ఆయన వన్ టైం ఎంపీగానే కనపడుతున్నాడు

రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రావు. వచ్చినా నిలబెట్టుకునే వారు కూడా తక్కువే. ప్రజాజీవితంలో ఉన్న వారు నిరంతరం కష్టపడాలి. గుర్తింపు ఒక్కోసారి దక్కదు, అయినా నిరాశ పడకుండా [more]

Update: 2020-04-11 14:30 GMT

రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రావు. వచ్చినా నిలబెట్టుకునే వారు కూడా తక్కువే. ప్రజాజీవితంలో ఉన్న వారు నిరంతరం కష్టపడాలి. గుర్తింపు ఒక్కోసారి దక్కదు, అయినా నిరాశ పడకుండా జనమే మనం అనుకుంటేనే దీర్ఘకాలికమైన రాజకీయ జీవితం ఉంటుంది. అలా కనుక ఆలోచిస్తే విశాఖ ఎంపీగా వైసీపీ తరఫున గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్ లక్కీ స్టార్ అని చెప్పాలి. ఆయన 2018 జూన్ నెలలో జగన్ ని గోదావరి జిల్లాల పాదయాత వేళ కలిశారు. అక్కడే పార్టీ కండువా కప్పేసుకున్నారు. నాడు విశాఖలో జగన్ పార్టీకి ఆర్ధికంగా బలమైన నేత లేకపోవడంతో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంవీవీ సత్యనారాయణను పార్టీలోకి తెచ్చారని చెబుతారు.

అలా అండగా …

ఆ విధంగా ఎంవీవీ సత్యనారాయణ పార్టీకి అండగా నిలిచారు. జగన్ విశాఖ జిల్లా పాదయాత్రను దగ్గరుండి విజయవంతం అయ్యేలా చూసుకున్నారు. దానికి బహుమానంగా ఆయనకు విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన సీటుని జగన్ అప్పగించారు. అయితే పార్టీలో కొత్త అయినా ఆర్ధికంగా బలవంతుడు, సామాజిక సమీకరణలు సరితూగడంతో ఎంవీవీ సత్యనారాయణకి ఎదురులేకుండా పోయింది. ఇక జగన్ కూడా ఎన్నో పేర్లు విశాఖ ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలించారని చెబుతారు. ఓ దశలో దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా విశాఖ ఎంపీ సీటు ఇస్తామని రాయబారం పంపారు. అది కుదరకపోవడం, ఎన్నికలు తోసుకురావంటో ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అభ్యర్ధి అయి కూర్చున్నారు.

ఏడాది కాక ముందే….

ఎంవీవీ సత్యనారాయణ ఎంతటి అదృష్టవంతుడంటే పార్టీలో చేరి ఏడాది కాకముందే ఎంపీ అయిపోయారు. ఆయన సైతం ఊహించని విధంగా విజయం వరించింది. ఇద్దరు బిగ్ షాట్స్ టీడీపీ నుంచి శ్రీ భరత్, జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఇద్దరి పేరు ప్రఖ్యాతుల ముందు, బ్యాక్ గ్రౌండ్ ముందు ఎంవీవీ సత్యనారాయణ ప్రచారంలో ఓ దశలో తేలిపోయారు. కానీ ఈ త్రిముఖ పోటీయే ఆయన్ని గండం నుంచి గట్టెక్కించింది. తక్కువ ఓట్లతోనైనా కూడా ఆయన గెలిచి విశాఖ ఎంపీ అయిపోయారు. ఆ విధంగా ఎంతో మంది సీనియర్లను కాదని పదవిని దక్కించుకున్నారు.

మైనస్ అవుతోందా…?

ఇక ఎంపీ అయ్యాక ఎంవీవీ సత్యనారాయణ పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయన పార్టీలో కూడా నాయకులను కలుపుకుని ముందుకు పోవడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. విశాఖ వంటి మెగా సిటీకి ఎంపీ, పైగా రేపో మాపో రాజధాని అవుతున్న సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంవీవీ సత్యనారాయణ రాజకీయంగా అధినాయకత్వం కోరుకున్న విధంగా సత్తా చాటలేకపోతున్నారని గట్టిగానే వినిపిస్తోంది. ఓడినా సరే శ్రీ భరత్ టీడీపీ నేతగా దూకుడు మీద ఉంటే ఎంపీ హోదాలో ఎంవీవీ తన పరిధిని తగ్గించుకుంటున్నారని అంటున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఎమ్మెల్యేలు, నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాల్సిన నేత బాగా తగ్గి ఉంటున్నారని చెబుతున్నారు.

గాడిన పడతారా…?

ఎంవీవీ సత్యనారాయణ ఎంత అనుకుంటే అంతలా స్వేచ్చ వైసీపీలో ఉంది. అయినా కూడా అన్ని విషయాల్లో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి వైపే పార్టీ చూస్తోంది. లోక్ సభ సభ్యునిగా ఎంవీవీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తే జీవీఎంసీ లాంటి ఎన్నికలను సునాయాసంగా గెలుచుకునే వీలు ఉంటుంది. అలాగే పార్టీ ఓడిన సిటీలో కూడా బాగా బలం పెరుగుతుంది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఒకరిద్దరు నాయకులను మాత్రమే చేరదీస్తూ తానే వర్గ రాజకీయాల్లో చిక్కుకున్నారని అంటున్నారు. పార్టీ బలపడేందుకు ఎంతో స్కోప్ ఉన్నా కూడా తన నాయకత్వ పటిమ చూపడంలేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాగైతే ఆయన వన్ టైం ఎంపీగానే మిగిలిపోతారని వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి, మరో నాలుగేళ్ళ అధికారం చేతిలో ఉంది. రేపటి రోజునైనా ఎంపీ గా సత్తా చాటుతారేమో.

Tags:    

Similar News