లోకేష్ ఇక ఆ రూట్ లోకి వెళితేనే ?

ఎన్టీఆర్ తెలుగు వారి ఆస్తి. ఆయన రాజకీయ నాయకుడిగా కాక ముందే ప్రతీ ఇంట్లో, ప్రతీ కంట్లో హీరోగా కొలువున్న నాయకుడు. ఇక ప్రజా నాయకుడిగా కూడా [more]

Update: 2021-08-31 14:30 GMT

ఎన్టీఆర్ తెలుగు వారి ఆస్తి. ఆయన రాజకీయ నాయకుడిగా కాక ముందే ప్రతీ ఇంట్లో, ప్రతీ కంట్లో హీరోగా కొలువున్న నాయకుడు. ఇక ప్రజా నాయకుడిగా కూడా ఎన్టీఆర్ సాధించిన ఖ్యాతి చాలా గొప్పది. ఆయన ఏడున్నరేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. దాని ద్వారా చిర కీర్తిని ఆర్జించారు. ఆయన అల్లుడు చంద్రబాబు హయాంలో అన్న గారి పేరు కాస్తా మసకబారినా మనవడు లోకేష్ మాత్రం తాతతోనే తన రాజకీయం అంటున్నారుట. ఒక విధంగా చూస్తే ఇది లోకేష్ మార్క్ పాలిటిక్స్ గా టీడీపీలో చూస్తున్నారు.

అలా వర్కౌట్ కాక…

కేరాఫ్ చంద్రబాబు అంటే జనాలకు పెద్దగా ఎక్కడంలేదు. ఎందుకంటే చంద్రబాబుకు స్వయం ప్రకాశం లేదు. ఆయన ఏదో ఎత్తులు పొత్తులతో తన రాజకీయ బండిని ఇక్కడిదాకా లాక్కువచ్చారు. మరి లోకేష్ ఎదగాలి అంటే ఏం చేయాలి అంటే ఎన్టీఆరే దిక్కు అంటున్నారు. ఇప్పటి తరానికి ఎన్టీఆర్ ని మరోసారి గుర్తు చేయడం ద్వారా తన రాజకీయ పంటను పండించుకునేందుకు లోకేష్ రెడీ అవుతున్నారుట. అదెలా అంటే జై ఎన్టీయార్, జై తెలుగుదేశం నినాదాలే తారకమంత్రాలుగా లోకేష్ బాబు ఇక మీదట ఏపీని చుట్టేయబోతున్నారుట.

అచ్చం జగన్ లాగానే…

జగన్ కి జనంలో ఫాలోయింగ్ ఎలా వచ్చింది అంటే ఓదార్పు యాత్రలు, వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణలతోనే. ఆయన అలా ఏపీ నిండా వైఎస్సార్ బొమ్మలను ఎక్కడికక్కడ ప్రతిష్టించేశారు. తద్వారా తన నాయకత్వాన్ని పెంచుకున్నారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకుని లోకేష్ కూడా రంగంలోకి దిగిపోతున్నారు. ఏపీలోని పదమూడు జిల్లాల్లోని ప్రతీ పల్లెలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఉండేలా చినబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆ విగ్రహాలను ప్రారంభించడం ద్వారా తాను తాతకు సిసలైన వారసుడిని అని చెప్పాలన్నది ఆయన తపన. అదే విధనా తెలుగుదేశం శ్రేణులను కూడా చైతన్యపరచడం. తన నాయకత్వాన్ని వారు ఆమోదించేలా చేసుకోవడం. ఇదే లోకేష్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

అన్న దీవిస్తాడా …?

తన నుంచి అధికారాన్ని లాక్కుని నయా ఔరంగజేబు మాదిరిగా చంద్రబాబు వ్యవహరించారు అని తన జీవిత చరమాంకంలో ఎన్టీఆర్ శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబు ఎంతలా ఎన్టీఆర్ బొమ్మకు దండాలు పెట్టినా వెన్నుపోటు ఎపిసోడ్ కారణంగా ఆయన వైపు ఎన్టీఆర్ అభిమానులు టర్న్ కాలేదు. ఇపుడు మనవడు ఎన్టీఆర్ అంటే వారు ఈ వైపునకు వస్తారా అన్నదే చర్చగా ఉంది. అయితే కూతురు కొడుకు కాబట్టి ఎంతో కొంత సెంటిమెంట్ పండవచ్చు అంటున్నారు. కానీ నూరు శాతం ఈ విగ్రహాల రాజకీయాలతో లోకేష్ మహానాయకుడు కాలేరు అని అంటున్న వారూ ఉన్నారు. లోకేష్ షార్ట్ కట్ మెదడ్స్ వదిలేసి ప్రజా సమస్యల మీద పోరాడితేనే ఎప్పటికైనా మేలు జరుగుతుంది అని టీడీపీలోని పెద్దలే సూచిస్తున్నారు.

Tags:    

Similar News