వలస కూలీలను వదిలేశారుగా…చేతులు దులిపేసుకున్నారా?

దేశంలో ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం విధివంచితులైన వలస కూలీలకు శాపంగా మారింది. సుమారు వలసకూలీల నాలుగు కోట్లమంది వ్యధలు చుసిన వారికి హృదయం ద్రవించిపోతుంది. చివరికి [more]

Update: 2020-05-01 09:30 GMT

దేశంలో ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం విధివంచితులైన వలస కూలీలకు శాపంగా మారింది. సుమారు వలసకూలీల నాలుగు కోట్లమంది వ్యధలు చుసిన వారికి హృదయం ద్రవించిపోతుంది. చివరికి న్యాయస్థానాలు సైతం వారి సంగతి పట్టించుకోండి అని ఆదేశాలు ఇచ్చేదాకా కేంద్రం కనికరం చూపలేదు. వేలు, వందల కిలోమీటర్లు వారు కుటుంబాలతో సహా పాదయాత్రలు చేస్తూ సొంత గూటికి చేరుకునే పనిలో పడటం అందరిని కలచివేసింది. చివరికి కేంద్రం కోర్టు ఆదేశాలతో కదిలింది. వారిని బస్సుల్లో తరలించాలని అన్ని ఏర్పాట్లు చేయండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు సమన్వయంతో వీరి సమస్య తీర్చండి అంటూ ముక్తాయింపు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలకు మరోసారి తెరతీసింది.

బాధ్యత లేదా …?

విజయ మాల్యా వంటివారికి జైల్లో అన్ని వసతులు కల్పించండి అంటే దొంగలకు సైతం కోట్ల రూపాయలు సౌకర్యాల కోసం ఖర్చు చేసే కేంద్ర ప్రభుత్వం వలస కూలీల బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పడం విడ్డురంగా ఉంది. ఇప్పటికే ఏపీ లాంటి రాష్ట్రాలు ఆర్ధిక స్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి గుజరాత్ లో చిక్కుకున్న మత్సకారులను తరలించింది జగన్ సర్కార్. ఇలా ప్రతి రాష్ట్రం కూలీలను సొంత ఉరికి చేరుకోవడానికి కోట్లాది రూపాయలు వెచ్చించక తప్పదు.

ప్రత్యేక నిధి ఏర్పాటు చేయలేదా?

అదీ బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేస్తూ తరలించడం వారికి ఆహార, మంచినీటి సదుపాయాల కల్పన కష్టతరమే. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి కడు దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక నిధిని అన్ని రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలపై ఏర్పాటు చేస్తే వీరి సమస్య త్వరగా తీరే అవకాశం ఉంది. కానీ కేంద్రం రాష్ట్రాలకే వారి బాధ్యత అప్పగించడం ఎంతవరకు సమంజసం అన్నదే పలువురి వాదన. అయితే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో వలస కార్మికులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఊరట లభించింది.

Tags:    

Similar News