జగన్ తో మెగా దూరమేనా… ?

టాలీవుడ్ పెద్దగా ఉంటున్న మెగా స్టార్ చిరంజీవి జగన్ విషయంలో గత రెండేళ్ళుగా సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చి [more]

Update: 2021-06-08 05:00 GMT

టాలీవుడ్ పెద్దగా ఉంటున్న మెగా స్టార్ చిరంజీవి జగన్ విషయంలో గత రెండేళ్ళుగా సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మరీ అభినందనలు తెలిపారు. ఆ తరువాత సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద సినీ ప్రముఖులందందరితోనూ కలసి వచ్చి జగన్ తో చర్చలు జరిపారు. ఈ మధ్యలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు, కర్నూలు లో విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని కూడా చిరంజీవి స్వాగతించి జగన్ ని ఖుషీ చేశారు. తెలుగు సినిమా రంగంలో రాజకీయాలు ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం జగన్ విషయంలో సపోర్ట్ గానే ఉంటున్నారు.

బాధ పడ్డారా…?

ఇక కరోనా వేళ ఏపీతో పాటు తెలంగాణాలో చిరంజీవి ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. దానికి తన సొంత నిధులను వెచ్చిస్తున్నారు. అయితే తాను చేస్తున్న సేవలకు అనుకున్నంతగా ప్రచారం రాకపోవడంతో చిరంజీవి బాధపడ్డారని తాజాగా ఒక తెలుగు పత్రికాధిపతితో ఆయన జరిపిన ఫోన్ సంభాషణ తెలియచేస్తోంది. ఇది లీక్ కావడం వెనక ఎవరు ఉన్నారన్నది పక్కన పెడితే మెగాస్టార్ మాత్రం రాజకీయ నాయకుల తీరుని తప్పుపట్టిన విధానం మాత్రం ఆయనలో దాగున్న ఆక్రోశాన్ని వెల్లడించింది.

ఫుల్ సైలెంట్ గా …

మరో వైపు చూస్తే తెలంగాణాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. అదే సమయంలో ఏపీలో మాత్రం స్పందన నిల్ గా ఉంది. దీంతో ఎందుకిలా అన్నదే చర్చగా ఉంది. చిరంజీవికి జగన్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఆయన తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి జగన్ మీద పోరాడుతున్నా కూడా తాను మాత్రం మంచి పని చేసిన ప్రతీ సారి జగన్ ని మెచ్చుకుంటూ వస్తున్నారు. అలాంటిది ఏపీలో కరోనా రెండవ దశలో ఎవరు ఏ చిన్న సాయం చేసినా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిందే. పైగా మెగాస్టార్ వంటి సినీ దిగ్గజం ముందుకు రావడాన్ని కచ్చితంగా అభినందించితీరాలి. కానీ వైసీపీ నుంచి అనుకున్న స్పందన ఎందుకు రావడం లేదు అన్నదే చర్చగా ఉందిట.

హింట్ అందిందా…?

చిరంజీవి రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన తమ్ముడు పవన్ ఎటూ జగన్ వైరి శిబిరంలో ఉన్నారు. మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికల్లో జగన్ ని గద్దె దించడానికి పవన్ చేయాల్సినది అంతా చేస్తారని అందరికీ తెలుసు. ఇక చిరంజీవిలో కూడా రాజకీయ కాంక్షలు ఇంకా ఇంకిపోలేదని ప్రచారం కూడా సాగుతోంది. ఈసారి మెగా బ్రదర్స్ అంతా కలసి ఒక పట్టు పడతారని కూడా అంటున్నారు. బీజేపీతో పొత్తు ఎలాగూ ఉంటుంది. దాంతో సరైన సమయంలో మెగాస్టార్ కూడా రాజకీయ రంగంలోకి దిగుతారు అన్నది వినిపిస్తున్న మాట. బహుశా ఇలాంటివేవో వైసీపీ పెద్దల చెవి దాకా రావడంతోనే మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీకి ఆక్సిజన్ అందివ్వరాదనే ఈ విధంగా సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక్కడ మరో విషయమూ ఉందిట. సినీ పరిశ్రమను ఏపీలో అభివృద్ధి చేసేందుకు తాను ఎంత చొరవ తీసుకున్నా కూడా అటు నుంచి సహకారం లేదన్న బాధ కూడా జగన్ లో ఉందిట. పైగా సినీ పెద్దలు అంతా టీయారెస్ సర్కార్ కి బాహాటంగా మద్దతు ఇవ్వడం వంటివి కూడా మెగా దూరం పెరగడానికి కారణం అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.

Tags:    

Similar News