కండువా రెడీ… ముద్రగడ కూడా?

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశం ఉంది. అందుకే ముద్రగడ పద్మనాభం కాపు [more]

Update: 2020-08-02 13:30 GMT

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఆయన త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశం ఉంది. అందుకే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి తప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ ల ఉద్యమాన్ని తిరిగి చేపట్టాలని ముద్రగడ పద్మనాభంపై గత కొంత కాలంగా వత్తిడి తెస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. ఆయన మళ్లీ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నారు.

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా…..

ముద్రగడ పద్మనాభం గత కొంత కాలంగా ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రధానంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై నే దృష్టిపెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ఎన్నో వత్తిడులకు లోనయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన కారణంగా అనేక మంది అక్రమ అరెస్ట్ లకు లోనయ్యారని ఆయన మదనపడుతున్నారు.

మంచి ఆఫర్ ఇవ్వడంతో…..

ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభంకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులందరినీ ఐక్యం చేయడం కోసం ముద్రగడ పద్మనాభం సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందుకోసమే అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. మరోవైపు జనసేనతో పొత్తు ఎలాగూ ఉండనే ఉంది.

త్వరలోనే కాషాయ కండువా….

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభంలు కలిస్తే కాపుల్లో ఐక్యత వస్తుందని, బీజేపీ తమ పార్టీగా భావిస్తారన్నది బీజేపీ వ్యూహం. అందుకోసమే ముద్రగడ పద్మనాభంను బీజేపీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం బాగా విన్పిస్తుంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ ఓటు బ్యాంకు కు గండి కొట్టడానికే ముద్రగడ పద్మనాభం సేవలను వినియోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. సో… త్వరలోనే ముద్రగడ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News