ఒకటి ఉంది. కానీ ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. చినబాబే ఇపుడు ఆ వింగ్ ని టేకప్ చేస్తున్నట్లుగా ఉన్నారు.

వదల బొమ్మాళీ…?

జగన్ పట్టుదల ఏంటో తెలిసి మరీ అక్కడే గుచ్చుతున్నారు లోకేష్. టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామన్నది జగన్ పంతం. అలా కుదరదు అంటోంది నారా వారసత్వం. దేశంలో పదిహేను రాష్ట్రాలు టెన్త్ ఇంటర్ రద్దు చేయగా లేనిది మీకేంటి ఈ మూర్ఖపు పట్టుదల అంటూ లోకేష్ గట్టిగానే తగులుకుంటున్నారు. విద్యార్ధులు ప్రాణాల కంటే కూడా మీ మాటే చెల్లలా అని ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. రెండో మాటకు కూడా లేకుండా స్టూడెంట్స్ అందరినీ ఒక్క దెబ్బకు ప్రమోట్ చేసి పారేయండి అంటూ ఉచిత సలహాలే ఇస్తున్నాడీ మాజీ మంత్రి.

సన్ ఆఫ్ నారా అంటూ….?

మొత్తానికి లోకేష్ ఇపుడు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కే పరీక్షలు పెడుతున్నారు. ఆయన ఇంటర్, టెన్త్ పరీక్షలు ఎపుడు పెడతారో తెలియదు కానీ తెల్లారి లేస్తే లోకేష్ ఇస్తున్న ప్రశ్నపత్రానికి జవాబులు రాయడమే పనిగా మారుతోంది. అందరూ సన్ ఆఫ్ నారా చంద్రబాబు కారు కదా లోకేషం అంటూ ఆదిమూలపు వారు కూడా బాగానే సెటైర్లు వేస్తున్నారు. మీకంటే విదేశాల్లో సీట్లు దొరుకుతాయి. భారీ ఫీజులు కట్టే మోతుబరులు కూడా క్యూలో సిద్ధంగా ఉంటారు. కానీ పేద విద్యార్ధులకు మంచిగా చదువుకుంటేనే కానీ సీట్లు దొరకవు అన్నది తెలుసుకో లోకేశం అంటూ మంత్రి గారు బాగానే రిటార్టు ఇస్తున్నారు. అయినా రద్దు చేసిన పదిహేను రాష్ట్రాలనే చూస్తున్నావు కానీ మిగిలిన వాటి గురించి చెప్పవేంటి అంటూ గద్దిస్తున్నారు. ఇక ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు మిగిలిన వారు చేస్తున్నారా. ఏ రాష్ట్రం ఇష్టం ఆ రాష్ట్రానిది, బయట వారితో మాకు పోలికేంటి అంటూ లైట్ తీసుకుంటున్నారు మంత్రి గారు.

పొలిటికల్ గేమ్..?

అయితే లోకేష్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. ఈ విషయంలో అవసరం అయితే న్యాయ పోరాటం కూడా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్ధులు ఏపీలో ఉన్నారు. వీరికి మద్దతుగా గళం విప్పితే ఇవాళ కాకపోయినా రేపటి రోజున అయినా వీరు రాజకీయంగా ఉపయోగపడుతారు అన్నదే లోకేష్ మార్క్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. విద్యార్ధులతో పెట్టుకుంటే ఎంతటి ప్రభుత్వాలకైనా ఇబ్బందే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక వారి మనసును గెలుచుకోవడానికే లోకేష్ ఇలా రంగంలోకి దిగిపోయారని అంటున్నారు. విద్యార్ధి నాయకుడుగా ఉంటూ అసోం ముఖ్యమంత్రి అయిన ప్రఫుల్ల కుమార్ మహంత‌ వంటి వారే ఇపుడు లోకేష్ కి ఆదర్శంగా ఉన్నారట. మొత్తానికి తండ్రి చంద్రబాబుకు కంప్లీట్ డిఫరెంట్ రూట్ లో లోకేష్ వెళ్తున్నారు. తనకంటూ కొత్త వర్గాన్ని ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ పోరాటంలో హిట్ అయితే స్టూడెంట్ నంబర్ వన్ లోకేష్ అవుతారని తమ్ముళ్ళు సంబరపడుతున్నారు.

Tags:    

Similar News