అనుకున్నది సాధించేస్తారా?

కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 370, 35ఏ అధికరణల రద్దుపై దేశవ్యాప్తంగా విస్రృత చర్చజరిగింది. తొలుత ఈ విషయమై విభిన్న [more]

Update: 2019-09-21 16:30 GMT

కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 370, 35ఏ అధికరణల రద్దుపై దేశవ్యాప్తంగా విస్రృత చర్చజరిగింది. తొలుత ఈ విషయమై విభిన్న వాదనలు వినిపించాయి. క్రమ క్రమంగా తీవ్రత తగ్గింది. డీ.ఎం.కే, కశ్మీర్ కు చెందిన పార్టీలు మినహా దాదాపు అన్ని పార్టీలు కశ్మీర్ విషయంలో ప్రభుత్వ వైఖరిని సమర్థించాయి. తొలుత నాలుక మడత తప్పిన కాంగ్రెస్ కూడా తన వైఖరి మార్చుకుంది. కశ్మీర్ దైపాక్షిక అంశమని ప్రకటించి అందర్ని ఆశ్చర్య పరిచిన ఆ పార్టీ లోక్ సభా పక్షనేత అదీర్ రంజాన్ చౌదరి తరువాత మారారు. ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన అధికరణల రద్దును వ్యతిరేకించలేదని ఈ విషయంలో ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరించి తీరునే తప్పుపట్టామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం కాశ్మీర్ లోయ
పూర్తిగా భద్రతా బలగాల నీడలో ఉంది. ఉద్రిక్తతలు తగ్గనప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉంది.

ముగిసిన అథ్యాయమంటూ….

కశ్మీర్ కు సంబంధించి ముగిసిన అధ్యాయమని భారత ప్రభుత్వం, ప్రజలు భావిస్తున్నారు. ఇక దృష్టి పెట్టాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) పైనే అని అందరూ అంటున్నారు. అటు ప్రభుత్వం, పార్టీలు, ప్రజలు ఇదే భావనలో ఉన్నారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని గతంలోనే పార్లమెంట్ తీర్మానం చేసింది. దానిని ఎప్పటికైనా స్వాధీనం చేసుకుని తీరుతామని భారత్ విధాన నిర్ణేతలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా స్వాధీనం చేసుకుని తీరాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్ మరింత అధికంగా వినిపిస్తుంది. కశ్మీర్ పై పాక్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, చర్చలు అంటూ జరిగితే పీఓకే పైనే అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టంగా ప్రకటించారు. పీఓకే ను స్వాధీనం చేసుకోగలమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీది ఇదే భావన. అన్ని పార్టీలు ఇదే వాదనను వినిపిస్తుడటం విశేషం. ఈ నేపథ్యంలో పీఓకే అంటే ఏమిటి, దాని చరిత్ర, పూర్వపరాల గురించి దేశవ్యాప్తంగా విస్రృత చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకోవాలంటే కొంత చరిత్రలోకి వెళ్లడం తప్పనిసరి అవుతుంది.

పీఓకే అంటే…..

1947లో దేశ విభజన సమయంలో మహారాజా హరిసింగ్ ఆధ్వర్యంలో కశ్మీర్ సంస్థానం తటస్థంగా ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్ మహారాజా హరిసింగ్ కుమారుడు. కశ్మీర్ సంస్థానానిది ప్రత్యేక చరిత్ర. ఇక్కడ మెజారిటీ ప్రజలు యువకులు పాలకుడు హరిసింగ్ మహారాజ్ హిందువు కావడం విశేషం. దేశ విభజన సమయంలో ఇటు భారత్ లో ఉండాలా, లేక పాక్ లో విలీనం అవ్వాలా అనే విషయమై మహారాజా హరిసింగ్ తేల్చుకోలేకపోయారు. మెజారిటీ ప్రజలు ముస్లింలు అయినందున తమలో కలవాలని పాక్ పట్టుబట్టింది. రాజు హిందువు అయినందున భారత్ లో కలవాలన్న అభిప్రాయం ఉంది. ఏ విషయమూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు హరిసింగ్. ఇదే అదనుగా పాక్ దాడికి దిగింది. దీంతో దిక్కుతోచని
హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని శరణువేడారు. భారత సైనికులు వెంటనే రంగప్రవేశం చేసి పాక్ సైన్యాన్ని అడ్డుకున్నారు. అప్పటికే పాక్ సైనికులు కొంత భాగాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) అని భారత్ పిలుస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం దాన్ని ఆజాదీ కశ్మీర్ అని వ్యవహరిస్తోంది. ఆజాదీ అంటే స్వేచ్ఛ అని అర్థం. అంటే స్వేచ్ఛ పొందిన కశ్మీర్ అన్నది పాక్ అభిప్రాయం. కానీ భారత్ ఆధీనంలోని కశ్మీర్ కు గల స్వేఛ్చలో పదో వంతుకూడా పీఓకే ప్రజలు పొందలేక పోతున్నారు. ఇది చేదు నిజం.

రెండు దేశాల దృష్టి…..

భారత దృష్టింతా పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK), లేదా పాక్ దృష్టిలోని ఆజాదీ కశ్మీర్ రాజధాని నగరం ముజఫరా బాద్, పాకిస్తాన్ లోని పంజాబ్, భైబర్ ఫక్తూన్ కానా పీఓకే సరిహద్దులు. పీఓకే భారత్ ఆధీనంలోని జమ్ము కశ్మీర్ ను నియంత్రణ రేఖ విడదీస్తుంది. దీనిని LOC (లైన్ ఆఫ్ కంట్రోల్) అని వ్యవహరిస్తారు. 2017 లెక్కల ప్రకారం దీని జనాభా 4,045,366. 13,297 చదరపు వేల మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రధాని, అధ్యక్షుడు, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు , సుప్రీంకోర్టు ఉన్నాయి. అయినప్పటికీ పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. ఆ దేశానికి చెందిన జమ్ముకశ్మీర్ వ్యవహారాల మంత్రి దీని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అయితే పాక్ పార్లమెంట్ లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. పర్యాటకం, సేవారంగం విదేశాల్లో స్థిరపడ్డ ఈ ప్రాంత ప్రజలు పంపే డబ్బు ప్రధాన ఆధారం. 72శాతం అక్షరాస్యత ఉంది. ఉర్ధూ ప్రధాన భాష. 8 జిల్లాలు, 19 తహసీళ్లు, 182 ఫెడరల్ కౌన్సిల్స్ ఉన్నాయి. మీర్ పుర్, భీంబర్, కోట్లి, భాగ్, ముజఫరాబాద్, నీలం, రావల్ కోట్ ప్రధాన పట్టణాలు. కశ్మీర్ పై భారత్ నిర్ణయం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్ముకశ్మీర్ ను పక్కన పెడితే అసలు పీఓకే ను కాపాడుకునే సత్తా పాక్ కు ఉందా అన్న విమర్శలను ప్రతి పక్షాలు ఎక్కు పెడుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు పీఓకే అటు పాక్, ఇటు భారత్ లోఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News