చిరు అందరివాడు కాడట?

మెగాస్టార్ చిరంజీవి ఎపుడో అభిమానులకు దేవుడైపోయాడు. దేవుడు అంటే కనిపించడు. అందుకే చిరంజీవి చిత్రపటాలను పెట్టుకుని ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం అభిమానులు ఏనాడో అలవాటు [more]

Update: 2020-03-06 06:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ఎపుడో అభిమానులకు దేవుడైపోయాడు. దేవుడు అంటే కనిపించడు. అందుకే చిరంజీవి చిత్రపటాలను పెట్టుకుని ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం అభిమానులు ఏనాడో అలవాటు చేసుకున్నారు. ఇక దేవుడుని ఎవరు ఎలాగైనా కొలవవచ్చు, పిలవవచ్చు. మనం ఎలా ఊహించుకుంటే అలా దేవుడు ఉంటాడు, మనం ఎలా చెప్పాలనుకుంటే అలా దేవుడి గురించి చెప్పుకోవచ్చు. ఆయన నావాడే అంటూ కొంగున కట్టేసుకోవచ్చు. ఇపుడు మెగా కుటుంబం మొత్తానికి దిక్కూ, దైవం అయిన మెగాస్టార్ విషయంలో అదే జరుగుతోందనిపిస్తోంది.

ఆయన మావాడే…

మెగాస్టార్ అందరివాడు అన్న సినిమా తీశారు. అది రాజకీయాల్లోకి రాకముందు. అంటే తాను అందరివాడుగా ఉంటానని సింబాలిక్ గా చెప్పేందుకు ఆ మూవీ టైటిల్ పెట్టారు. అయితే తరువాత ప్రజారాజ్యం ప్రారంభించి చిరంజీవి కొందరివాడుగా మిగిలిపోయాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో దుకాణం బంద్, ఖేల్ ఖతం అయింది, చిరంజీవి కాంగ్రెస్ ప్రస్థానం కూడా ఇపుడు ముగిసింది. ఆయన సినిమా తెరమీదకు మళ్ళీ వచ్చేశారు. అయితే ఆయన కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ వాసనలు అపుడపుడు కనిపిస్తూంటాయి. దాంతోనే రచ్చ జరుగుతోంది. జగన్ ని చిరంజీవి కలసి రావడాన్ని, మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడాన్ని ఆయన తమ్ముళ్ళు నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారు. దాంతో నాగబాబు అంటున్నారు. చిరంజీవి మావాడే. ఆయన్ని ఏ పార్టీ తమ సొంతం చేసుకోలేదని గట్టిగా చెబుతున్నారు.

ఆయనకు అక్కరలేదుట….

ఇక మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని సోషల్ మీడియాలో ఓ వైపు ప్రచారం సాగుతోంది. అది వైసీపీ వాళ్ళు కానీ మెగాస్టార్ కానీ చేసింది కాదు, అయితే పార్టీగా వైసీపీ దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవడంలేదు. దాంతో అదే నిజం అన్న భావన అందరిలో కలుగుతోంది. దాన్ని ఖండించేలా నాగబాబు లేటెస్ట్ గా మీడియా తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. చిరంజీవి జనసేనకు మాత్రమే మద్దతుదారు. అంతకు మించి ఆయన రాజకీయ జీవితం అంటూ వేరే లేదు. ఆయన సినిమాలకే పరిమితం, ఎవరైనా వెధవ తెలివితేటలు చూపించి ఆయన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. మొత్తానికి వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చినా కూడా చిరంజీవికి అక్కరలేదు అన్నట్లుగా నాగబాబు మాట్లాడుతున్నారు.

అన్నయ్య శిల అయ్యారా….

దేవుడు అన్నట్లుగానే అన్నయ శిల అయ్యారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎందుకంటే ఒకే ఇంట్లో భిన్న అభిప్రాయాలు కలిగిన పార్టీలు, నేతలు ఉంటాయి. చిరంజీవి మూడు రాజధానులకు జై కొట్టే హక్కు రాజ్యాంగం ఆయనకు ఇచ్చిన భావ స్వేచ్చ. ఇక ఆయన ఏ పార్టీలో చేరుతారో, అలాగే సినిమాలు చేసుకుంటారో చెప్పేందుకు ఆయనకూ ఒక హక్కు ఉంది. నాగబాబు ఆయన తమ్ముడిగా చెప్తే పరవాలేదు కానీ, ఆయన జనసేనలో కీలక నేతగా మాట్లాడారు పైగా మాకే అన్నయ్య మద్దతు అంటున్నారు. మరి ఇదంతా మెగస్టార్ భావ స్వేచ్చను హరించేలా ఉన్నాయన్న చర్చ కూడా ఉంది. నిజంగా చిరంజీవి నాగబాబుతో మాట్లాడించాలనుకుంటే మూడు రాజధానుల విషయంలో కూడా అలాగే చేసేవారు. కానీ ఆయన సొంతంగా ఆనాడు ప్రకటన విడుదల చేశారు. ఇపుడు కూడా చిరంజీవి పెదవి విప్పేంతవరకూ ఆయన అందరివాడా, కొందరివాడా అన్న చర్చ అలాగే ఉంటుంది. మొత్తానికి గొప్ప్పళ్ళందరి బాధలూ మెగాస్టార్ కి కూడా పట్టాయని మాత్రమే ఇక్కడ చెప్పుకోవాలేమో.

Tags:    

Similar News