బలపడాలని..బలహీనపర్చాలని

ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ఎర్రకోట సాక్షిగా ఎత్తుకున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది మోదీ ఆలోచన. ఈ ఆలోచన కొత్తదేమీ [more]

Update: 2019-08-17 17:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ఎర్రకోట సాక్షిగా ఎత్తుకున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది మోదీ ఆలోచన. ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికల విషయాన్ని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. మోదీ తొలిసారి 2014లో ప్రధానిగా ఎన్నికయిన దగ్గరనుంచే ఈ జమిలీ ఎన్నికలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ మొన్నటి వరకూ కుదరలేదు. ఇప్పుడు రెండు సభల్లో బలం పెంచుకున్న బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను నిజం చేయాలని భావిస్తుంది. అంతా సక్రమంగా జరిగితే 2021లో దేశమంతా ఎన్నికలు జరిగే అవకాశముందన్నది అంచనా.

క్లీన్ స్వీప్ చేసేందుకు…..

అవును తరచూ ఎన్నికలతో ప్రభుత్వ నిధులు ఖర్చవ్వడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది. ఎన్నికల నిబంధన అమల్లోకి వస్తుండటంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని వాజ్ పేయి, అద్వానీ వంటి వారే ఆనాడు గళమెత్తారు. ఒకేసారి ఎన్నికలు పెట్టి క్లీన్ స్వీప్ చేయాలన్నది కమలనాధుల ఆలోచన. అయితే మోదీ ప్రతిపాదనకు ఇతర రాష్ట్రాలు కలసి వస్తాయా? అన్నది చూడాలి.

ఏపీ వంటి రాష్ట్రాలకు….

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు 2019లోనే ఎన్నికలు జరిగాయి. 2021లో ఎన్నికలు జరిగితే అక్కడ అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బందులు తప్పవు. తాము అమలు చేయాలనుకున్న పథకాలు ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఇంకా ఒక అభిప్రాయం ఏర్పడక పోవచ్చు. ఇలాంటి రాష్ట్రాలు జమిలీ ఎన్నికలతో కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికల కారణంగా నష్టపోయే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఇదే సరైన సమయం….

2021లో ఎన్నికల నాటికి మోదీ పూర్తిగా బలపడతారు. కాశ్మీర్ విభజన అంశంలో మోదీకి దేశమంతా పాజిటివ్ వేవ్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. రాజ్యాంగ సవరణ చేసి ఒకేసారి దేశమంతా ఎన్నికలు జరపాలన్నది మోదీ ఉద్దేశ్యం. 2021 నాటికి రాజ్యసభలో బీజేపీ పూర్తి బలంతో ఉంటుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు 2021లోనే ఎన్నికలు జరుగుతాయి. అలాగే తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల గడువును మరో మూడేళ్లు పొడిగించవచ్చు. ఇలా జమిలీ ఎన్నికలకు వెళ్లాలని, అదీ 2021అయితే బాగుంటుందన్నది మోదీ ఆలోచన. మరి మోదీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News