మొహమాటమా? ముఖం చూపలేకా?

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మౌనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఓటమి పాలయినప్పటి నుంచి పార్టీ కార్యాలయానికి [more]

Update: 2019-09-09 15:30 GMT

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మౌనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఓటమి పాలయినప్పటి నుంచి పార్టీ కార్యాలయానికి కూడా రావడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా తాడేపల్లిలోనే ఉంటున్నప్పటికీ ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే తనకు జగన్ పిలిచి పదవి ఇస్తారని ఆయన ఆశించారు. కానీ మూడు నెలలు గడుస్తున్నా అటువంటిది ఏమీ జరగకపోవడంతో మోదుగుల మౌనంగా ఉంటున్నారట.

టీడీపీలోనూ….

మోదుగల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు. నరసనరావు పేట ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో రాయపాటి కోసం మోదుగులను చంద్రబాబు పక్కన పెట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచిపోటీ చేయాలని ఆదేశించినా కిమ్మన లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మోదుగుల చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కుతుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై నేరుగా విమర్శలు చేసేవారు.

వైసీపీలో చేరినా….

ఇక 2019 ఎన్నికలకు ముందు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే జగన్ ఆయనకు గుంటూరు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చారు. తాను గల్లా జయదేవ్ పై గెలిచి తీరుతానని మోదుగుల గట్టిగానమ్మారు. అయితే ఎన్నికల సమయంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుసరించిన తీరు జగన్ కు ఆగ్రహం తెప్పించిందంటారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు నిధులు ఇవ్వలేదని మోదుగులపై పార్టీ నేతలే గతంలో ఆరోపించారు. పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిలుపుకోలేకపోయారని జగన్ సయితం అభిప్రాయపడ్డారని వినికిడి.

అందుకే మౌనంగా….

అందుకే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మొహం చెల్లక వైసీపీలో యాక్టివ్ గా ఉండటం లేదన్నది విన్పిస్తున్న టాక్. పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం, 22 మంది ఎంపీలు గెలిచినా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం తాడేపల్లి వచ్చేందుకు మొహమాటపడుతున్నారట. దీనిపై జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. మొత్తం మీద మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి తెలుగుదేశం లో ఉన్న పరిస్థితులే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎదురవు తున్నా యన్నది సుస్పష్టం. మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వచ్చి అందరూ సంబరాలు చేసుకుంటున్నా మోదుగుల మాత్రం మౌనంగా ఉంటుండటంపైనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News