ఇంకా ఎంతమందిని….??

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు తాము అనుకున్నది అనుకున్నట్లుగానే అమలుపరుస్తున్నారు. భవిష్యత్తులో పార్టీలోనూ, నాయకత్వంలోనూ ఎటువంటి సమస్యలు లేకుండా ముందు [more]

Update: 2019-03-27 18:29 GMT

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు తాము అనుకున్నది అనుకున్నట్లుగానే అమలుపరుస్తున్నారు. భవిష్యత్తులో పార్టీలోనూ, నాయకత్వంలోనూ ఎటువంటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్లుంది. బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇప్పటికే టిక్కెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన పోటీ చేసే గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మురళీమనోహర్ జోషీ కూడా చేరారు. సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి కాన్పూరు లోక్ సభ టిక్కెట్ దక్కలేదు.

వయసు బూచి చూపి…..

బీజేపీలో సీనియర్ నేతలందరినీ పక్కనపెడుతున్నారు. ఇందుకోసం 75 ఏళ్ల వయసును బూచిగా చూపుతున్నారు. కర్ణాటకలోని యడ్యూరప్ప లాంటి వారికి మినహాయింపులు ఇచ్చినా పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారికి మాత్రం మోదీ, అమిత్ షా లు హ్యాండ్ ఇస్తున్నారు. కాన్పూరు నుంచి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడిగా మురళీ మనోహర్ జోషి ఉన్నారు. చివరి నిమిషం వరకూ కాన్పూరు టిక్కెట్ ను ప్రకటించలేదు. జోషికి అయినా టిక్కెట్ దక్కుతుందని భావించారు. జోషికి 85 ఏళ్లు కావడంతో ఆయనను కూడా పక్కనపెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మృదు స్వభావి…..

మురళీ మనోహర్ జోషి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి జీవితాన్ని ప్రారంభించారు. 1977లో ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ఎన్నియ్యారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో జోషీ కూడా ఒకరు. అలహాబాద్ నుంచి మూడుసార్లు విజయం సాధించిన జోషి వాజ్ పేయి మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన మృదుస్వభావి. బీజేపీని దేశ వ్యాప్తంగా బలోపేతం చేయడంలో జోషి పాత్రను కూడా మరువలేం. అలాంటి జోషికి కాన్పూర్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై పార్టీ క్యాడర్ లోనూ అసంతృప్తి నెలకొంది. ఇది ఖచ్చితంగా పెద్దలను పక్కనపెట్టడంలో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.

మోదీ కోసం త్యాగం చేసి….

2009లో వారణాసి నుంచి పోటీ చేసి మురళీ మనోహర్ జోషి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన హుందాగా మోదీ కోసం తప్పుకున్నారు. వారణాసి నియోజకవర్గాన్ని మోదీకి ఇచ్చి తాను కాన్పూరు బరిలో నిలిచి గెలుపొందారు. తనకు టిక్కెట్ రాలేదని తెలియగానే జోషి కాన్పూరు ప్రజలకు లేఖ రాశారు. తాను ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. మొత్తం మీద మురళీ మనోహర్ జోషి శకం కూడా బీజేపీలో ముగిసిందనే చెప్పాలి. తమ కళ్ల ఎదుటే తమ రాజకీయ జీవితాలకు ఎదుటి వారు ఫుల్ స్టాప్ పెడుతుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప ఈ సీనియర్ నేతలు చేయగలిగిందేమీ లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పార్టీ మాత్రం టిక్కెట్ నిరాకరించినందుకు సమర్థించుకుంటోంది.

Tags:    

Similar News