బాలయ్య బరువుగా మారుతున్నారా… ?

ఆయన నందమూరి వారి నట వారసుడు. ఆ ట్యాగ్ తో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా సినీ సీమను ఏలుతున్నారు. బాలకృష్ణ ఆవేశపరుడు అంటారు. అది వెండి తెర [more]

Update: 2021-07-23 14:30 GMT

ఆయన నందమూరి వారి నట వారసుడు. ఆ ట్యాగ్ తో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా సినీ సీమను ఏలుతున్నారు. బాలకృష్ణ ఆవేశపరుడు అంటారు. అది వెండి తెర మీద బాగా పండుతుంది. అలా ఎమోషనల్ పాత్ర‌లకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు. అయితే సినిమా స్క్రిప్ట్ వేరు, రియల్ లైఫ్ వేరు. బాలకృష్ణ నిజ జీవితంలో కూడా సినిమా ఫక్కీలోనే భారీ డైలాగులు పేల్చుతారు. తీరి కూర్చుని వివాదాలు తెచ్చుకుంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ చూస్తూంటే ఎవరికైనా బాధ, కోపం వస్తాయి.

అనుభవం ఇదేనా ..?

ఆరు పదులు దాటిన వయసు బాలయ్యది. అంతే కాదు, రెండు సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గురించి ఆయనకు తెలియదా అన్నదే ఇక్కడ చర్చ. ఈ అవార్డుని ఎందరో మహనీయలు అందుకున్నారు. ఇంకా అందుకుంటారు. దేశ ప్రజలంతా కలసి ఇచ్చే అవార్డుగానే దీన్ని చూడాలి. అటువంటి ఉత్తమోత్తమైన అవార్డుని ఆయన తన కాలి చెప్పుతో సమానం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మరి బాలకృష్ణ వయసు కానీ అనుభవం కానీ ఇంతేనా అన్న మాట అయితే అందరి నోటా వస్తోంది.

పద్మశ్రీ ఎందుకు…?

ఎన్టీయార్, ఏయన్నార్ లకు ఒకేసారి అరవై దశకం చివరలో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం అందించింది. ఇది కూడా ఉన్నతమైన పౌర పురస్కారమే. ఇదే వరసలో సమున్నతమైనది భారతరత్న. మరి పద్మశ్రీ కూడా తన తండ్రికి వద్దా అన్నది బాలకృష్ణ జవాబు చెప్పాలి. ఇక బాలయ్య ఒక కుమారుడిగా తన తండ్రి ఆర్జించిన కీర్తికి తగిన విధంగా భారతరత్న అవార్డు రాలేదు అన్న బాధ ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనలేదు. ఆ మాటకు వస్తే ఈ రోజుకీ కనీసం పద్మశ్రీ కూడా రాని మేటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాగని అవార్డులను ఎవరైనా తూలనాడుతారా. ఒక్కోసారి దక్కవచ్చు, పోవచ్చు. అంతే తప్ప వాటి విలువ భారతదేశం మొత్తం ఔన్నత్యంతో సమానమైనది అని అంతా అంగీకరిస్తారు.

భారమేనా…?

ఒక వైపు కుమారుడు లోకేష్ సరిగ్గా ఎదిగిరాక చంద్రబాబు ఇప్పటికే సతమతమవుతూ ఉన్నారు. ఇపుడు తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్టీయార్ తనయుడు బాలకృష్ణ ఇలా వివాదస్పదమైన వ్యాఖ్యలతో తన పరువునే కాదు, టీడీపీది కూడా తీస్తూంటే చంద్రబాబు చూస్తూ ఉండాల్సిందేనా అన్న మాట అయితే ఉంది. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో తనకు తెలియదు అని ఇప్పటికి కొన్ని వందల సార్లు చంద్రబాబు అంటూ ఉంటారు. తన వాళ్ళను ఒక్కసారి ఆయన చూసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు అదే లభిస్తుంది. ఇక బాలకృష్ణ ఈ కష్టసమయంలో టీడీపీకి అండగా ఉండాల్సింది పోయి బరువుగా మారడం పట్ల తమ్ముళ్ళు కూడా బాధపడుతున్నారు. మొత్తానికి ఒక్క బాలయ్య చాలు అన్నట్లుగా టీడీపీలో సీన్ ఉంది.

Tags:    

Similar News