అర్థం కావడం లేదా..?

గత ఎన్నికల ముందు వరకు కాపు రిజర్వేషన్ల అంశమే ఆయన జెండా అజెండా. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంపై తన పోరాటం [more]

Update: 2019-08-22 00:30 GMT

గత ఎన్నికల ముందు వరకు కాపు రిజర్వేషన్ల అంశమే ఆయన జెండా అజెండా. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంపై తన పోరాటం ఎవరిపైన చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఏ పార్టీ గొడుగు కిందకు ముద్రగడ చేరనున్నారు అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల ముందు టిడిపి పరిష్కారం చూపించింది. కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ప్రకటించి మీ పని పూర్తి చేసేశామని జివో ఇచ్చి అయిపోయిందని తేల్చింది తెలుగుదేశం. ఇది చట్టబద్ధం కాదని నాడే వైసిపి ఆరోపించింది. కాపుల రిజర్వేషన్లు తమ చేతుల్లో లేవంటూ ఎన్నికలకు ముందే చెప్పేసింది.

అయినా వైసిపి కే జనం మద్దతు …

కాపు రిజర్వేషన్ల పై వైసిపి అధినేత జగన్ చేసిన ప్రకటన ఆ పార్టీ కొంప ముంచుతుందని అంతా భావించారు. అయితే ఈ అంశానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వని మెజారిటీ ఓటర్లు అఖండ మెజారిటీ తో వైసిపి కి జై కొట్టేశారు. దాంతో ముద్రగడ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఎదురైంది. ఇక టిడిపి ఇచ్చిన అగ్రవర్ణ రిజర్వేషన్ లలో కోటా తొలగించేసింది వైసిపి సర్కార్. ఈ అంశంపై కూడా ముద్రగడ ప్రభుత్వానికి లేఖ రాయడం తప్ప మరేమీ చేయలేకపోయారు. మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ ప్రశ్నించి మౌనం వహించారు ఆయన. దీనిపై వైసిపి సర్కార్ మంత్రులు తో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి కాపు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. అలా జగన్ తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడటంతో బాటు ఈ అంశం కేంద్రం పరిధిలోనిదంటూ జనంలోకి బలంగా తీసుకువెళ్లడంతో ముద్రగడ టార్గెట్ ఇప్పుడు బిజెపి సర్కార్ అయ్యింది.

కేంద్రంపై కూడా సుతిమెత్తగానే ….

కాపు రిజర్వేషన్ల పై గతంలో తీవ్రస్థాయిలో పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఏ ఉద్యమం చేసినా కేంద్రం పై చేయాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ శక్తివంతంగా వున్నారు. ఎవర్ని లెక్కచేసే పరిస్థితి కానీ మెజారిటీ కోసం ఒకరిపై ఆధారపడి స్థితి లేనేలేదు. దాంతో ముద్రగడ విజ్ఞప్తులు చేయగలరు కానీ డిమాండ్ చేసే స్థాయిలో లేరు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల అంశం నెమ్మదిగా అటక ఎక్కే వాతావరణమే కనిపిస్తుంది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి వస్తుంది.

బిజెపి లోకి ముద్రగడ ….?

ఎన్నికల ఫలితాల తరువాత కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా వున్న ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీ కండువా కప్పాలని కమలం తహతహ లాడుతుంది. ఇప్పటికే కొందరు ప్రముఖులు ముద్రగడతో ఆయన నివాసానికి వెళ్ళి చర్చలు సాగించారు. ఎన్నికలకు ముందు సొంత సామాజికవర్గం నుంచి వత్తిడి రావడంతో జనసేనకు మద్దతు పలికి ముద్రగడ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన ముందు రెండు అవకాశాలు తెరిచివున్నాయి. ఒకటి రాష్ట్రం లోని అధికార వైసిపి లో చేరడం, రెండు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి సర్కార్ లో చేరడం. ఈ రెండు పార్టీలలో కమలం వైపే ఆయన దృష్టి ఉందని సన్నిహితుల అంచనా. కేంద్రం కాపు రిజర్వేషన్లా పై క్లారిటీ ఇస్తే ఆ హామీతో పద్మనాభం కాషాయ కండువా కప్పుకుంటారని లేనిపక్షం లో కాపులను బిసిల్లో చేర్చాలనే ఉద్యమ నేతగానే మిగిలిపోతారని టాక్. మరి పొలిటికల్ జంక్షన్ లో వున్న ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News