షెడ్డులోకి నెట్టడమేనా?

తెలుగుదేశం పార్టీ రాజకీయమే ఇలా ఉంటుంది. తాను చేస్తే సంసారం. వేరేవరో చేస్తే మరేదో అంటారు తమ్ముళ్ళు. ఇక తమ వద్దకు వచ్చేవారంతా మేలిమి బంగరాలు, బయటకు [more]

Update: 2019-12-01 05:00 GMT

తెలుగుదేశం పార్టీ రాజకీయమే ఇలా ఉంటుంది. తాను చేస్తే సంసారం. వేరేవరో చేస్తే మరేదో అంటారు తమ్ముళ్ళు. ఇక తమ వద్దకు వచ్చేవారంతా మేలిమి బంగరాలు, బయటకు పోయేవారంతా చెత్తా చెదారాలు. ఇలా ఆత్మ స్తుతి పరనింద పీక్స్ కి చేరడం వల్లనే టీడీపీకి ఊహలకు వాస్తవాలకు మధ్య లింక్ ఎపుడో తెగిపోయింది. దానివల్లనే ఆ పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ముచ్చటగా మూడవసారి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. అలా ఇలా కాకుండా ఘోరమైన పరాజయం కూడా టీడీపీ ఖాతాలో పడిపోయింది. టీడీపీలో ఉంటే మంచివాళ్ళు, బయటకు పోతే చెత్త సరుకు అంటున్నారు ఆ పార్టీలో ఒక్కసారి మాత్రమే గెలిచిన బోండా ఉమామహేశ్వరరావు. అసలు ఇదే బోండా పార్టీ ఓడిన కొత్తల్లో బయటకే రాలేదు. పైగా, సొంత సామాజిక‌వర్గంతో సమావేశాలు, భేటీలు వేసి చంద్రబాబుని హడలుకొట్టేశారు. మరి సమీకరణలు ఎపుడు మారాయో కానీ ఆయనే ఇపుడు హోల్ మొత్తం టీడీపీకి వత్తాసు పలుకుతూ తెగ హల్ చల్ చేస్తున్నారు.

లోపం గుర్తించరా…?

తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది, దీని మీద టీడీపీ సమీక్షలు ఎలా ఉన్నాయంటే మనం బాగానే పాలించాం, తప్పంతా ఓట్లేయని జనానిదేనని అంటారు. అధినాయకుడు చంద్రబాబు అయితే ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకొస్తున్నారు కూడా. ఇక పార్టీలో విధానాల మీద సరైన పరిశీలన చేయకుండా టైం పాస్ రివ్యూలు పెడుతూ జగన్ని తిడుతూ చేస్తున్న జిల్లా టూర్లకు విసిగి తమ్ముళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇక కొత్త సర్కార్ ఇలా కుర్చీ ఎక్కిందో లేదో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన‌ను అంటే బాగోదని చెప్పినా కూడా చంద్రబాబు వినకుండా ధర్నాలు, దీక్షలు చేపట్టంతోనే చాలా మంది ఎమ్మెల్యే తమ్ముళ్ళు ఇసుక దీక్షకు గైర్హాజరు అయ్యారు. ఇక అవకాశం కోసం కొంతమంది తమ్ముళ్ళు ఎదురుచూస్తూంటే మరి కొందరు పార్టీ లైన్ దాటేస్తున్నారు. అలా వల్లభనేని వంశీ వైసీపీతో టచ్ లోకి వెళ్ళారు. గంటా శ్రీనివాస్ లాంటి వారు గోడ దూకేందుకు రెడీగా ఉన్నారు. ఇవీ వాస్తవాలు అయితే పోయినోళ్ళు అంతా చెత్త అని తమ్ముళ్ళు అనడమే వింతా విడ్డూరమూ.

లోకేష్ ఎందుకు ఓడారో…?

పార్టీలో మాణిక్యాలే అన్నీ ఉంటే లోకేష్ ఎందుకు ఓడారో తమ్ముళ్ళు చెప్పగలరా. అసలు వెళ్ళిపోతున్న నాయకులను చెత్త అంటున్న బోండా ఉమా తాను ఎందుకు ఓడానో ఆంత విమర్శ చేసుకున్నారా. మరి ఇదే టీడీపీ నుంచి 2009 ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి తమ్ముళ్ళు వెళ్ళిపోతే వారిని చెత్త అన్నదీ వీళ్ళే. తిరిగి 2014 ఎన్నికలకు ముందు వారంతా వస్తే బంగారం అంటూ చేర్చుకున్నదీ ఇదే తెలుగుదేశం పార్టీ పెద్దలు. అందువల్ల వెళ్ళిన వారు చెత్త కాలేరు. పార్టీలో సమస్యలు ఉన్నాయనికి సంకేతమే వెళ్తున్న వారు చెబుతున్న మాట. టీడీపీ వర్తమానం దైన్యం, భవిష్యత్తు అంధకారం అని భావించిన వారు కూడా పార్టీని వీడుతున్నారు. మరి వారు చేసిన విమర్శలను పరిశీలించి పార్టీని చక్కదిద్దుకుంటే సైకిల్ జోరుగా పరుగులు తీసుకుంది. లేకపోతే షెడ్డుకు పోతుందని బయటకు వచ్చిన వారు అంటున్నారు. మరి చూడాలి ఇకనైనా పరిశీలన చేసుకుంటారో లేదో.

Tags:    

Similar News