నాడు పంజా….. నేడు మెట్రో

సరిగ్గా 9 ఏళ్ల క్రితం…… మీకు గుర్తుండే ఉంటుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు, [more]

Update: 2019-09-26 00:30 GMT

సరిగ్గా 9 ఏళ్ల క్రితం…… మీకు గుర్తుండే ఉంటుంది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు, 10 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత అధికారులు హాడావుడి చేశారు. ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హుటాహుటిన ముగ్గురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. విచారణకు ఓ కమిటీని వేశారు. అంతే….. ఆ తర్వాత ఏమైంది.

మళ్లీ ఉద్యోగాల్లో…

సస్పెండైన అధికారులకు మళ్లీ ఉద్యోగాలొచ్చాయి…… కమిటీ నివేదిక బయటపడలేదు, దానిపై చర్యలు తీసుకోలేదు. ఇదీ మనం సాధిస్తున్న ప్రగతికి సవాల్ విసురుతోంది. టార్గెట్..టార్గెట్.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేద్దామన్న తొందరలో విలువలకు తిలోదకాలిస్తే జరిగే పరిణామాలు మన చేతుల్లో ఉండవని మరోసారి రుజువవుతోంది. అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేటలో మెట్రో పెచ్చులూడి మరో మహిళ దుర్మరణం చెందింది.

వారం రోజుల హడావిడే…

ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వారం రోజుల పాటు హడావుడి చేస్తారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తారు. కాని కాలక్రమేణా ఆ ఘటనలను అధికారులు మర్చిపోతారు. ప్రభుత్వాల పరిస్థితీ అంతే. ఇక ప్రతిపక్షాలకు ఇంకో విషయం దొరకగానే పాతది మరిచిపోతారు. చివరికి ప్రజలే అమాయకులవుతారు. ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ, హడావిడి చేసి మెదలుపెట్టిన మెట్రో రైలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెట్రో సంస్థ చేసిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు నగరవాసులకు శాపంగా మారుతున్నాయి.

సీరియస్ గా తీసుకోవడం లేదే?

మెట్రో ప్రారంభమై రెండు సంవత్సరాలు మాత్రమే గడుస్తున్నా, అప్పుడే ప్రయాణికులను యమపురికి దారులు వేస్తున్నాయి. కొంతకాలంగా మెట్రో స్టేషన్ల వద్ద పెచ్చులూడుతున్న ఘటనలు కూడా మెట్రో సంస్థ సీరీయస్ గా తీసుకోవడం లేదు. ఇటీవల భారీ వర్షం పడుతుందని మౌనికా అనే మహిళ తలదాచుకోవడానికి మెట్రో బ్రిడ్జి క్రింద నిలబడింది. తల దాచుకోవడానికి వస్తే తలబాదేస్తుందని మాత్రం ఆమె ఊహించలేదు. తీవ్రంగా గాయపడ్డ ఆమె మరణించింది.

గతంలోనూ……

మౌనిక ఘటనకు ముందు గతంలోనూ ఇలాగే పెచ్చులూడిన సందర్భాలున్నాయి. మెట్రో స్టేషన్ల కింది నుంచి వెళ్లే బైక్ రైడర్స్ పై పడ్డాయి. పెద్ద ప్రమాదం సంభవించకపోవటంతో అంతా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మౌనిక ప్రాణం పోవటంతో సమస్య పెద్దదైంది. దీనికి అసలు బాధ్యులెవరు ప్రభుత్వమా..? మెట్రో రైల్ సంస్థా….? ఎన్నో సంవత్సరాలు సేవలందించాల్సిన మెట్రో రెండేళ్లకే ఇలా ఉంటే, రానున్న రోజుల్లో ఇంకెలా ఉండాలి. ఇప్పుడు సరే భవిష్యత్ లో ఇలాంటి ప్రాణ నష్టాలకు ఎవరిది బాధ్యత అనేది ప్రశ్నార్థకంగా మారింది.

పెచ్చులు సరే… బ్రిడ్జీలే కూలిపోతే….?

ఎల్&టీ సంస్థ మెట్రో నిర్మాణాన్ని ప్రీకాస్టింగ్ విధానంలో నిర్మించింది. ముందుగానే స్టేషన్లు, బ్రిడ్జిలకు అవసరమైన వాటిని తయారు చేసి అవసరమున్న చోట బిగించేశారు. అప్పటికే నిర్మించిన పిల్లర్లకు, బిగించిన వాటికి మద్యలో ఉండే గ్యాప్ ను సిమెంట్ తో ఫిల్ చేశారు. దాన్ని చిన్న పనిగా చూస్తూ, సరిగ్గా ఫిల్ చేయకపోవటం సిమెంట్ తో చేసిన ఫిల్లింగ్ కు ఎక్కువ నాణ్యత వచ్చేలా నీళ్లు కొట్టకపోవటంతో అవి పెచ్చులూడుతున్నాయి. మెట్రో ట్రైన్ వెళ్ళేప్పుడు ఎక్కువగా ప్రకంపనలు ఉంటాయి. దాంతో సిమెంట్ మిశ్రమం ఆ ప్రకంపనలకు ఊడిపడిపోతుందంటున్నారు నిపుణులు.

మరి ఇప్పుడేం చేస్తారు….?

ఈ ఒక్క మహిళ మృతి ఘటనతోనే ఇది ముగిస్తే అందరికీ సంతోషమే. కాని ఇప్పుడు జనం ఆ మెట్రో బ్రిడ్జిల కింద నిలబడాలంటేనే సంకోచిస్తున్నారు. ఎక్కడ ఏం వచ్చి పడుతుందోననే భయాందోళనలో ఉంటున్నారు. కనీసం జనం రోడ్లపై భయం లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఓ వైపు నగర రహదారులన్నీ గుంతలమయం కాగా, మరోవైపు మెట్రో పెచ్చలూడుతూ ప్రభుత్వం, అధికారుల మనుగడనే ప్రశ్నిస్తోంది.

Tags:    

Similar News