వరస వివాదాలు…..ఈ ఎమ్మెల్యే ల‌క్ష్యమేంటి..?

ఏ నాయ‌కుడు అయినా.. ఒకసారి వివాదం అయితే వెంట‌నే స‌ర్దుబాటు చేసుకుని మ‌రోసారి వివాదాల‌కు దూరంగా ఉంటారు. కానీ, నిత్యం వివాదాలు.. వివ‌ర‌ణ‌ల‌తో సాగుతుంటే.. ఎవ‌రైనా ఏమ‌నుకుంటారు [more]

Update: 2021-07-26 02:00 GMT

ఏ నాయ‌కుడు అయినా.. ఒకసారి వివాదం అయితే వెంట‌నే స‌ర్దుబాటు చేసుకుని మ‌రోసారి వివాదాల‌కు దూరంగా ఉంటారు. కానీ, నిత్యం వివాదాలు.. వివ‌ర‌ణ‌ల‌తో సాగుతుంటే.. ఎవ‌రైనా ఏమ‌నుకుంటారు ? పార్టీపై పైచేయి సాధించాల‌ని భావిస్తున్నార‌నో.. లేక కీల‌క ప‌ద‌వులు అందిపుచ్చుకునేందుకు.. లేదా ఆయ‌న‌కు అధిష్టానంపై ఇంకేదో అసంతృప్తి ఉన్నందునో ఇలా వ్యవ‌హ‌రిస్తున్నార‌నో అనుకుంటారు. ఇలాంటి నేత‌ల వార్తల‌ను ప్రత్యర్థి పార్టీల‌కు చెందిన మీడియా మ‌రింత దూకుడుగా ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, ఇలా వివాద‌మై.. అలా వివ‌ర‌ణ‌లు ఇవ్వడంలోనే ఆ ఎమ్మెల్యే ఇప్పటికి రెండు సంవ‌త్సరాలుగా వార్తల్లో నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆయనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

పనులు చేయించుకోలేక పోతున్నామనే?

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్టయిలే వేరు. ఆయ‌న ఆశించింది జ‌ర‌గ‌క‌పోతే.. వెంట‌నే బ‌ర‌స్ట్ అవుతార‌నే పేరు కూడా ఉంది. గ‌తంలో కాంగ్రెస్‌.. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నుంచి గెలిచిన వెంట‌నే మంత్రి ప‌ద‌విని ఆశించార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు. జ‌గ‌న్ కోసం టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే రెడ్డి సామాజిక వ‌ర్గం ఈక్వేష‌న్లు కుద‌ర‌ని నేప‌థ్యంలో కీల‌క‌మైన నాయ‌కుల‌కు కూడా ప‌ద‌వులు ద‌క్కలేదు. ప్రస‌న్న ఈ జాబితాలో చాలా దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే.. త‌న వ‌ర్గానికి కూడా ప‌నులు చేయ‌లేక‌పోతున్నాన‌నే ఆవేద‌న ఆయ‌న‌లో ఉన్న మాట నిజ‌మే.

వరస వివాదాలతో…..

నెల్లూరు జిల్లా వైసీపీలో ఉన్న గ్రూపు రాజ‌కీయాల గురించి ఇక్కడ ప్రత్యేక ప్రస్తావ‌న అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే కొన్ని నెల‌ల కింద‌ట‌ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలే చేశారు. మా ప్రభుత్వం వ‌చ్చిమాకు చేసింది ఏంటి ? అని పేర్కొన్న వీడియో ప్రధాన మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. దీంతో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ఒక్క ఘ‌ట‌న‌తో ఆయ‌న ఇమేజ్‌కు పార్టీలో డ్యామేజీ జ‌రిగింద‌ని ప‌రిశీల‌కులు చెబుతుంటారు. ఇక‌, తాజాగా కూడా ఆయ‌న నోరు అదుపు చేసుకోలేక పోయారు. సీఎం జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల నిర్మాణంపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ ఇళ్లల్లో శోభ‌నాలు కూడా చేసుకోలేం అంటూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడిన మాట‌లు జ‌గ‌న్‌, పార్టీ ప‌రువు తీసేశాయి. ఇవి వైర‌ల్ అయి.. కీల‌క స‌ల‌హాదారు నుంచి ఫోన్లు వ‌చ్చే స‌రికి ప్రస‌న్న టంగ్ మార్చేశార‌ట‌.

మీడియా కుట్ర అంటూ…

సీఎం వైఎస్‌ జగన్‌కు తనను దూరం చేయాలని ఓ వ‌ర్గం మీడియా సంస్థలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పదేపదే ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్‌ జగన్‌తోనే రాజకీయ జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే స‌రే! మ‌రి అన‌ని వ్యాఖ్యల‌ను ఏ మీడియా అయినా ప్రసారం చేస్తే ఎవ‌రైనా ఊరుకుంటారా ? ముందు అనేసి.. త‌ర్వాత వ‌క్రీక‌రించింద‌నే బ‌దులు.. మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌కు చెప్పాన‌ని.. అంటే.. అటు జ‌గ‌న్‌కు కూడా సంకేతాలు పంపిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. ఒక వివాదం.. రెండు వివ‌ర‌ణ‌లు ఇచ్చుకుంటోన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లోప‌ల పార్టీ తీరుపై చాలా బ‌డ‌బాగ్నిని దాచుకుంటున్నారు.

Tags:    

Similar News