అదృష్టం అందలమెక్కిస్తే…?

అదృష్టం అందలమెక్కించినా నిలుపుకోలేక పోతున్నారా? తాను కలలో సయితం ఊహించని విధంగా ఎదిగినా ఇంకా పాత జీవితాన్ని వదులుకోలేకపోతున్నారా? అందుకే ఆ యువనేతను వైఎస్ జగన్ పక్కన [more]

Update: 2019-09-01 12:30 GMT

అదృష్టం అందలమెక్కించినా నిలుపుకోలేక పోతున్నారా? తాను కలలో సయితం ఊహించని విధంగా ఎదిగినా ఇంకా పాత జీవితాన్ని వదులుకోలేకపోతున్నారా? అందుకే ఆ యువనేతను వైఎస్ జగన్ పక్కన పెట్టారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ యువనేతే నందిగం సురేష్. నందిగం సురేష్ యువకుడు. గుంటూరు జిల్లాలోని తాడి కొండ నియోజకవర్గానికి చెందిన నందిగం సురేష్ చంద్రబాబు హయాంలో అరటి తోటలు తగులబెట్టిన ఉదంతంతో వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా మారారు.

జగన్ మంచి ప్రయారిటీ ఇచ్చి…..

వైఎస్ జగన్ నందిగం సురేష్ లోని స్పార్క్ ను గుర్తించి ఎన్నికలకు ముందు అధికార ప్రతినిధిగా నియమించారు. అయితే నందిగం సురేష్ ఊహించని విధంగా ఆయనకు బాపట్ల ఎంపీ టిక్కెట్ ను కేటాయించారు. అసలు టిక్కెట్లు కేటాయించడమే కాదు జగన్ నందిగం సురేష్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఎన్నికల ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇడుపుల పాయలో నందిగం సురేష్ చేతనే చదివించారు. అయితే ఎంపీగా గెలిచి మూడు నెలలు గడవకముందే నందిగం సురేష్ అధినేత వద్ద నమ్మకాన్ని కోల్పోయారంటున్నారు.

ఎంపీ అయినా ఇక్కడే…..

నందిగం సురేష్ పేరుకు బాపట్ల ఎంపీ అయినప్పటికీ ఆయన ఎక్కువగా తాడేపల్లి నియోజకవర్గంపైనే దృష్టి పెడుతుంటారు. తాడేపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నందిగం సురేష్ లు కూడా దగ్గర బంధువులేనంటారు. అయితే సురేష్ అనుచరులు తాడేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో ఇసుక దందా చేస్తున్నారు. అధికారులను కూడా లెక్క చేయకపోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కల్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి నందిగం సురేష్ కు, ఎమ్మెల్యే శ్రీదేవి ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయింది.

జగన్ పక్కన పెట్టారంటూ…..

ఈ పంచాయతీ జగన్ వరకూ వెళ్లినప్పటికీ తొలినాళ్లలో ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే రోజురోజుకూ నందిగం సురేష్, శ్రీదేవిల మధ్య వార్ ముదిరిపోతోంది. తాజాగా కూడా నందిగం సురేష్ అనుచరులపై శ్రీదేవి కేసు నమోదు చేయించారు. ఇది తెలుసుకున్న సురేష్ సంబంధిత పోలీసు అధికారులను బదిలీ చేయించారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండలో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే నందిగం సురేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఇవన్నీ తెలసుకున్న జగన్ నందిగం సురేష్ ను పక్కన పెట్టారన్న వార్తలు వైసీపీలో గుప్పు మంటున్నాయి.

Tags:    

Similar News