నాదెండ్లే గుదిబండ ?

నాడు ఒక సినీ నటుడు ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల భాస్కర రావు కో పైలెట్ రూపంలో పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చివరికి పార్టీకి [more]

Update: 2021-05-12 14:30 GMT

నాడు ఒక సినీ నటుడు ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల భాస్కర రావు కో పైలెట్ రూపంలో పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చివరికి పార్టీకి వెన్నుపోటు పొడిచి పెద్ద దెబ్బే కొట్టేశారు. అలాగే జరుగుతుంది అని కాదు కానీ ఆయన కుమారుడు అయిన జూనియర్ నాదెండ్ల ఇపుడు జనసేనలో మొత్తం చక్రం తిప్పుతున్నారు. పైగా ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. మాకూ ఒక పార్టీ అని కాపులు ఉనికిని చాటుకునే విధంగా జనసేన ఉండాలనుకుంటున్నారు. ఇక జనసేన పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారిలో మెజారిటీ నాయకులు కాపులే. కానీ వారందరి గొంతూ ఎక్కడా వినిపించడంలేదు. ఒక్క నాదెండ్ల మనోహర్ మాత్రమే అన్నింటా వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు అన్న విమర్శలు అయితే పవన్ చెవి దాకా వచ్చాయట.

ఆ లేఖతో కదలిక ….

సీనియర్ రాజకీయ నేత. కాపు నాయకుడు మాదాసు గంగాధరం జనసేన విడిచి పోతూ పోతూ పవన్ కి రాసిన ఒక లేఖ పవన్ లో కదలిక తెచ్చిందని అంటున్నారు. పవన్ కి పార్టీలో ఏం జరుగుతుందో అన్నది కూడా అర్ధమవుతోంది అంటున్నారు. తాను సినిమాలో బిజీగా ఉంటూ సీనియర్ కదా అని నాదెండ్ల మనోహర్ కి పెద్ద పీట వేస్తే అదే చివరికి పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని కూడా పవన్ భావిస్తున్నారుట. మొత్తానికి నాదెండ్ల మనోహర్ కు, పార్టీ నాయకుల మధ్యన పెను అగాధమే ఏర్పడింది అన్నది పవన్ కూడా గ్రహించారు అంటున్నారు.

గ్యాప్ ని పూడ్చే పనిలో …..

ఇక పవన్ పార్టీ మీద దృష్టి పెడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ విషయంలో ఇప్పటికీ పవన్ కి మంచి అభిప్రాయమే ఉంది. అయితే పార్టీ నేతలు ఆయన విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అన్న దాని మీదనే ఆయన ఆలోచిస్తున్నారు అంటున్నారు. దాంతో పార్టీ ముఖ్యులు అందరితో కూర్చుని నాదెండ్ల మనోహర్ ప్రాబ్లంని త్వరలో సెటిల్ చేస్తారు అంటున్నారు. నాదెండ్ల వంటి సీనియర్ నేత పార్టీకి అండగా ఉండడం వల్ల కలిగే లాభాలను కూడా నేతలను పవన్ వివరిస్తారు అంటున్నారు. అదే సమయంలో పార్టీలో ఒకరి వల్ల మరొకరి అవకాశాలు ఎపుడూ తగ్గిపోవు అన్న మాట కూడా ఆయన చెప్పి నేతలకు భరోసా కలిగిస్తారుట.

కొత్త ముఖాలు ….

ఇక జనసేనను వచ్చే ఎన్నికల నాటికి సిధ్ధం చేయడానికి కూడా పవన్ తగిన కార్యాచరణను రెడీ చేస్తున్నారు అంటున్నారు. పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించడంతో పాటు నాదెండ్ల మనోహర్ తో పాటు పనిచేసే ఇతర నేతలకు కూడా కీలకమైన బాధ్యతలను అపగించాలని యోచిస్తున్నారుట. దాంతో జనసేన నుంచి కొత్త ముఖాలు కూడా ఇక పైన తమ గొంతు బలంగా వినిపించే చాన్స్ వస్తుంది అంటున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణల సమతూల్యత దెబ్బ తినకుండా కూడా పవన్ పార్టీలో కీలక చర్యలను తీసుకుంటారు అన్నది ప్రచారం అవుతోంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ పార్టీకి గుదిబండగా మారారు అని పోతున్న నేతలు బండ వేస్తూంటే ఆయన పార్టీకి అండా దండా అని పవన్ చెప్పబోతున్నారా అన్నదే జనసైనికుల మధ్య చర్చగా ఉందిట.

Tags:    

Similar News