అమెరికన్లకు అదే గుర్తొస్తుంది…అందుకే భయమేస్తుంది

వియత్నాంతో జరిగిన యుద్ధంలోనూ ఇంతమంది సైనికులు మరణించలేదు. . . కరోనా మరణ మృదంగం నేపథ్యంలో ఓ అమెరికన్ పౌరుడి ఆవేదన ఇది. అమెరికా ఎదుర్కొంటున్న దయనీయ [more]

Update: 2020-05-21 16:30 GMT

వియత్నాంతో జరిగిన యుద్ధంలోనూ ఇంతమంది సైనికులు మరణించలేదు. . . కరోనా మరణ మృదంగం నేపథ్యంలో ఓ అమెరికన్ పౌరుడి ఆవేదన ఇది. అమెరికా ఎదుర్కొంటున్న దయనీయ పరిస్ధితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. యావత్ ప్రపంచంతోపాటు అగ్రరాజ్యమైన అమెరికా కరోనాతో అతలాకుతలం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నమెాదవుతున్న కేసులు, మరణాల్లోనూ అమెరికాదే మెుదటిస్ధానం. ఈ నెల 10 నాటికి అమెరికాలో 13,53,534 కేసులు నమెాదుకాగా 80,351 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 41,52,878 కేసులు నమెాదుకాగా అమెరికా లో 13 లక్షలకు పైగా నమెాదవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 2,82,663 మంది మరణించగా అమెరికాలో ఆసం‌ఖ్య 80,351 కి చేరుకోవడం కరోనా తీవ్రతకు నిదర్శనం. ఈ పరిస్ధితి అమెరికన్ పౌరులను ఆందోళన పరుస్తుండగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు కనీసం చీమకుట్టినట్లయినా లేదు. లేకపోగా లాక్ డౌన్ ప్రశ్నేలేదని, మరణాలు లక్షలు దాటవచ్చని సెలవిస్తున్నారు. అధ్యక్షుడి వైఖరి సగటు అమెరికన్ కు ఆందోళనకు గురిచేస్తోంది. నాటి వియత్నాం యుద్ధంలో భంగపాటు ఎదురైనట్లే ఇపుడు కరోనాపై సమరంలోనుా చతికిలపడే ప్రమాదం ఉందన్న వాదన వినపడుతోంది. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

వియత్నాం యుద్ధం అంటే ఏంటి?

ఇంతకీ వియత్నాం యుద్ధం అంటే ఏమిటి? ఆసియా ఖండంలోని ఈ బుల్లిదేశానికి అగ్రరాజ్యానికి వైరం ఏమిటి? ఇంత పెద్దదేశం యుద్ధంలో చేదు అనుభవం ఎదుర్కొవడానికి కారణమేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. నిజానికి ఒకట్రెండు తరాలకు ఈ యుద్ధం గురించి తెలిపే అవకాశం లేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు 1955 నవంబరు ఒకటి నుంచి 1975 ఏప్రిల్ 30 వరకు జరిగిన అమెరికా వియత్నాం యుద్ధం అంతర్జాతీయ చరిత్ర లో ఆసక్తికరమైన ఘట్టం. అప్పట్లో వియత్నాం ఉత్తర, దక్షిణ వియత్నాం లుగా చీలిపోయి ఉంది. ఈ రెండు దేశాల మద్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. నిత్య కలహాలు ఉండేవి. ఈ పరిస్ధితుల్లో ఉత్తర వియత్నాం . . . దక్షిణ వియత్నాంను ఆక్రమించింది. ఇది చిలికి చిలికి అమెరికా – సోవియట్ యుానియన్ (ప్రస్తుత రష్యా) గా మారింది. వామపక్ష భావజాలం గల సోవియట్, చైనాలు ఉత్తర వియత్నాం, అమెరికా, బ్రిటన్, గ్రీస్ తదితర పాశ్చాత్య దేశాలు దక్షిణ వియత్నాం వైపు నిలబడ్డాయి.

ఇరవై ఏళ్ల పాటు…

దక్షిణ వియత్నం నుంచి ఉత్తర వియత్నాంను వెళ్ళగొట్టేందుకు రంగంలోకి దిగిన అమెరికా 19 సంవత్సరాల అయిదునెలలకు పైగా యుద్ధం చేసింది. తన శక్తినంతా వెచ్చించింది. మనదేశంలోని కేరళ అంతగల ఉత్తర వియత్నాం పై బాంబుల వర్షం కురిపించింది. సైనికులను కదం తొక్కించింది. రష్యా, చైనా మద్దతుగల ఉత్తర వియత్నాం వీటిని సమర్ధంగా తిప్పికొట్టింది. దాదాపు 20 సంత్సరాల పాటు పోరాడింది. చివరకి శక్తివంతమైన అమెరికాను వెనక్కినెట్టింది. దక్షిణ వియత్నాంలోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసింది. దీంతో గత్యంతరం లేక అందులోని సిబ్బందిని హెలికాఫ్టర్ల సాయంతో అమెరికా కాపాడుకుంది. కార్యాలయంలోని సిబ్బందిపై అంతస్తులోకి వచ్చి తాళ్ళద్వారా హెలికఫ్టర్ ఎక్కి పారిపోయారు. ఇది అమెరికాకు అత్యంత అవమానకరమైన విషయం.

అప్పట్లో 58 వేల మంది…

నాటి యుద్ధంలో 58 వేల మందికి పైగా అమెరికా సైనికులు హతులయ్యారు. ఇది అవమానకరమైన ఓటమి. ఆసియా ఖండంలోని ఓ చిన్నదేశంతో జరిగిన యుద్ధంలో అగ్రరాజ్యం ఓటమిపాలైంది. ఇపుడు కరోనాపై పోరులోనూ అధ్యక్షుడు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం నష్టపోతుందన్నది సగటు అమెరికన్ల ఆందోళన. రోజుకు వేలసంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండగా, వందల మరణాలు నమెాదవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కొలువైన అంతర్జాతీయ నగరం న్యూయార్క్ కరోనా మరణాలతో కుదేలవుతోంది. నిద్రలేని నగరంగా పేరొందిన న్యూయార్క్ కనీసం శవాలను ఖననం చేసే పరిస్ధితి కుాడా లేదు. ఎంతకాదనుకున్నప్పటికీ వాషింగ్టన్ కు ఇది కష్టకాలమే! మున్ముందుపరిస్ధితి ఎటుదారితీస్తుందన్నది సగటు అమెరికన్ ఆందోళన.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News