తాళం తీసేవారే లేరే…?

కాంగ్రెస్ పార్టీ ఓ మహా సముద్రం. పిల్ల కాలువలు ఎండిపోవడం చూస్తారు కానీ సాగరం ఇంకిపోవడం అనేది జరగదు. కానీ అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇపుడు [more]

Update: 2019-07-26 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఓ మహా సముద్రం. పిల్ల కాలువలు ఎండిపోవడం చూస్తారు కానీ సాగరం ఇంకిపోవడం అనేది జరగదు. కానీ అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఆనవాళ్ళు కూడా లేకుందా ఉనికి కోల్పోయింది. విశాఖ కాంగ్రెస్ ని చూస్తూంటే విషాదమే అనిపిస్తుంది. ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది అన్న అలోచన వస్తుంది. నిత్యం వందలాది మంది కార్యకర్తలతో, నాయకులతో కళకళాడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనంలో ఇపుడు శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. అయిదేళ్ళ క్రితమే తొంబై శాతం పార్టీ నేతలు వెళ్ళిపోతే తాజా ఎన్నికల ముందూ తరువాత మిగిలిన వారు కూడా చల్లగా జారుకున్నారు. మహా విశాఖలో ఇపుడు కాంగ్రెస్ కి చెప్పుకుందామంటే పేరున్న ఓ నాయకుడు లేడు. అంతే కాదు, వార్డులో కనీసం జెండా మోసే కార్యకర్త కూడా కానరాడు. ఇదీ హస్తం పార్టీ తాజా జాతకం.

ద్రోణం రాజుతో సహా…

కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నా లేకున్నా దిగ్గజ రాజకీయ నేత ద్రోణం రాజు సత్యనారాయాణ వారసుడు శ్రీనివాస్ అండగా ఉండేవారు. ఆయన గత‌ అయిదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీని నడిపించారు. ప్రతీ రోజూ ఆఫీస్ కి వచ్చేవారు. ఆయనకంటూ కొంత క్యాడర్ ఉందేది. దాంతో పార్టీ కార్యాలయం ఉన్నట్లుగా కనిపించేది. ఇక తాజా ఎన్నికలకు ముందు ద్రోణం రాజు వైసీపీలో చేరిపోవడంతో ఆయనతో పాటే మిగిలిన అనుచరులు కూడా ఫ్యాన్ నీడకు చేరుకున్నారు. వార్డుల్లో అక్కడక్కడ మిగిలిన నేతలు కూడా ద్రోణం బాటను అనుసరించారు. ఇక ద్రోణం రాజు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవికి జగన్ సర్కార్ ఇవ్వడంతో కాంగ్రెస్ లో ఒక్కరు కూడా మిగలకుండా అయన పంచన చేరుకున్నారు. దాంతో కాంగ్రెస్ విశాఖ నగరంలో పూర్తిగా కనుమరుగైంది. ఈ రోజు పార్టీ ఆఫీస్ తాళం తీయడానికి కూడా కార్యకర్త లేడంటే ఎంతటి దుర్బర పరిస్థితి ఆ పార్టీని ఆవహించిందో అర్ధమవుతుంది.

ఆమె ఒక్కరే దిక్కు….

కాంగ్రెస్ పార్టీకి ఇంతటి మహా విశాఖలో ఒకే ఒక నాయకురాలు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె ఇటీవల ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన పేడాడ రమణికుమారి. ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురై డిపాజిట్లు పోయినా కూడా ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. నిజానికి ఆమె కూడా మొదటి నుంచి ఆ పార్టీలో ఉన్న నేత కాదు. ఆమె రాజకీయ ప్రస్తానం ప్రజారాజ్యంతో మొదలైంది. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయినపుడు ఆమె కూడా కాంగ్రెస్ లో అలా వచ్చి చేరారు. అలా చేరిన ఆమె ఇపుడు అదే పార్టీకి ఏకైక దిక్కుగా మారడం అంటే విషాదమే. అయితే క్యాడర్ లేని పార్టీని ఆమె సైతం ఎన్నాళ్ళు భరిస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. సరైన అవకాశం వస్తే ఆమె సైతం పార్టీని వీడుతారని అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కి విశాఖలో పెద్ద సున్నా పడిపోతుంది.

Tags:    

Similar News