ఆనందం-ఆవేద‌న రెండూ ఫిఫ్టీ.. ఫిఫ్టీ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి త‌ర్వాత అంతే కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వులు రెండు. వాటిలోనూ కీల‌క‌మైంది.. ఒక‌టే. అదే హోం శాఖ‌. రాష్ట్రంలో ఈ శాఖ‌పై ఉండే ఒత్తిడి.. ఈ [more]

Update: 2020-06-21 15:30 GMT

రాష్ట్రంలో ముఖ్యమంత్రి త‌ర్వాత అంతే కీల‌క‌మైన మంత్రి ప‌ద‌వులు రెండు. వాటిలోనూ కీల‌క‌మైంది.. ఒక‌టే. అదే హోం శాఖ‌. రాష్ట్రంలో ఈ శాఖ‌పై ఉండే ఒత్తిడి.. ఈ శాఖ‌పై ప్రజ‌ల‌కు ఉండే దృష్టి.. అదే స‌మయంలో ఈ శాఖ‌పై వ‌చ్చే విమ‌ర్శలు, అభినంద‌న‌లు కూడా అన్నీ ఇన్నీ కావు. ఈ శాఖకు మంత్రి కావాల‌ని క‌ల‌లు క‌నే నాయ‌కులు చాలా మంది ఉంటారు. అయితే, ఎలాంటి క‌ల‌లూ లేకుండానే .. ఈ శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన కీలక నాయ‌కురాలు.. హోం శాఖ మంత్రిగా చ‌క్రం తిప్పుతున్న మేక‌తోటి సుచ‌రిత‌. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంసాధించిన ఆమెకు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.

ఏడాది పూర్తయినా…..

జ‌గ‌న్ కోసం కాంగ్రెస్ నుంచి ప‌ద‌వులు వదులుకుని మ‌రీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన మేకతోటి సుచరితకు ఆ త్యాగానికి ఫ‌లితంగా వైసీపీ అధినేత‌.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చీ రావ‌డంతోనే హోం శాఖ ప‌ద‌విని అప్పగించారు. నిజానికి ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామంతో వైసీపీ నేత‌లు ఉలిక్కిప‌డ్డారు. అయితే, ఇప్పుడు ఆమె మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టి ఏడాది పూర్తయింది. మ‌రి ఈ ఏడాది కాలంలో సుచ‌రిత ప్రోగ్రెస్ ఏంటి? ఆమె దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారా? లేక‌.. నిర్ణయాల‌ను అనుస‌రించారా? మ‌ధ్యలో ఏమైనా వివాదాలు చోటు చేసుకున్నాయా? అంటే.. ఫిఫ్టీ-ఫిఫ్టీ అనే చెప్పాలి. కీల‌క‌మైన శాఖ‌కు సంబంధించి చూస్తే.. అధికారుల బ‌దిలీల విష‌యంలో స్వయంగా కుటుంబ స‌భ్యుల ప్రమేయం ఉండ‌డంతో జ‌గ‌న్ స్వయంగా వాటిని ప‌రిశీలించాల్సి వ‌చ్చింద‌ని సీఎంవో వ‌ర్గాలు ఇప్పటికీ చెబుతాయి.

అంతా సీఎంఓనే….

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో తాను హోం మంత్రి అయిన‌ప్పటికీ.. కీల‌క‌మైన శాంతి భ‌ద్రతల విష‌యంలో అధికారం మాత్రం పూర్తిగా సీఎం జ‌గ‌న్ ద‌గ్గరే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో కేవ‌లం ఆమె హోం మంత్రిగా మేకతోటి సుచరిత సంత‌కాల‌కు మాత్రమే ప‌రిమిత‌మ‌య్యార‌నే వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తూ ఉంటుంది. అయితే, విప‌త్తుల నిర్వహ‌ణ‌, ఫైర్ సేవ‌లు వంటి విష‌యంలో మాత్రం పూర్తిగా మంత్రి చూస్తున్నారు. ఇక‌, దిశ పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటులోనూ సుచ‌రిత కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో త‌నసొంత జిల్లా గుంటూరులో చెల‌రేగిన అమ‌రావ‌తి ఉద్యమం విష‌యంలో ఆమె ప్రభుత్వం త‌ర‌పున స‌మ‌ర్థవంతంగా వ్యవ‌హ‌రించ లేక‌పోయారు.

లాక్ డౌన్ సమయంలోనూ….

దీనిని కూడా పూర్తిగా జ‌గ‌న్‌తో పాటు జిల్లాకు చెందిన ఇత‌ర కీల‌క నేత‌లే చూసుకోవాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఇదే జిల్లాలో టీడీపీ నేత‌ల‌ను హ‌త్య చేస్తున్నార‌ని, ఊరు నుంచి వెళ్లగొడుతున్నార‌ని చంద్రబాబు ఆరోప‌ణ‌లు, మ‌హిళా క‌మిష‌న్ నేరుగా వ‌చ్చి ప‌ర్యటించ‌డం వంటివి.. సుచ‌రిత వ్యూహాన్ని మించిపోయాయి. దీంతో ఆమె విమ‌ర్శలు ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆమె ఇంటికే ప‌రిమితం కావ‌డం, ప‌ర్యవేక్షణ మొత్తం.. వ‌దులు కోవ‌డం వంటివి కూడా విమ‌ర్శల‌కు అవ‌కాశం ఇచ్చాయి. ఇక మేకతోటి సుచరిత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ యేడాదిగా చేసిన మేజ‌ర్ పనులు లేవ‌నే నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు అంటున్నారు. హోం మంత్రి స్థాయిలో ఉండి నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత‌గా అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెపుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఏడాది కాలంలో మంత్రిగా సుచ‌రిత ప్రోగ్రెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్పాలి.

Tags:    

Similar News