విశాఖ స్టీల్..ఎవరికీ పట్టని రోదన ?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఓ వైపు వేగంగా పావులు కదులుతున్నాయి. మరో వైపు చూస్తే నిన్నటిదాకా వేడిగా వాడిగా కనిపించిన విశాఖ వాతావరణం ఇపుడు పూర్తిగా [more]

Update: 2021-04-01 11:00 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఓ వైపు వేగంగా పావులు కదులుతున్నాయి. మరో వైపు చూస్తే నిన్నటిదాకా వేడిగా వాడిగా కనిపించిన విశాఖ వాతావరణం ఇపుడు పూర్తిగా మారిపోయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వినిపించిన ఉక్కు అనుకూల నినాదాలు ఆ ఎన్నికలు ముగియడంతో పూర్తిగా చప్పబడిపోయాయి. ఉక్కు సెగ పుణ్యమాని కొన్ని రాజకీయ పార్టీలు విశాఖ కార్పొరేషన్ లో అడుగుపెట్టేశాయి.

గొంతు చించుకున్నారుగా…?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పాటే తోసుకొచ్చింది. దాంతో రెండు నెలల పాటు విశాఖను ఉక్కు ఉద్యమం ఒక్క లెక్కన ఊపేసింది. దీనితో రాజకీయ పార్టీలు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. దాంతో స్థానికంగా ఉన్న బీజేపీ సహా అన్ని పార్టీలు ప్రైవేటీకరణను అడ్డుకుతీరుతామని గట్టిగానే శపధం చేశాయి. తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అయితే అమరణ దీక్షకు కూర్చున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఏకంగా విశాఖ సిటీలో పాతిక కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఉక్కుని కాపాడుకుని తీరుతామని కూడా భీషణ ప్రతిన చేశారు. ఇక చంద్రబాబు, లోకేష్ బాబు సంగతి సరేసరి. ఉక్కు ప్రైవేటీకరణనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల వేళ తమ అజెండాగా చేసుకున్నారు.

ఫుల్ సైలెంట్…

కార్పొరేషన్ ఎన్నికల తరువాత విశాఖలో రాజకీయ పార్టీలు ఫుల్ సైలెంట్ అయ్యాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. తాము ఎంత అరచి గీ పెట్టినా పారిశ్రామికవాడ తప్ప విశాఖ నగర ప్రజానీకం ఉక్కు ఆందోళనకు మద్దతుగా తమను గెలిపించలేదని తెలుగుదేశం మదనపడుతోంది. తాము అనుకున్నట్లుగా 75 సీట్ల టార్గెట్ ని రీచ్ కాకపోవడానికి గాజువాక పరిసరాలలో ఉక్కు కార్మికులు యాంటీగా ఓటు చేయడమే కారణమని వైసీపీ విశ్లేషించుంటోంది. మరో వైపు బీజేపీ తమకు కనీసం నాలుగైదు సీట్లు రావాల్సిన చోట ఉక్కు ఉద్యమం వచ్చి గండి కొట్టిందని తెగ చింతిస్తోంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలూ కూడా తమ లాభనష్టాలను బేరీజు వేసుకుని మరీ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాయి.

పట్టించుకోరా …?

ఇపుడు ఉక్కు కార్మికులు తమకు తాముగానే ఆందోళన‌ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాలంటే విశాఖలోని పాతిక లక్ష మంది జనాభా ఉంటే అందులో యాభై వేల మంది దాకానే ఈ ఉద్యమం పరిమితం అయింది. ఇపుడు వారికి కూడా నీరసం వస్తోంది. మొత్తం మీద చూస్తే ఉక్కు ప్రైవేటీకరణని విశాఖ వాసులు సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా అన్న డౌట్ కూడా ఉంది. దానితో సంబంధం లేకుండా సిటీలో బీజేపీకి కూడా ఒక చోట గెలిపించారు అంటేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పట్ల జనాలకు ఆసక్తి లేదని అర్ధమవుతోంది. అందుకే కేంద్రం దూకుడుగా పావులు కదుపుతున్నా రాజకీయ పార్టీలు కూడా జనాల మూడ్ ని బట్టి సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. మొత్తానికి ఉక్కు కార్మికులు ఈ రాజకీయ లెక్కలు తెలియక నాడు గొంతెత్తి అరిచారు. ఇపుడు ఒంటరి పోరాటమే చేస్తున్నారు.

Tags:    

Similar News