నాగ‌బాబు కుమ్ముడుతో తమ్ముడు పరేషాన్ ?

నాగబాబు బేసికల్ గా నటుడు, ఆయన్ని నిర్మాతను చేసి సిన్మాలు తీయించింది అన్న చిరంజీవి. ఇలా అన్న చాటు తమ్ముడిగా సినీ రంగంలో అడుగులు వేసిన నాగ‌గాబు [more]

Update: 2020-06-03 00:30 GMT

నాగబాబు బేసికల్ గా నటుడు, ఆయన్ని నిర్మాతను చేసి సిన్మాలు తీయించింది అన్న చిరంజీవి. ఇలా అన్న చాటు తమ్ముడిగా సినీ రంగంలో అడుగులు వేసిన నాగ‌గాబు అరవైల్లోకి వయసు వచ్చిన తరువాత తనకూ సొంత గొంతు ఉందని ముందుకు వస్తున్నారు. నిజానికి మెగా బ్రదర్స్ లో అటు అన్న చిరంజీవి ఇటు పవన్ టాప్ రేంజి హీరోలు. నాగబాబు అప్పట్లో ఒకటి రెండు సినిమాలు చేసినా అయన దగ్గర హీరో మెటీరియల్ లేదని ప్రూవ్ కావడంతో సైడ్ క్యారక్టర్లతో సర్దుకున్నారు. ఇక ఆరెంజి సినిమా భారీ నష్టాలతో నిర్మాతగా కూడా స్వస్తివాచకం పలికేశారు, ఇప్పటి తరానికి ఆయన జబర్దస్త్ నాగబాబుగానే తెలుసు.

ఉబలాటంతోనే…?

ఇక నాగబాబు అప్పట్లో చిరంజీవి ఫ్యాన్స్ వ్యవహారాలు చూసేవారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో నాగబాబు అప్పట్లో పోటీ చేయాలనుకున్నారు. అనేక కారణాల వల్ల అది నెరవేరలేదు. ఆ సరదాను ఆయన తమ్ముడి జనసేన పెట్టినపుడు తీర్చుకున్నారు. నర్సాపురం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటిదాకా మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్లలేదు. ఇక జనసేనలో నాగబాబు ఓ నాయకుడిగా ఉన్నారు కానీ పవన్ కి నాదెండ్ల మనోహర్ తోనే ఎక్కువ రాజకీయ బంధం ఉంది. దాంతో నాగబాబు నా యూట్యూబ్ నా ఇష్టం అనుకుంటూ అందులోనే తన భావాలు చెప్పుకుంటూంటారు.

ఇరుకున పెడుతున్నారే ..?

నాగబాబు తాజాగా నాధూరాం గాండ్సేలో దేశభక్తుడిని చూశారు. ఆయన దేశ భక్తి మీద చర్చ జరగాలని అన్నారు. మీడియా కూడా వాస్తవాలు ఎపుడూ చెప్పడంలేదని సణుక్కున్నారు. ఇది కూడా పవన్ పార్టీనే కాదు, చిరంజీవిని కూడా ఇబ్బంది పెట్టింది. గాంధీయిజం మీద చిరంజీవిఅప్పట్లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తీసి యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఆయన తమ్ముడిగా మాత్రం నాగబాబుకు గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడు అయ్యాడు. ఇది జనసేననూ గట్టిగానే తగులుకుంది. మొత్తం మీద చూసుకుంటే పవన్ దిగివచ్చి నాగబాబు వ్యాఖ్యలకు తమ పార్టీకి సంబంధం లేదని చెప్పుకోవాల్సివచ్చింది.

అమరావతి రచ్చ ….

ఇది వైసీపీ ఇప్పటికీ చేస్తూనే ఉంది. అమరావతి భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని నాగబాబు తాజాగా బాంబులే పేల్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నెత్తిన పెట్టుకుని జనం గెలిపిస్తే ఏపీని సర్వనాశనం చేశారని కూడా నిందించారు. రైతుల నుంచి చవగ్గా భూములు కొని బినామీలు రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడమే నాగబాబు చెబుతున్న ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది. మొత్తానికి చూసుకుంటే ఇది టీడీపీని అనాలనుకున్నా అప్పట్లో దాని మిత్రుడిగా ఉన్న పవన్ కి కూడా బాగా గుచ్చుకునే ఆరోపణే ఇది. ఇక పవన్ కళ్యాణ్ కి రాజధాని పక్కనే ఖరీదైన భూమిని తక్కువ ధరకు ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇన్సైడ్ ట్రేడింగ్.. ఇవన్నీ వైసీపీ చేస్తున్న ఆరోపణలే. దీని మీద పవన్ కళ్యాణ్ సైతం నోరెత్తలేని పరిస్థితిని నాగబాబు తన వ్యాఖ్యల ద్వారా కల్పించారని అంటున్నారు.

ఒక్కటేనా…?

నిజానికి ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఒక్కటే అందరికీ శత్రువు. ఆఖరుకు కమ్యూనిస్టులు అయినా కమలనాధులు అయినా కూడా ఒక్కటిగా జగన్ తో పోరు చేస్తునే ఉన్నారు. అందరికీ అమరావతి రాజధాని కావాలి. జగన్ మూడు రాజధానుల కధకు బ్రేకేసిన వారే ‌వీరంతా. ఇక పవన్ ఈ రోజు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. రేపు ఆయన బాబుతోనూ కలవవచ్చు. ఇలా నాగబాబు డైరెక్ట్ గా ఘాటుగా టీడీపీని విమర్శిస్తే అది పవన్ కి కూడా రాజకీయ ఇబ్బందే. ఇవన్నీ నాగబాబు వ్యక్తిగతం అని ఎంతలా పవన్ కొట్టిపారేస్తున్నా జరగాల్సిన రాజకీయ నష్టం ఓ వైపు జరిగిపోతోంది.

Tags:    

Similar News