పవర్ రాకపోయినా… శాసిస్తే చాలట

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఆమె పాత్రను కాదనలేం. ప్రతి రాష్ట్రంలో తన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించారు. అయితే [more]

Update: 2021-02-26 17:30 GMT

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఆమె పాత్రను కాదనలేం. ప్రతి రాష్ట్రంలో తన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించారు. అయితే చివరకు సొంత రాష్ట్రంలోనే డీలా పడ్డారు. బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి పరిస్థితి ఇది. జాతీయ నేతగా ఉన్న మాయావతి ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ కే పరిమితమయ్యారు. ప్రధానంగా 2014 నుంచి మాయావతి ప్రభ తగ్గుతూ వస్తోంది.

మరో ఏడాదిలోనే…..

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో లేకపోయినా మాయావతి కేంద్రంలో పెత్తనం చేసేవారు. 2014 వరకూ దశాబ్దకాలం పాటు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండటంతో మాయావతి కూడా నిత్యం వార్తల్లోకెక్కేవారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాయావతి మౌనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కనీస పనితీరును మాయావతి కనపర్చేందకు ప్రయత్నిస్తున్నారు.

జిల్లాల వారీగా సమీక్షలు….

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మాయావతి అన్నిరకాలుగా సిద్ధమయ్యారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి మాయావతి పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది. అందుకే అభ్యర్థుల ఎంపికను తానే దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడేవారికే టిక్కెట్లు అని మాయావతి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజల్లో మంచి పేరుండి, ఆర్థికంగా బలవంతులైన వారికే ఈసారి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలన్నది మాయావతి ఉద్దేశ్యంగా ఉంది.

కింగ్ మేకర్ అవ్వాలని….

దీనికి తోడు మాయావతి అన్ని జిల్లాల పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో అన్ని జిల్లాల్లో పర్యటించి క్యాడర్ లో జోష్ నింపాలన్నది మాయావతి ఉద్దేశ్యంగా ఉంది. గతంలో పొత్తులు పెట్టుకోవడంతో కొన్ని చోట్ల నేతలు డీలా పడ్డారు. వారందరిని సముదాయించే పనిలో మాయావతి ఉన్నారు. ఈసారి అధికారంలోకి రాలేకపోయినా కింగ్ మేకర్ అవ్వాలన్న లక్ష్యంతో ఉన్నారు. నేరుగా అధికారంలోకి రాకపోయినా ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండాలన్నది మాయావతి ఆలోచన. ఆ మేరకే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News