ఆ మంత్రులు మ‌ళ్లీ ఎమ్మెల్యేల‌వ‌లేదు… మ‌ంత్రి చెప్పిన సీక్రెట్ ఇదే

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఎవ‌రు ఎప్పుడు గెలుస్తారో? ఏ రీజ‌న్‌తో గెలుస్తారో కూడా చెప్ప‌లేం. అదే స‌మయంలో ఓడినంత మాత్రాన వారు చేయ‌లేర‌ని, రాజ‌కీయాల‌కు వ్య‌ర్థ‌మ‌ని [more]

Update: 2019-06-29 16:30 GMT

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఎవ‌రు ఎప్పుడు గెలుస్తారో? ఏ రీజ‌న్‌తో గెలుస్తారో కూడా చెప్ప‌లేం. అదే స‌మయంలో ఓడినంత మాత్రాన వారు చేయ‌లేర‌ని, రాజ‌కీయాల‌కు వ్య‌ర్థ‌మ‌ని కూడా అర్ధం కాదు. ఇలాంటి అంశం ఎప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంటుంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు గెలుపు ఒక‌రి ప‌క్షానే ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో గెలుపు ఓట‌మ‌లు స‌హ‌జ‌మ‌ని భావించిన‌ప్ప‌టికీ.. కొంద‌రి విష‌యంలో మాత్రం విచిత్రంగా ఉంటుంది. అలాంటి విష‌యాన్నే ఇప్పుడు గుడివాడ‌కు చెందిన ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని వెల్ల‌డించారు.

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో అనేక మంది ఉద్ధండులు ఉన్నారు. అనేక మంది ప‌లు పార్టీల ప్ర‌భుత్వాల్లో మంత్రులు కూడా అయ్యారు. ఇలా గ‌డిచిన 40 ఏళ్ల చ‌రిత్ర‌లో కృష్ణాజిల్లా పాత్ర అమోఘం. అయితే, ఇలా ఈ జిల్లా నుంచి మంత్రులుగా అయిన వారు.. త‌ర్వాత కాలంలో గెలిచిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఒక‌రిద్ద‌రు మిన‌హా ఎవ‌రూ కూడా మంత్రులుగా చేసిన వారు త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో గెలిచిన దాఖ‌లాలు లేవు. ఇప్పుడు జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి మ‌న‌కు క‌నిపించింది. కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా చంద్ర‌బాబు కేబినెట్‌లో ఇద్ద‌రు ఉన్నారు. ఒక‌రు దేవినేని ఉమా, రెండోవారు మ‌చిలీప‌ట్నం నుంచి 2014లో విజ‌యం సాదించిన కొల్లు ర‌వీంద్ర‌. వీరిద్ద‌రూ కూడా తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేక పోయారు.

తాజ‌గా ఇదే విష‌యంపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. ‘గత 35 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా పనిచేసినవారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేదు. అసలు మంత్రిగా అయితే ఎందుకు ఓడిపోతారు అని అనుకునేవాడిని. కానీ గత 15-20 రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతుంటే నాకు తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు సొంత పనులు, నియోజకవర్గ పనులు ఉంటాయ‌న్నాయ‌ని… అయితే, మంత్రిగా ఏదైనా పనిచేయడానికి నేను బయటకు అడుగుపెడితే చాలు.. పక్క ఊరు , పక్క జిల్లాల నుంచి జనం వచ్చి నన్ను పీక్కు తినేస్తున్నారు. అసలు మన సొంత పనులు పోతున్నాయి. నియోజకవర్గ పనులు పోతున్నాయి’ అని నాని తెలిపారు.

అంటే, మంత్రిగా ఉంటే.. రాష్ట్ర స‌మ‌స్య‌లు అన్నీ ప‌రిష్క‌రించాల్సి ఉంటుంద‌ని, అదే ఎమ్మెల్యే అయితే, త‌న నియోజ‌వ‌క‌ర్గంపై కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తే స‌రిపోతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లోనే కాదు 2009లో వైఎస్ రెండోసారి గెలిచిన‌ప్పుడు గుడివాడ‌లో నానిపైనే మంత్రిగా పోటీ చేసిన పిన్న‌మ‌నేని వెంక‌టేశ్వ‌ర‌రావు ఓడిపోయారు. ఇక 2014లో అప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా ఉన్న కొలుసు పార్థ‌సార‌థి ఓడిపోయారు. 1994లో పాల‌డ‌గు వెంక‌ట్రావు, 1999లో నెట్టెం ర‌ఘురాం ఓడిపోయారు. 2009లోనే మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ కూడా ఓడిపోయారు. ఇలా ఈ జిల్లాలో అప్ప‌టి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న వారు అంద‌రూ త‌ర్వాత ఎమ్మెల్యేలుగా గెల‌వ‌ని ప‌రిస్థితి. మొత్తానికి మంత్రిగా ఉంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో కొడాలి నాని కి ప‌క్షం రోజుల్లోనే భోద‌ప‌డిన‌ట్లుంది.

Tags:    

Similar News